చెరువు శిఖం.. మాయం | 40 acres of land grabbing | Sakshi
Sakshi News home page

చెరువు శిఖం.. మాయం

Apr 21 2016 1:15 AM | Updated on Sep 3 2017 10:21 PM

పరకాల పట్టణ నడిబొడ్డున ఉన్న విలువైన భూమిపై కబ్జాదారులు కన్నేశారు. దామెర చెరువు శిఖం భూమిపై రెక్కలు కట్టుకుని వాలుతున్నారు.

ఇప్పటికే 40 ఎకరాలు కబ్జా 
పోటీపడి వాలుతున్న  అక్రమార్కులు
తాజాగా మూడెకరాల ఆక్రమణకు యత్నం
అంతుచిక్కని  రెవెన్యూ అధికారులు మౌనం

 

పరకాల :  పరకాల పట్టణ నడిబొడ్డున ఉన్న విలువైన భూమిపై కబ్జాదారులు కన్నేశారు. దామెర చెరువు శిఖం భూమిపై రెక్కలు కట్టుకుని వాలుతున్నారు. అసలు శిఖం భూమా.. లేక పట్టా భూమా అనే విషయం రెవెన్యూ అధికారులు వెల్లడించకపోవడంతో ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నారుు. శిఖం భూమిని రక్షించాలని పలువురు నేరుగా ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడం చూస్తే వీరి పాత్రపైనా అనుమానాలు కలుగుతున్నారుు. గతంలో కబ్జాకు గురైన భూమిని వెలికి తీయడంలో వెనుకంజ వేసిన అధికారులు ఇప్పుడు మరో ఆక్రమణ జరుగుతుంటే కూడా నోరు మెదపడం లేదు. కాకతీయుల కాలంనాటి దామెర చెరువు శిఖం భూమి రోజురోజుకూ తగ్గిపోతోంది. రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 604లో దామెర చెరువు శిఖం భూమి 103 ఎకరాల 20గుంటలు ఉంది. కానీ, ఇప్పుడు సుమారు 40 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. అక్రమార్కులు  దర్జాగా కబ్జా చేయడంతో 2012లో అప్పటి జారుుంట్ కలెక్టర్‌కు పట్టణ ప్రజలు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో స్వయంగా జేసీ దామెర చెరువు వద్దకు వచ్చి విచారణ జరిపారు. 30 ఎకరాలు కబ్జాకు గురైనట్లు గుర్తించి నోటీసులను సైతం అందించారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు గానీ నోటీసుల విషయం అటకెక్కింది.

 

ట్యాంక్‌బండ్ పనులతో తెరపైకి..

పట్టణం క్రమంగా విస్తరిస్తుండడంతో దామెర చెరువు ఆయకట్టు కింద నివాస ప్రాంతాలు వెలిశాయి. పారకం లేక చెరువులోనే నీళ్లు నిల్వ ఉంటున్నారుు. సమ్మర్ స్టోరేజీగా ఉపయోగించాలని చాలా రోజుల నుంచి ప్రజలు కోరుతూ వస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో దామెరు చెరువు అభివృద్ధికి   తొలి అడుగు పడింది. మినీ ట్యాంకుబండ్‌గా తీర్చిదిద్దడం కోసం రూ.3.80కోట్లు మంజూరయ్యాయి. రెవెన్యూ అధికారులు హద్దులు నిర్ణయించి ఇరిగేషన్ అధికారులకు అప్పగిస్తే పనులు చేయాలి. కానీ తూతూమంత్రంగా సర్వేను చేసి అప్పగించడంతో తరుచూ వివాదం తలెత్తుతోంది. చెరువు శిఖంలో తమ భూమి ఉన్నదని కొందరు అంటున్నారు. గజం భూమికి వేలల్లో ధర పలుకుతుండడంతో అక్రమార్కులు ఏదో సాకుతో శిఖంపై వాలుతున్నారు. తాజాగా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి దామెర చెరువు భూమిలో తమకు మూడు ఎకరాల భూమి ఉందని బుధవారం పూడిక మట్టితో నింపడం ప్రారంభించడంతో స్థానికులు అడ్డుకున్నారు. చెరువు మధ్యలోకి పోయి మరీ మట్టిని పోసి చదును చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయూన్ని స్థానికులు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. చివరకు కలెక్టర్‌కు సమాచారం అందించడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు మట్టి పోయవద్దని నిలిపివేశారు. ఇప్పటికైనా చెరువు భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement