గ్రామాలకు ఏది జ్యోతి! | Adopted by the police in rural No development | Sakshi
Sakshi News home page

గ్రామాలకు ఏది జ్యోతి!

Mar 17 2017 3:07 AM | Updated on Jul 26 2019 5:58 PM

రాష్ట్రంలో ప్రజాప్రతి నిధులు.. అధికారులు.. పోలీసులు దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి. గ్రామాలను ఎంపిక చేసుకుని రెండున్నరేళ్లు పూర్తయినా..

సాక్షి, జగిత్యాల: రాష్ట్రంలో ప్రజాప్రతి నిధులు.. అధికారులు.. పోలీసులు దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి. గ్రామాలను ఎంపిక చేసుకుని రెండున్నరేళ్లు పూర్తయినా.. సగానికి పైగా గ్రామాల్లో గుర్తిం చిన పనులు ఇంకా మొదలే కాలేదు. పనులకు సంబంధించి ప్రత్యేక నిధులు మంజూరు కాకపోవడం.. కొత్త జిల్లాల ఏర్పాటు వంటి అంశాలు దత్తత గ్రామాల్లో అభివృద్ధికి అవరోధాలుగా మారాయి. దీంతో దత్తత తీసుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ గ్రామాల వైపే రావడం మానేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల గుర్తింపు.. మంజూరు.. నిర్మాణాల బాధ్యతంతా గ్రామస్థాయిలోనే జరిగేలా సీఎం కేసీఆర్‌ ఆగస్టు 17, 2014న ‘గ్రామజ్యోతి’ పథకానికి శ్రీకారం చుట్టారు.

 కార్యక్రమం ప్రారంభోత్సవం రోజు నుంచి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ప్రజాప్రతినిధులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు), అధికారులు, పోలీసులు ఒక్కో గ్రామా న్ని ఎంపిక చేసుకుని దత్తత తీసుకున్నారు. పాత జిల్లాల్లో మొత్తం 96 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 8,695 గ్రామ పంచాయతీలుండగా, అందులో 2,587 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ప్రజాప్రతినిధులు 1,013 గ్రామాలను, జిల్లా స్థాయి అధికారులు 1,030, పోలీసులు 544 చొప్పున గ్రామాలను ఎంచుకున్నారు. గ్రామాల అభివృద్ధి బాధ్యత తమదేనంటూ పల్లె ప్రజలకు భరోసా ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పర్యటించి.. విడతల వారీగా చేపట్టాల్సిన ముఖ్యమైన పనుల ను గుర్తించారు. ఆయా పనుల నిర్వహణ కోసం జిల్లాల వారీగా ఏటా అయ్యే నిధుల వివరాలను అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతి పాదనలూ పంపారు. ఒక్కో జిల్లా నుంచి రూ. 500 కోట్లకు తగ్గకుండా ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. అప్పట్లో ప్రభుత్వం నుంచి గ్రామజ్యోతి పథకానికి ప్రత్యేక నిధులు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వమూ దీనికి సానుకూలంగా స్పందించింది. కానీ, పథకం ప్రారంభమై రెండేళ్లు గడిచినా ప్రభుత్వం నుంచి నయాపైసా విడుదల కాలేదు. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు తాము గుర్తించిన పనులకయ్యే ఖర్చును 14 ఆర్థిక సంఘం నిధుల నుంచి కేటాయించగా కొన్ని చోట్ల సర్పంచులు దీనికి నిరాకరించారు.

 చివరకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానికంగా అందుబాటులో ఉన్న నిధులతో పనులు చేయించారు. మిగతా గ్రామాల్లో పను లు పడకేశాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్తగా కలెక్టర్లు.. ఎస్పీలు.. జిల్లాస్థాయి అధికారుల సంఖ్య పెరిగింది. దీంతో మరిన్ని గ్రామాలను దత్తత తీసుకునే వీలు న్నా.. నిధుల సమస్యతో అధికారులు దత్తత నిర్ణయంపై సాహసించడం లేదు. ఈ విషయమై జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి ఏసు రాజన్నను సంప్రదించగా ‘దత్తత గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధుల కేటాయింపులు జరగలేదు. అప్పట్లో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచే పలు చోట్ల పనులు జరిగాయి.’అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement