పీజీఈసెట్‌లో 89 శాతం ఉత్తీర్ణత 

89% pass in PGECET - Sakshi

ఫలితాలు విడుదల చేసిన ప్రవేశాల కమిటీ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఎంఈ/ఎంటెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (పీజీఈసెట్‌)లో 89.62 శాతం మంది అర్హత సాధించారు. మే 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్ష రాసేందుకు 25,100 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 22,461 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 20,131 మంది (89.62 శాతం) అర్హత సాధించారు.

దరఖాస్తు చేసిన వారిలో బాలికలు 11,223 మంది, బాలురు 11,238 మంది ఉన్నారు. 17 రకాల కోర్సుల్లో ప్రవేశాలకు పీజీఈసెట్‌ రాత పరీక్షలు జరిగాయని, ఇందులో 16 కోర్సులు ఇంజనీరింగ్, ఒకటి ఎం.ఫార్మసీ కోర్సు ఉందని పాపిరెడ్డి అన్నారు. ఓయూ వీసీ, పీజీఈసెట్‌ చైర్మన్‌ రామచంద్రం మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో 168 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 8,374 సీట్లు ఉన్నాయని, వాటిలో 7,523 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. ఈ విద్యా సంవత్సరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మైనింగ్‌ కోర్సును ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఎంటెక్‌ మైనింగ్‌లో 18 సీట్లుంటాయన్నారు.  

తగ్గుతున్న విద్యార్థులు.. 
ఈ విద్యా సంవత్సరం పీజీ ఇంజనీరింగ్‌ సీట్లు తగ్గే అవకాశం ఉందని, కోర్సును శ్రద్ధగా చదవాలనుకునే విద్యార్థులే చేరుతున్నారని పాపిరెడ్డి వివరించారు. నిరంతర తనిఖీలు, బయోమెట్రిక్‌ విధానం ప్రవేశపెట్టడం, పరీక్షలు రాయాలంటే హాజరు శాతం తప్పనిసరి చేయడం వంటి కారణాలతో పీజీఈసెట్‌కు దరఖాస్తు చేసే వారి సంఖ్య ఏటా తగ్గుతోందన్నారు. 2015 విద్యా సంంవత్సరంలో 48,992 మంది దరఖాస్తు చేసుకోగా, 2016 విద్యా సంవత్సరంలో 44,058 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు.

ఇక 2017 విద్యా సంవత్సరానికి వచ్చేసరికి 37,423 మంది దరఖాస్తు చేసుకున్నారని, 2018 విద్యా సంవత్సరంలో 25,100 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. భవిష్యత్తులో సివిల్‌ ఇంజనీరింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని పాపిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావు, పీజీఈసెట్‌ కన్వీనర్‌ సమీనా ఫాతిమా, కో కన్వీనర్‌ రమేశ్‌బాబు, లాసెట్‌ కన్వీనర్‌ ద్వారకానాథ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top