ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
అధికారికంగా ప్రకటించిన ఉన్నత విద్యా మండలి..
అన్ని సెట్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు
ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 5వరకు పెంపు
ప్రవేశ పరీక్షల కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సెట్స్) వాయిదా వేసినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. లాక్డౌన్ను ఈ నెల 30 వరకు పొడిగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే అన్ని సెట్స్ దరఖాస్తుల గడువు ఈ నెల 20 వరకు గతంలో పొడిగించామని తెలిపారు. తాజాగా పరీక్షలను వాయిదా వేసిన నేపథ్యంలో దరఖాస్తుల గడువును మే 5 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే నెల 5 వరకు ఆయా సెట్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ముందస్తు షెడ్యూలు ప్రకారం.. మే 2న ఈసెట్, 4, 5, 7, 9, 11 తేదీల్లో ఎంసెట్, మే 13 నుంచి పీఈసెట్, మే 20, 21 తేదీల్లో ఐసెట్, 23న ఎడ్సెట్, 27న లాసెట్, 28 నుంచి 31వ తేదీ వరకు పీజీఈసెట్ నిర్వహించాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో వాటన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు వివరించారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న వివరాలను తరువాత ప్రకటిస్తామని తెలిపారు.