breaking news
-
‘నేను అందుకే బీఆర్ఎస్ నుంచి బయటకి వచ్చా’
హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు బయటకి వచ్చింది కేసీఆర్, కేటీఆర్ వల్లేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి విమర్శించారు. కవిత చెప్పినట్లు హరీష్రావు వల్ల ఎవరూ పార్లీని వీడలేదని, కేవలం కేసీఆర్, కేటీఆర్ల వల్లే పార్టీనే వీడారన్నారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 4వ తేదీ) సాక్షి టీవీతో మాట్లాడిన కొండా విశ్వేశ్వర్రెడ్డి.. ‘కేసీఆర్, కేటీఆర్ అహంకారం, అవినీతి వల్లే నేను బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాను. కంట్రోల్ మొత్తం కేసీఆర్, కేటీఆర్ చేతిలోనే ఉంది. కవిత ఏమైనా సుద్ధపుసనా.. ఆమె అవినీతి చేయలేదా?, కాళేశ్వరం అవినీతి మొత్తం కేసీఆర్దే. హరీష్ కూడా కేవలం సంతకాలు చేయడానికే పరిమితం. రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ఒక్కటే సీబీఐకి ఇచ్చారు. కాళేశ్వరం మొత్తం సీబీఐకి ఇవ్వాలి . కవితను బీజేపీ వైపు కూడా చూడనివ్వం. తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్ట్ కడతానని రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నా. ప్రాణహిత జలాలు చేవెళ్ల వరకు తేవడం తెలివి తక్కువతనమే. ఎకరాకు రెండు లక్షలకు పైగా ఖర్చు చేసి చేవెళ్ల కు నీళ్ళిచ్చే బదులు... చేవెళ్ల రైతులకు ఎకరాకు 20 వేల రూపాయల రైతుబంధు ఇవ్వాలి’ అని అన్నారు. -
రేపు తెలంగాణకు అమిత్ షా: రామచందర్ రావు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు(శుక్రవారం) తెలంగాణలో పర్యటిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కవితలాంటి అవినీతి పరులకు బీజేపీలో స్థానం లేదు అని ఘాటు విమర్శలు చేశారు.బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్, వన్ నేషన్.. వన్ లా, వన్ నేషన్.. వన్ ట్యాక్స్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పన్ను వ్యవస్థను సరళీకరణ చేయడం హర్షణీయం. మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేకూరేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పన్నుల భారం తగ్గింపు నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోదీకి పాలాభిషేకం చేస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. అమిత్ షాను టీబీజేపీ నేతలు కలుస్తారు.. ఈ సమావేశంపై కొద్దిసేపట్లో క్లారిటీ వస్తుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో తెలంగాణ బీఆర్ఎస్ రాజకీయాలు, కవిత ఎపిసోడ్పై రామచందర్ రావు స్పందిస్తూ..‘కవిత విషయంపై మాట్లాడాల్సిన అవసరం లేదు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో ఎటువంటి లోపం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
కాళేశ్వరం తలనొప్పి ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే కాదు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తోందా? శాసనసభలో ఒకలా.. హైకోర్టులో ఇంకోలా వాదనలు వినిపించడం ఈ అనుమానానికి తావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం ఆదివారం హడావుడిగా శాసనసభ పెట్టి సీబీఐ విచారణకు ఇవ్వాలని నిర్ణయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు ఇప్పటికీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయం తరువాత విచారిస్తామని ప్రభుత్వం సీబీఐకు అప్పగిస్తున్నట్లు ప్రకటించడంతో హైకోర్టు కేసీఆర్, హరీశ్రావులపై తదుపరి చర్యలను నెల పాటు నిలిపివేసింది. ఈ కేసులో ఆడ్వకేట్ జనరల్ వాదన ఆసక్తికరంగా ఉంది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు, సీబీఐ విచారణకు సంబంధం లేదని, జాతీయ డామ్ సేఫ్టీ అధారిటీ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కోరామని ఆయన వెల్లడించారు. అదే నిజమైతే కమిషన్ నివేదికపై అసెంబ్లీ చర్చ ఎందుకన్న ప్రశ్న వస్తుంది. పైగా ఈ చర్చ జరిగిన తీరు చూస్తే బీఆర్ఎస్తోపాటు, కాంగ్రెస్, బీజేపీలు కూడా ఈ రొంపిలో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది.శాసనభలో తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వాదనను గట్టిగా వినిపించి బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసినట్లు అనిపించింది. కాని ఆ తర్వాత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తన వాదనను సమర్థంగా వినిపించడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిందా అనిపించింది. సీఎంతోపాటు పలువురు మంత్రుల ఆరోపణలకు హరీశ్ ధీటుగా ఆధారసహితంగా జవాబిచ్చారు. ఒక దశలో హరీశ్ ప్రసంగం కొనసాగకుండా చేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత వారు ఘోష్ కమిషన్ నివేదిక చెత్త అని, అది పీసీసీ నివేదిక అంటూ విమర్శలు చేసి వాకౌట్ చేశారు. పిమ్మట మరికొందరు మాట్లాడిన అనంతరం ఈ నివేదికపై తదుపరి విచారణ చేసి చర్యలు తీసుకోవడానికిగాను సీబీఐకి అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తీసుకున్న నేపథ్యంలో సీబీఐకి అప్పగిస్తున్నట్లు చెబుతున్నా అది సమర్థనీయంగా అనిపించదు. ఈ నిర్ణయం వ్యూహాత్మకమా? చిత్తశుద్దితో చేసిందా? అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ కోర్టులోకి బాల్ నెట్టి లాభం పొందుదామన్నది కాంగ్రెస్ ప్రయత్నమా? కేంద్రం అనుమతించకపోతే బీజేపీ, బీఆర్ఎస్ల కుమ్మక్కు అని ప్రచారం చేయవచ్చు. అనుమతిస్తే దాని ప్రభావం బీఆర్ఎస్పై ఉండనే ఉంటుందన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. భవిష్యత్తులో బీజేపీ, బీఆర్ఎస్ల పొత్తు అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో సీబీఐ తీరును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ సంస్థ సహాయం కోరడం ఏమిటన్నది కొందరి ప్రశ్న. బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఇదే అంశంపై ఒక ప్రకటన చేశారు. దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో అస్త్రాలుగా మారాయని గతంలో రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను కేటీఆర్ ప్రస్తావించారు. అదే సంస్థను రేవంత్ ఎలా విశ్వసిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ కు కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. సీబీఐ, ఈడీల కారణంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ కూడా కొన్ని రోజుల క్రితం సీబీఐని విమర్శిస్తూ స్పీచ్ ఇచ్చారు. కాని ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్పై సీబీఐ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. దీనిద్వారా రేవంత్ తన చేతిలోని ఆయుధాన్ని బీజేపీకి అప్పగించారా అన్న ప్రశ్న కూడా వస్తోంది.కేంద్రం సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బీఆర్ఎస్ కాస్త ఇబ్బంది పడవచ్చు. సీబీఐ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్రావు తదితరులను అరెస్టు చేస్తుందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేము కానీ.. ఈలోగా కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధినేత అసమ్మతి నేతగా మారి చేసిన ప్రకటన ఆ పార్టీలో ప్రకంపనలకు దారి తీసింది. హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోష్లకే కాళేశ్వరం స్కామ్ సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. అయితే బీఆర్ఎస్ నుంచి కవితకు పెద్ద మద్దతు అయితే రాలేదు. అందరూ హరీశ్రావు వెంబడే నిలబడ్డారు. అయినా సరే.. కవిత వ్యాఖ్యలతో పార్టీకి కొంత నష్టమైతే జరిగింది. ఈ మొత్తం వ్యవహారం రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందని భావిస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. కేసీఆర్కు సానుభూతి వస్తుందనుకుంటే ముందుకు వెళ్లకపోవచ్చు.లేదా బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడానికి కూడా యత్నించవచ్చు. ఈ పరిణామాలేవీ తెలంగాణ బీజేపీకి అంతగా రుచించినట్లు అనిపించడం లేదు. ఒకప్పుడు బీజేపీ కాళేశ్వరంపై సీబీఐ విచారణ డిమాండ్ చేసేది. కాని ఇప్పుడు ఆ పక్షం ఈ పరిణామంతో కాస్త ఇబ్బంది పడినట్లు అనిపిస్తుంది. ఆ పార్టీ నేత మహేశ్ రెడ్డి సీబీఐ విచారణను స్వాగతించినట్లు కనిపించలేదు. ఎందుకింత హడావుడిగా ఒకరోజు సమావేశం పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కాలయాపన చేశారని, ముందుగానే ఈ కేసును సీబీఐకి అప్పగించి ఉండాల్సిందని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. సీబీఐ దర్యాప్తును చేపడితే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈయన పాత్రను కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ తప్పు పట్టింది. కమిషన్ విచారణ సందర్భంగా ఈటెల ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని చెప్పారు. కమిషన్ మాత్రం దానిని పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. పలువురు ఐఎఎస్ అధికారులు కూడా సీబీఐ విచారణ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ ఐదేళ్లు ఈ వ్యవహారం ఒక రాజకీయ రచ్చగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆరోపణలు చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఘోష్ కమిషన్ ఎక్కువ భాగం సాంకేతిక అంశాలకే పరిమితం అయినట్లు అనిపిస్తుంది. అవినీతి జరిగి ఉంటే ఏ రకంగా జరిగిందన్నదానిపై నివేదికలో పెద్దగా పరిశీలన లేదు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన తుమ్మిడి హెట్టి వద్ద నీరు తగినంత ఉన్నా, దానిని మార్చి మేడిపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్చించారన్నది ఘోష్ కమిషన్ వ్యాఖ్య. దానిని హరీశ్ రావు తోసిపుచ్చుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పులు చేయలేదని కాదు. ఆ రోజుల్లో కేసీఆర్ తన మాటే శాసనంగా ప్రభుత్వాన్ని నడిపారు. సాంకేతికపరమైన అంశాలను కూడా ఆయనే డీల్ చేయడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తోంది. అదే రీతిలో పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉంది. ఈ కమిషన్ కొంతమంది అధికారుల జోలికి అసలు వెళ్లకపోవడంపై కూడా విమర్శలు ఉన్నాయి. రేవంత్ కాని, మంత్రులు కాని ప్రధానంగా రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ కి సంబంధించి ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించే యత్నం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మేడిగడ్డను వ్యతిరేకించలేదని రిపోర్టులోని అంశాలను హరీశ్ ఎత్తిచూపారు. ఘోష్ కమిషన్ వద్ద ఉన్న ఈ కమిటీ రిపోర్టును హరీశ్ ఉటంకించడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఆ మీదట.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రిపోర్టు మీరే రాయించి ఉంటారని అనడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడినట్లయింది. అలాగే మరో మంత్రి జూపల్లి కృష్ణారావు తుమ్మిడి హెట్టికి, మేడిగడ్డకు మధ్య గోదావరిలో కలిసే వాగులు, ఏరులు లేవని చేసిన వ్యాఖ్యకు సంబంధించి సమాధానం ఇస్తూ ఎన్ని వాగులు గోదావరిలో కలిసేది ఒక పెద్ద జాబితానే చదివారు. దాంతో జూపల్లి వాదన వీగిపోయింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావించడంతో ఆ రోజుల్లో టీఆర్ఎస్లో ఉండి ఆయనేమి మాట్లాడారో, ట్వీట్ చేశారో చూపించారు. జాతీయ డ్యామ్ భద్రత అధారిటీ విచారణ గురించి ఉత్తం చెప్పారు. అసలు ఆ అధారిటీ ని కేంద్రం ఏర్పాటు చేస్తూ బిల్లు తీసుకువచ్చినప్పుడు ఎంపీగా ఉన్న ఉత్తం దానిని వ్యతిరేకించారని, రాష్ట్రాల హక్కులను హరించడమే అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మాట్లాడితే లక్ష కోట్ల దోపిడీ అంటూ రేవంత్, మంత్రులు మాట్లాడినా, అది ఏరకంగా జరిగిందన్నది వివరంగా చెప్పలేదు. ఏదో సాధారణ రాజకీయ విమర్శగానే చేశారు. దానికి హరీశ్ బదులు ఇస్తూ కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మాత్రమే ప్రాజెక్టు కాదని, 15 రిజర్వాయిర్లు, కిలోమీటర్ల కొద్ది టన్నెళ్లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, మొదలైన వాటి జాబితాను వివరించారు. అసలు మొత్తం ప్రాజెక్టు వ్యయం లక్ష కోట్లు అయితే, లక్ష కోట్ల దోపిడీ అని ఆరోపించడంలో హేతుబద్దత కనిపించదు. అయితే మేడిగడ్డ వద్ద బారేజీ దెబ్బతింటే అసలు నీరు అందుబాటులో ఉండదని, అలాంటప్పుడు ఈ ప్రాజెక్టు నిరర్థకం అవుతుందని ఉత్తం అనడంలో కొంత అర్థం ఉంది.కాని ఆ బ్యారేజీలు పూర్తిగా దెబ్బతిని ఉంటే ఆ సమస్య వస్తుంది కాని, లేకుంటే వాటిని వాడుకునే అవకాశం ఉంటుంంది.దానిని రిపేరు చేసి వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం యత్నించకపోతే కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గురి అవుతుంది. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వం ఒకవైపు 18 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తున్నట్లు చెబుతూ,మరోవైపు అందుకు విరుద్దంగా మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. ఈ మొత్తం చర్చలో ఈ నిర్మాణం చేసిన కాంట్రాక్టు సంస్థలను ఏ రాజకీయ పార్టీ పెద్దగా తప్పు పట్టకపోవడం గమనించవలసిన అంశమే.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఉప ఎన్నికపై దృష్టి పెట్టండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ నాయకులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. ఎర్రవల్లి నివాసంలో బుధవారం పార్టీ అధినేత కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, జి.జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ సంతోష్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ తరహా ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, దానిని పార్టీకి అనువుగా మలుచుకోవాల్సిన తీరు.. తదితరాలపై దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు వచ్చిన మణుగూరు ప్రాంత నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ను కలిశారు. కాగా కవిత రాజీనామా, ప్రెస్మీట్కు సంబంధించి అంశాలపై కేసీఆర్ ఎలాంటి ప్రస్తావన చేయలేదని సమాచారం. బీఆర్ఎస్ ముఖ్య నేతల భేటీ.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో బుధవారం తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, ఎల్.రమణ, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్టీ నేతలు ముఠా జైసింహ, ఆజం ఆలీలు ఈ భేటీలో పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. నియోజకవర్గం పరిధిలోని ఓటరు జాబితాను డివిజన్లు, బూత్ల వారీగా లోతుగా పరిశీలించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా, డివిజన్లు, బూత్ల వారీగా మైనారిటీ విభాగం కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు కోరారు. త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన మరోమారు సమావేశం జరుగుతుందని ముఖ్యనేతలు వెల్లడించారు. -
బీఆర్ఎస్ హస్తగతానికి కుట్ర: కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు హరీశ్రావు, సంతోష్రావు కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగా నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు..’ అని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ‘నాన్నా.. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతోందో చూసుకోండి. నేను కూడా మీలా ముక్కుసూటి మనిషిని కాబట్టి నన్ను పార్టీ నుంచి బయటకు పంపి బలి చేశారు. రేపు మీకూ, రామన్నకు కూడా ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంది..’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. పార్టీ ద్వారా తనకు లభించిన ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోష్కుమార్పై సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. మా కుటుంబం బాగుండటం వారికిష్టం లేదు.. కేసీఆర్, కేటీఆర్తో నాది కుటుంబ, రక్త సంబంధం. పదవులు, పార్టీతో ముడిపడిన బంధం కాదు. కానీ పార్టీలో ఉంటూ డబ్బులు సంపాదించుకుని వ్యక్తిగత లబ్ధి పొందాలని భావించే వ్యక్తులకు మేము బాగుండటం ఇష్టం లేదు. మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వారికి అధికారం వస్తుంది కాబట్టి నన్ను బయటకు నెట్టారు. ఇది ఇంతటితో ఆగదు అని దైవ సమానులు కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నా. వారిళ్లల్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? నాకు జన్మనిచ్చి, ప్రాణభిక్ష పెట్టిన నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన నేను సామాజిక తెలంగాణ కోరుకోవడం కొందరికి నచ్చలేదు. హరీశ్రావు, సంతోష్ నాపై పనికట్టుకుని సామాజిక తెలంగాణ పేరిట పార్టీ పెడుతున్నట్లు ప్రచారం చేశారు. హరీశ్, సంతోష్ ఇళ్లల్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? నేను అక్రమ కేసుల్లో తీహార్ జైలులో ఐదు నెలల పాటు గడిపి బయటకు వచ్చిన తర్వాత 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అనుమతితో గులాబీ కండువా కప్పుకుని అనేక ప్రజా సమస్యలు, అంశాలపై పోరాటం చేశా. వారిని ఎందుకు క్షమిస్తున్నారన్నదే నా ఆవేదన నా మీద జరుగుతున్న కుట్రల విషయంలో తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ పెట్టి చెప్పినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించలేదు. మీ చెల్లి, మహిళా ఎమ్మెల్సీని అయిన నాపై కుట్రలు జరుగుతున్నాయంటే ‘బేటా ఏమైంది?’ అని నాకు ఫోన్ చేయరా? కేసీఆర్ నుంచి నేను స్పందన కోరుకోలేదు, కానీ మీరు స్పందించాలి కదా. రామన్నా.. నా మీద ఎవరేం చెప్పారో తెలియదు. నా ప్రాణం పోయినా కేసీఆర్, కేటీఆర్కు హాని జరగాలని కోరుకునే ఆడపిల్లను కాదు. ఎన్ని జన్మల పుణ్యముంటే కేసీఆర్ లాంటి తండ్రి నాకు దొరికాడు. కానీ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని ఎందుకు క్షమిస్తున్నారన్నదే నా ఆవేదన. రేవంత్తో అవగాహన వల్లే వారిపై కేసులు మాఫీ హరీశ్రావు, సంతోష్ల అవినీతి వల్లే మా నాన్న కేసీఆర్పై సీబీఐ విచారణ వచ్చింది. హైదరాబాద్– ఢిల్లీ విమాన ప్రయాణంలో సీఎం రేవంత్ను హరీశ్ కలిసి కాళ్లు పట్టుకున్న నాటి నుంచి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు మొదలయ్యాయి. హరీశ్రావుకు సంబంధించిన పాల వ్యాపారం, రంగనాయక సాగర్ వద్ద భూ ఆక్రమణలు, మాజీ ఎంపీ సంతోష్పై మద్యం షాపుల కేసు తదితరాలన్నీ రేవంత్తో ఉన్న అవగాహన వల్లే తెరమరుగయ్యాయి. హరిత హారానికి నకిలీ కార్యక్రమం గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరిట సినీ నటులను మోసపూరితంగా రప్పించి అటవీ భూములను కొల్లగొట్టేందుకు సంతోష్ ప్రయత్నించాడు. శ్రవణ్రావుతో కలిసి మా ఫోన్లు ట్యాప్ చేయించారు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సంతోష్ అనుచరుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మోకిలలో రూ.750 కోట్ల బ్లూఫిన్ విల్లా ప్రాజెక్టు చేస్తున్నారు. సంతోష్ను మరో ఎమ్మెల్సీ నవీన్రావు తన గురువుగా చెప్పుకుంటున్నాడు. ఏసీబీకి వీరి అడ్రస్లు దొరకడం లేదా? రేవంత్ ప్రభుత్వంపై బరిగీసి కొట్లాడుతున్నందుకే మా కుటుంబంపై కుట్రలు జరుగుతున్నాయి. శ్రవణ్రావుతో కలిసి హరీశ్రావు, సంతోష్.. నా సిబ్బందితో పాటు కేటీఆర్, కేసీఆర్ ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. హరీశ్, సంతోష్ మీతో బాగున్నట్లు నటించవచ్చు. కానీ వాళ్లు మన కుటుంబం, తెలంగాణ మంచి కోరుకునే వారు కాదు. వాళ్లను పక్కన పెట్టి కార్యకర్తలను అక్కున చేర్చుకుని ప్రజల్లోకి వెళ్తేనే పార్టీ బతికి బట్ట కడుతుంది. ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ హరీశ్ టీఆర్ఎస్ ఆరంభం నుంచి లేరు. టీడీపీ నుంచి కేసీఆర్ రాజీనామా చేసి బయటకు వస్తున్న సమయంలో రూ.కోటిన్నరతో వ్యాపారం చేసుకునేందుకు వెళ్లారు. 10 నెలల తర్వాత తిరిగి వచ్చిన హరీశ్ను క్షమించిన కేసీఆర్.. ఆయన ఎమ్మెల్యే కాకమునుపే మంత్రి పదవి ఇచ్చారు. హరీశ్రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్. ఆయనే ట్రబుల్స్ సృష్టించి వాటిని పరిష్కరించినట్లు చెప్పుకుంటారు. కేసీఆర్, కేటీఆర్ను ఓడించాలని హరీశ్ చూశారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్రావు 25 మంది ఎమ్మెల్యేలకు పార్టీ నిధితో పాటు అదనపు నిధులు కూడా ఇచ్చారు. కాళేశ్వరం అవినీతిలో సంపాదించిన సొమ్ముతో తన మనుషులు కొందరు ఎమ్మెల్యేలుగా ఉండాలనుకున్నారు. 2009లో కేటీఆర్ను ఓడించేందుకు హరీశ్ రూ.60 లక్షలు పంపారు. కేసీఆర్ను కూడా గజ్వేల్లో ఓడించాలని చూశారు. నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఎమ్మెల్యేలను ప్రభావితం చేసి నన్ను ఓడించారు. ఇలాంటి వారిని పక్కన పెట్టుకుని నన్ను బయటకు పంపితే పార్టీ బాగు పడుతుందా? రామన్నా ఆరడుగుల బుల్లెట్తో జాగ్రత్తగా ఉండండి.. ఈ రోజు నన్ను గాయపరిచిన ఆరడుగుల బుల్లెట్..రేపు కేసీఆర్, కేటీఆర్లో ఎవరిని గాయపరుస్తుందో? రామన్నా జాగ్రత్తగా ఉండండి. హంపిలో భేటీ అయిన కొందరు నేతలు అవమానకరంగా మాట్లాడి కేసీఆర్కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైన సందర్భంలో కేటీఆర్ చేతులు పట్టుకుని హరీశ్ బ్రతిమిలాడారు. అక్కడ మాట్లాడిన వారిని పార్టీ నుంచి బయటకు పంపారు. అందులో భాగంగానే ఈటల రాజేందర్ బయటకు వెళ్లారు. హరీశ్ వల్లే జగ్గారెడ్డి, చెరుకు శ్రీనివాస్రెడ్డి, రఘునందన్రావు, విజయశాంతి, విజయ రామారావు తదితరులు పార్టీ నుంచి బయటకు వెళ్లారు. దుబ్బాక, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో హరీశ్ వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కొందరి ఒత్తిడి వల్లే సస్పెన్షన్ పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత? అని చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. కంప్యూటర్లో బీఆర్ఎస్ హార్డ్వేర్ అయితే తెలంగాణ జాగృతి సాఫ్ట్వేర్. తెలంగాణ జాగృతి ద్వారా పార్టీ అభివృద్ధిలో నా కంట్రిబ్యూషన్ ఉంది. కేసీఆర్పై కొందరు ఒత్తిడి తెచ్చి నన్ను సస్పెండ్ చేయించారని నమ్ముతున్నా. కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తా. అయితే నా లేఖను లీక్ను లీక్ చేసిన వారిపై వంద రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. కేసీఆర్ సగం ఇడ్లీ తిన్నారనే సమాచారాన్ని కూడా లీక్ చేసే వ్యవస్థ అక్కడ ఉంది. నా కుటుంబంలో జరిగిన అనేక అంశాలు బయటకు చెప్పలేను. రాజకీయ అంశాలు మాత్రమే మాట్లాడుతున్నా. నిజానికి నా లేఖ లీక్ కానంత వరకు నేను మాట్లాడలేదు. భవిష్యత్తులో అవసరమైన మరిన్ని విషయాలు బయట పెడతా. హరీశ్రావు, సంతోష్ మేక వన్నె పులులు. వాళ్లను పార్టీలో కొనసాగిస్తే నష్టం జరుగుతుంది. ఏ పార్టీలోనూ చేరడం లేదు.. నేను ఏ పార్టీలోనూ చేరడం లేదు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు, మేధావులు, బీసీలు, సామాజిక తెలంగాణ కోసం పనిచేసే వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. మా తల్లికి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. రాఖీ పండుగ ముందు మెసేజ్ పెట్టినా రామన్న బిజీగా ఉండటంతో కుదరలేదు. కేసీఆర్ ఆరోగ్యాన్ని, పార్టీని కాపాడుకుంటూ ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కోరుకుంటున్నా. -
కల్వకుంట్ల కవిత మరో సంచలన ట్వీట్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్, ఆపై పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, భవిష్యత్ కార్యచరణపై పరోక్షంగా ఎక్స్లో పోస్టు పెట్టారు. అందులో .. ‘నిజం మాట్లాడటానికి చెల్లించాల్సిన మూల్యం ఇది అయితే.. తెలంగాణ ప్రజలకోసం వందరెట్లు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధం’ అని పేర్కొన్నారు. అయితే ఈ హరీష్ రావు, సంతోష్రావు గురించి సంచలన ఆరోపణలు చేసిన తర్వాత పార్టీలోని పరిణామాల్ని ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై బీఆర్ఎస్ హరీష్ రావుకు మద్దతుగా నిలిచింది. హరీష్ రావు ఆరడగుల బుల్లెట్టు అంటూ వెనకేసుకొచ్చింది.అదే సమయంలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో పార్టీ ఎమ్మెల్సీ కే.కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు,కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటూ’బీఆర్ఎస్ అధికారిక ప్రకటన చేసింది.ఈ క్రమంలో పార్టీ నుంచి సస్పెండ్ తర్వాత కవిత మొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ తనని సస్పెండ్ చేయడంతో..కవిత కొత్త పార్టీని పెట్టనున్నారని,బీఆర్ఎస్యేతర పార్టీలో చేరబోతున్నారనే ప్రచారానికి పులిస్టాప్ పెట్టారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయోద్దని సూచించారు. ఇలా వరుస పరిణాలతో కవిత బుధవారం ఎక్స్లో తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం చర్చాంశనీయంగా మారింది. If this is the cost of speaking up the truth then I am ready to pay the cost hundred times again for the people of Telangana. Satyameva Jayathe Jai Telangana✊— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 3, 2025 -
కవిత కామెంట్స్పై సీఎం రేవంత్ రియాక్షన్
సాక్షి,మహబూబ్నగర్: మాజీ మంత్రి హరీష్రావు,సంతోష్రావు వెనక సీఎం రేవంత్రెడ్డి ఉన్నారంటూ మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు.మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్జీడీ ఫార్మా రెండో యూనిట్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యలు,బీఆర్ఎస్ గురించి మాట్లాడారు.కాలగర్భంలో బీఆర్ఎస్ కలిసిపోతుంది. జనతా పార్టీకి పట్టిన గతే బీఆర్ఎస్కు పడుతుంది. అవినీతి సొమ్ము పంపకంలో తేడాతోనే కొట్టుకుంటున్నారు. మీ పంచాయితీలోకి నన్నెందుకు లాగుతున్నారని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
ఫోన్ ట్యాపింగ్.. మరో బాంబ్ పేల్చిన కవిత
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత మరో బాంబ్ పేల్చారు. కేటీఆర్ సంబంధికుల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని అన్నారామె. బుధవారం జాగృతి కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించిన అనంతరం చిట్చాట్లోనూ సంచలన ఆరోపణలకు దిగారు.ఫామ్హజ్ విషయాలన్నీ కాంగ్రెస్కు తెలుస్తాయి. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి. కేటీఆర్కు సంబంధించిన వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. హరీష్రావు, సంతోష్రావు, శ్రవణ్రావులే(ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు) ఫోన్ ట్యాపింగ్ చేయించారు. కేసీఆర్కు రాసిన నా లేఖ విడుదల చేసింది సంతోషే అని అన్నారామె. ఈ గ్యాంగ్ గురించి కేసీఆర్కు గతంలో తాను స్వయంగా ఎంతో చెప్పానని.. బీఆర్ఎస్లో ఉండి ఇంతకాలం అంతర్గతంగా పోరాడానని, ఇప్పుడు బయటకు వచ్చి పోరాడతానని అన్నారామె. అలాగే.. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అవినీతిపైనా పల్లా రాజేశ్వర్రెడ్డి తనకు సమాచారం ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. ‘‘జనగామ టికెట్ విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. అందుకే నాకు పల్లా సమాచారం ఇచ్చారు. నా దగ్గర ఉన్న సమాచారం బయటపెడితే బీఆర్ఎస్ నేతలందరూ ఇబ్బంది పడతారు. నా దగ్గర బోలెడంత సమాచారం ఉంది. ఒక్కొక్కటిగా బయటపెడతా అని కవిత అన్నారు. భవిష్యత్తుపై ఎలాంటి ప్రణాళికలు లేవని.. అలాంటిది ఏమైనా జరిగినా కేసీఆర్ ఫోటోతోనే కార్యక్రమాలు చేపడతానని కవిత స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్లో ఆ ఇద్దరూ మేకవన్నె పులులు! -
గులాబీ బాస్.. రిలాక్స్!
సాక్షి, హైదరాబాద్: తన తండ్రిపై ఎంతో ఒత్తిడి నెలకొని ఉండొచ్చని, అందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటారని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఒకవైపు కవిత ప్రెస్మీట్ పెట్టి సంచలన ఆరోపణలు, కీలక చేసిన వేళ.. ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మాత్రం రిలాక్స్గా గడిపారు. సెప్టెంబర్ 1వ తేదీన కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరంలో కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి హరీష్రావు, సంతోష్రావులే కారణమని ఆరోపించడం కలకలం రేపింది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ సీనియర్లకు, పార్టీ కేడర్కు కోపం తెప్పించింది. దీంతో ఎర్రవల్లిలోని ఫామ్హౌజ్లో ఎడతెరిపి లేకుండా బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. బుధవారం ఉదయం నుంచి కూడా భేటీ జరుగుతుండగా.. కవిత ప్రెస్మీట్ సమయంలో మధ్యలోనే ఆయన బయటకు వెళ్లారు. కారులోనే వ్యవసాయ క్షేత్రం చుట్టూ తిరిగి పొలాలను చూసొచ్చారు. తిరిగి ఫామ్హౌజ్కు వచ్చి నేతలతో భేటీ కొనసాగించారు. -
ఆ ఒక్కటే బాధిస్తోంది: కవిత భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారాలు చేశారని, ఎంతో బాధ ఉంటేనే తాను ఇలా మాట్లాడుతున్నానని బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించి బీఆర్ఎస్కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటించారు. ఈ క్రమంలో కల్వకుంట్ల కుటుంబ వ్యవహారంపైనా కీలక వ్యాఖ్యలు చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.భవిష్యత్తు గురించి కాదు.. నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నా. విచారణ లేకుండా, వివరణ తీసుకోకుండానే నన్ను సస్పెండ్ చేశారు. కోట్ల మందిలో ఒక్కరు కేసీఆర్. అలాంటి వ్యక్తి నాకు తండ్రి కావడం నా అదృష్టం. ఆయన చిటికెన వేలు పట్టుకునే ఉద్యమంలో నడిచా. అలాంటి వ్యక్తిపై నాకెందుకు కోపం?. పార్టీ జాగ్రత్త అనే రామన్నకు ఇప్పుడు కూడా చెబుతున్నా. నేను రామన్నను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఏమైంది, ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా? నేను కూర్చొని ప్రెస్మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా. నాకైతే అనుమానమే? అని కవిత అన్నారు.ఎంత పెద్ద నేతలైనా కొంత ఒత్తిడి ఉంటుంది. కేసీఆర్పైనా ఇప్పుడు అలాంటి ఒత్తిడే ఉండి ఉంటుంది. ఆడబిడ్డలు చెడు కోరుకోరు. కానీ, ఎంత బాధ కలిగి ఉంటే నేను ఇలా మాట్లాడుతా. కుటుంబంలో ఎన్నో అవమానాలు జరిగాయి. కానీ, అవన్నీ చెప్పుకోలేను. అందుకే పార్టీ పరంగా ఉన్న సమస్యల గురించే మాట్లాడా. నిజాయితీని నిరూపించేందుకు రాజీనామా చేశా. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నందుకు బాధగా లేదు. రాజకీయంగా పొరపచ్చాలు ఇవాళ ఉంటాయి.. రేపు తొలగిపోతాయి. కానీ, మా అమ్మకు దూరంగా ఉండాల్సి రావడమే నన్ను బాధిస్తోంది అని అన్నారామె. ఈ క్రమంలో.. కుటుంబ కలహాలను ప్రస్తావన తెస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, పోస్టుల గురించి ఆమె స్పందించారు. ఎవరెవరితోనో నన్ను పోలుస్తూ కొందరు పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. పనీపాటా లేని వాళ్లే అలాంటి పనులు చేస్తారు. అలాంటి వాళ్లు చేసేవాటికి స్పందించాల్సిన అవసరం నాకు లేదు అని అన్నారామె. -
కవిత వ్యాఖ్యలు, ఆరోపణలపై స్పందిస్తున్న నేతలు
తెలంగాణలో కవిత వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత రాజీనామా రేవంత్ రెడ్డి, హరీష్రావు, సంతోష్ రావుపై ఆరోపణలు పలువురు నేతలపై వ్యాఖ్యలు చేయడంతో అధికార కాంగ్రెస్, పలువురు నేతలు స్పందిస్తున్నారు.బండి సంజయ్ కామెంట్స్..కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగింది.కేసీఆర్ కుమార్తెనే చెప్పింది.భూమ్మీద జరిగిన అతి పెద్ద అవినీతి కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్.సీబీఐకి రెండేళ్ల నుంచి ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలి.కోర్టులో వాదించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫేయిల్ అయిపోయింది.కేంద్రానికి ఈరోజు సీబీఐ ఎంక్వైరీ కోరుతూ లేఖ రాసి చేతులు దులుపుకునే యత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది.ఫోన్ ట్యాపింగ్లో జడ్జీ నుంచి కేంద్ర మంత్రుల వరకూ ట్యాపింగ్ చేస్తే దాన్ని ఎందుకు మరి సీబీఐకి ఇవ్వలేదో చెప్పాలి.ఒక డెయిలీ సీరియల్లా నడిపిస్తున్నారు.విద్యుత్ కొనుగోళ్ల స్కాం విషయంలో రిపోర్ట్ ఏమైందో తెలియదు.కేసీఆర్ బిడ్డ అయితే ఏంది?బీఆర్ఎస్ అవినీతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కవిత ఇష్యూను తెరపైకి తెస్తున్నారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్..తెలంగాణ రాష్ట్రాన్ని జలగల్లా ఐదుగురు కలసి దోచుకున్నారు.అందులో కవిత కూడా ఉంది.కవిత బయటకు వచ్చి అవినీతిపై మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నా.సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి కేసీఆర్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు, సంతోష రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది.హరీష్ రావు, ఈటెల రాజేందర్, సంతోష్ రావు అవినీతి చేస్తుంటే చూస్తూ కూర్చున్న కేసీఆర్ కూడా అవినీతి పరుడే.దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాల్లో పంచాయతీతోనే కవిత బయటకు వచ్చిందికాళేశ్వరం విచారణ త్వరితగతిన పూర్తి చేసేలా కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలి.కవిత వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కవిత రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు..ఒక ప్రతిపక్ష పార్టీ నేతతో సీఎం ఒప్పందం చేసుకుంటారా?.మీ నిస్సహాయతను మాపై చూపెట్టడం ఏంటి?ఇంటి పంచాయితీని కాంగ్రెస్ రుద్దుతున్నారు.హరీష్ రావుపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉంది..కాళేశ్వరంలో హరీష్ రావు పేరు కూడా ఉంది..బీఆర్ఎస్ పార్టీ మాకు ఎప్పుడు ప్రత్యర్థే.కవితను కాంగ్రెస్లోకి ఆహ్వానించడమా?.అది కలలో కూడా జరగదు. -
రామన్నా.. కేసీఆర్, పార్టీని కాపాడండి: కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కేసీఆర్ కుమార్తె కవిత రాజీనామా చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి హరీష్రావు, సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో వారి నుంచి పార్టీని కాపాడాలని కేసీఆర్, కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యం కాపాడాలని ఆవేదనతో చెప్పుకొచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మా కుటుంబాన్ని విచ్చిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలని కొందరు ఎదరుచూస్తున్నారు. నాపై కుట్రలు జరిగాయి. నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా.. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నాను. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న. నేను కూడా మీలాగానే ముఖం మీదనే మాట్లాడతాను. రేపు కేటీఆర్, మీపై కూడా కుట్ర జరగొచ్చు.బంగారు తెలంగాణ అవుతుందా?కేసీఆర్పై నాకెందుకు కోపం. నా తల్లితో నేను మాట్లాడలేకపోతున్నాను. అదే నా బాధ. తల్లితో మాట్లాడకుంటే ఎలా ఉంటుందో అది అనుభవించిన వారికే తెలుసు. నా తండ్రి కేసీఆర్ చిటికెన వేలు పట్టుకుని ఓనమాలు నేర్చుకున్నా. ఆయన స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ అని మాట్లాడా. స్వతంత్ర భారతంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. చెప్పింది చెప్పినట్లు ఆయన చేశారు. ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అది సామాజిక తెలంగాణ కాదా? నేనేమైనా తప్పు మాట్లాడానా? సామాజిక తెలంగాణ భారత రాష్ట్ర సమితి అవసరం లేదా? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ అంటే హరీశ్రావు, సంతోష్ ఇళ్లలో బంగారం ఉంటే అవుతుందా?.నేను రామన్నను గడ్డం పట్టుకొని, బుజ్జగించి అడుగుతున్నా. ఒక చెల్లిని, మహిళా ఎమ్మెల్సీని.. నాపై కుట్రలు జరుగుతున్నాయని గతంలో తెలంగాణ భవన్లో ప్రెస్మీట్ పెట్టి చెప్పా. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఏం జరిగిందో నాకు ఫోన్ చేయరా అన్నా? నేను కూర్చొని ప్రెస్మీట్ పెడితేనే న్యాయం జరగలేదంటే.. మామూలు మహిళా కార్యకర్తకు పార్టీలో అన్యాయం జరిగితే స్పందిస్తారా.. నాకైతే అనుమానమే. రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. హరీష్ రావు బీజేపీతో కూడా టచ్లో ఉన్నారు. హరీష్, రేవంత్ ఒకే విమానంలో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు ప్రారంభమయ్యాయి. డబ్బు సంపాదించాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. నాన్న.. ఇప్పటికైనా మేలుకోండి. నాన్న, రామన్నా.. జాగ్రత్తగా ఉండండి. పార్టీని కాపాడండి’ అని వ్యాఖ్యలు చేశారు. చివరగా.. జై కేసీఆర్, జై తెలంగాణ అని నినాదం ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. అన్ని వర్గాలతో మాట్లాడి, భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. -
ఆ ఆరడుగుల బుల్లెట్టే నాకు గాయం చేసింది: కవిత
వ్యక్తిగత లబ్ది కోరుకునే కొందరు పార్టీ నుంచి తనను బయటపడేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బుధవారం జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘హరీష్రావు, సంతోష్రావు ఇంట్లో బంగారం ఉంటే.. బంగారు తెలంగాణ కాదు. ప్రతీ సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్కు హరీష్ సరెండర్ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి. ఆయన బీజేపీతోనూ టచ్లో ఉన్నారు. హరీషన్నపై మొదటిరోజు మీడియాలో ఆరోపణలు వస్తాయి. రెండో రోజు నుంచి హరీష్రావు పేరు కనిపించదు. రేవంత్ రెడ్డి గురించి కూడా ఏనాడూ హరీష్రావు గురించి మాట్లాడలేదు. మ్యాచ్ఫిక్సింగ్ జరగిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?. రేవంత్రెెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?.హరీష్రావు మొదటి నుంచి బీఆర్ఎస్ లేరు. పార్టీ మనకెందుకు మామా అని కేసీఆర్కు చెప్పి.. వ్యాపారం చేసే ఆలోచన కూడా చేశారు. పార్టీ పెట్టిన తర్వాత 8, 9 నెలలకే చేరారు. పార్టీకి వెన్నుపోటు పొడుదాం అని గతంలోనూ ఆయన అనుకున్నారు. కేటీఆర్ను బతిమాలి పార్టీలో కొనసాగారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ మేకర్. ఆయనే సమస్య సృష్టించి.. ఆయనే మాఫీ చేసినట్లు నటిస్తారు. ఎలాగైనా కల్వకుంట్ల ఫ్యామిలీలో చిచ్చుపెట్టి పార్టీని సొంతం చేసుకోవాలనే కుట్రలు చేస్తున్నారు. హరీష్రావును నమ్ముకుని మైనంపల్లి, ఈటల, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు.. ఇలా ఎందరో పార్టీని వీడారు. 2018 ఎన్నికల్లో కాళేశ్వరం అవినీతి డబ్బులనే 25 మంది ఎమ్మెల్యేలకు అడిషనల్ ఫండ్గా పంచారు. ఆయన ఫండింగ్ వ్యవహారం నాకు స్పష్టంగా తెలుసు. రామన్నను(కేటీఆర్ను ఉద్దేశించి.) ఓడించడానికి హరీష్ కుట్ర చేశారు. సిరిసిల్లకు రూ.60 లక్షలు పంపించారు. అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై అర్ధరాత్రి దాకా చర్చ జరిగింది. ‘‘ఓ హరీష్రావు ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఓ పొగడ్తలు గుప్పిస్తున్నారు. కానీ, ఆ ఆరడుగుల బుల్లెట్టు నాకు గాయం చేసింది. తర్వాత మీ వంతే. రామన్న.. మళ్లీ రేపు మీపై కూడా కుట్ర జరగొచ్చు’’ అని అన్నారామె. సంతోష్రావు అనే వ్యక్తి చెప్పులో రాయి.. చెవిలో జోరీగా టైప్ అని అభివర్ణించారు. సంతోష్కు ధనదాహం చాలా ఎక్కువ. హరిత హరం పేరిట సినిమా హీరోలతో ఫోజులిప్పించి.. అడవులను కొట్టేయాలని చూశారు. రామన్న నియోజకవర్గం నేరెళ్లలో ఇసుక మాఫియా దళితులను చిత్రహింసలు పెట్టింది. చేయించింది అంతా సంతోష్రావు.. పేరు మాత్రం కేటీఆర్కు. పోచంపల్లి శ్రీనివాస్ వేల కోట్ల వ్యాపారం ఎలా చేస్తున్నారు?. సంతోష్రావు క్లాస్మేట్ కావడమే అందుకు కారణం. సంతోష్రావు వల్లే మాకు సంబంధించిన టీవీ, పేపర్లలోనూ నన్ను చూపించడం లేదు. సంతోష్, హరీష్ గ్యాంగులు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాయి. హరీషన్న, సంతోషన్నలు మేకవన్నె పులులు. వాళ్లను పక్కనపెడితే పార్టీ బతుకుతుంది’’ అని కవిత అన్నారు. -
కేటీఆర్ సహా పార్టీ నేతలతో కేసీఆర్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం వేళ ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్తో కేటీఆర్ సహా పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో తాజా రాజకీయా పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కవిత మీడియా సమావేశంలో ఏం చెప్పబోతున్నార అని బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు. -
బీఆర్ఎస్కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా
ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం హైలైట్స్.. 👉పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత మొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీకి కవిత రాజీనామా చేశారు. ఇదే సమయంలో తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. 👉అక్రమ కేసుల్లో నేను జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాను తప్ప.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. నా సస్పెన్షన్ వార్తలను మీడియాలో చూశాను. సస్పెండ్ చేస్తున్నట్టు నిన్న బీఆర్ఎస్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. లేఖలో ఉన్న రెండు అంశాలపై నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి మాత్రమే నేను మాట్లాడాను. గులాబీ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడటం పార్టీ వ్యతిరేకమా?. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి మాత్రమే నేను మాట్లాడాను. లేఖలో ఉన్న రెండు అంశాలపై నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. కోట్లలో ఒక్కరు కేసీఆర్.. 👉కేసీఆర్ నుంచే సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నాను. పని గట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేశారు. నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాను. కేసీఆర్ లాంటి తండ్రి కోట్లలో ఒక్కరు ఉంటారు. అలాంటి వ్యక్తి నాకు తండ్రిగా ఉన్నారు. అది నా అదృష్టం. ప్రస్తుత పరిస్థితుల కారణంగా నా తల్లితో కూడా నేను మాట్లాడటం లేదు. ఆమెను కలవలేకపోతున్నారు. ఇలాంటి కష్టం ఏ బిడ్డకు రాకూడదు. ఇద్దరు వ్యక్తులు నా కుటుంబాన్ని విచ్చినం చేశారు. నాశనం చేయాలని చూశారు. విధి అనేది ఒక్కటి ఉంది. కచ్చితంగా వారికి కాలమే సమాధానం చెబుతుంది. తప్పకుండా అనుభవిస్తారు. రేవంత్తో కలిసి హరీష్ కుట్రలు.. 👉నేను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు నాపై చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. హరీష్ రావు, సంతోష్రావు ఇంట్లో ఉన్న బంగారంతో సామాజిక తెలంగాణ అయితదా?. నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా.. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నాను. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న. నేను కూడా మీలాగానే ముఖం మీదనే మాట్లాడతాను. రేపు కేటీఆర్, మీపై కూడా కుట్ర జరగొచ్చు. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్కు హరీష్ సరెండర్ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి. వ్యక్తిగత లబ్ధి కోరుకునే వ్యక్తులు పార్టీ నుంచి నన్ను బయటపడేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్న కుట్ర ఇది. రేపటి రోజు రామన్నకు ప్రమాదమే.. 👉రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. హరీష్ రావు బీజేపీతో కూడా టచ్లో ఉన్నారు. హరీష్, రేవంత్ ఒకే విమానంలో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు ప్రారంభమయ్యాయి. డబ్బు సంపాదించాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. రేవంత్, హరీష్ కుమ్మకై నాపై కుట్రలు చేశారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చినప్పుడు మంత్రి హరీష్రావే కదా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లకు హరీష్ డెయిరీ నుంచి పాల పంపిణీ జరిగింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా?. 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడగరా?. నన్ను సస్పెండ్ చేసినా.. పార్టీలో నేను కోరుకున్న ప్రజాస్వామ్యం వచ్చింది. హరీష్ వల్లే ఓటములు.. 👉హరీష్ ట్రబుట్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. ట్రబుట్ క్రియెట్ చేసి దీన్ని సాల్వ్ చేసినట్టు చెప్పుకుంటారు. మీడియా మేనేజ్మెంట్లో హరీష్ సూపర్. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ అడిషనల్ ఫండింగ్ ఇచ్చారు. ఆయన ఫండింగ్ చేసిన వ్యవహారం నాకు స్పష్టంగా తెలుసు. రామన్నను ఓడించడానికి సిరిసిల్లకు 60 లక్షలు పంపారు. తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి డే-1 నుంచి హరీష్ రావు లేరు. ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తుంటే హరీష్రావు వద్దన్నారు. తొమ్మిది, పది నెలల తర్వాత వచ్చారు. హరీష్ రావు నక్క జిత్తులను గమనించండి. నిజామాబాద్లో నా ఓటమిలో కూడా కుట్రలు చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ను కూడా ఓడించే ప్రయత్నం చేశారు. ఇందులో సంతోష్ రావు హస్తం కూడా ఉంది. హుజురాబాద్లో ఈటల రాజేందర్ గెలుపునకు కూడా హరీషే కారణం. హరీష్ వల్లే రఘునందన్ రావు, ఇతర కీలక నేతలు బయటకు వచ్చారు. దుబ్బాకలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇలాంటివి చాలానే జరిగాయి. జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు కూడా పార్టీ వీడింది హరీష్ రావు వల్లే. ఆరడుగుల బుల్లెట్ ఇప్పుడు నాకు గాయం చేసింది. తర్వాత మీకు గాయం చేస్తుంది. గ్రీన్ ఇండియా పేరుతో సంతోష్ రావు ఓవరాక్షన్.. 👉హరితహారం కేసీఆర్ పెడితే.. గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో నకిలీ కార్యక్రమం చేపట్టాడు. సంతోష్ రావు కూరలో ఉప్పు లాంటి వాడు. చిరంజీవి, ప్రభాస్ లాంటి సినీ నటులను మోసం చేసిన గ్రీన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేలా చేసి ఫార్టెస్ట్ను కొట్టేద్దామనుకున్నారు. సిరిసిల్లలో ఏడుగురు దళిత బిడ్డలను పోలీసులు ఇసుక వ్యవహారంలో కొట్టడానికి సంతోష్ రావు బాధ్యుడు. ఆయన కారణంగా కేటీఆర్, పార్టీకి నష్టం కలిగింది. సంతోష్ రావుతోనూ రేవంత్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. తెలంగాణ ఆత్మగా జాగృతి పని చేసింది. బీఆర్ఎస్ పార్టీకి నేనేమీ చేయలేదా?. పార్టీలో నా కాంట్రిబ్యూషన్ లేదా?. హరీష్, సంతోష్లదే ఉందా?. వాళ్లు మేకవన్నె పులులు నాన్న. కలికాలం కాబట్టి వాళ్ల టైమ్ నడుస్తోంది. బీఆర్ఎస్ హార్డ్ వేర్ అయితే.. జాగృతి సాఫ్ట్వేర్ అని చెప్పుకొచ్చారు. ఏ పార్టీలో చేరను.. 👉చివరగా.. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలో గానీ చేరడం లేదన్నారు. తన భవిష్యత్ గురించి జాగృతి నేతలు, బీసీ నాయకులు, అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాకు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలే ముఖ్యం అని చెప్పుకొచ్చారు. -
కవిత సస్పెన్షన్.. కేసీఆర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు.. బీఆర్ఎస్ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్కుమార్, తక్కెళ్లపల్లి రవీందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నష్టం కలిగించే రీతిలో ఉన్నాయని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. కవిత వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేసీఆర్..ఆమెను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్! మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోష్ లక్ష్యంగా కవిత చేసిన వ్యాఖ్యలను పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ, సీబీఐకి అప్పగించాలనే నిర్ణయం నేపథ్యంలో కవిత చేసిన ఆరోపణలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం అర్ధరాత్రి వరకు ఎర్రవల్లి నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరికొందరు సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్.. పార్టీ ప్రయోజనాలు, కేడర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కవితపై సస్పెన్షన్ వేటుకు ఆదేశించినట్లు సమాచారం. ఇకపై కవిత చేసే ఆరోపణలు, విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీని ఏకతాటిపై నడిపించడంపై దృష్టి కేంద్రీకరించాలని కేటీఆర్ను ఆదేశించినట్లు సమాచారం. కేసీఆర్ ప్రజల సొత్తు అంటున్న నేతలు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన అన్ని స్థాయిల నేతలు స్వాగతించారు. కేసీఆర్ ఎవరి సొత్తూ కాదని, కవితతో పాటు పార్టీ కేడర్కు ఆయన తండ్రి లాంటి వాడని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. పార్టీ కోసం కన్నబిడ్డను కూడా వదులుకున్న నేత కేసీఆర్ అంటూ పలువురు నాయకులు కొనియాడారు. కేసీఆర్ ప్రతిష్టపైనే బీఆర్ఎస్ మనుగడ, 60 లక్షల మంది కేడర్ భవిష్యత్తు ఆధారపడి ఉందనే విషయాన్ని కవిత మరిచిపోయి విమర్శలు చేశారంటూ పలువురు నేతలు ప్రకటనలు విడుదల చేశారు. కేసీఆర్ ప్రతిష్టను మసకబార్చేలా ఆమెను ఎవరో మానసిక ఒత్తిడికి గురి చేసి ఉంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కవిత చేసిన ఆరోపణలు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు ఊతమిచ్చేలా ఉన్నాయనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. కేసీఆర్కు, పార్టీకి బాధ కలిగించే అంశమైనప్పటికీ సస్పెన్షన్ తప్పనిసరి అని పార్టీ అధినేత భావించారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
కల్వకుంట్ల కుటుంబంలో అధికార పంచాయితీ: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: కవిత సస్పెన్షన్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు స్పందించారు. కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారంగా ఆయన చెప్పుకొచ్చారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం.. ఆ అవినీతి సొమ్ము పంపకంలో తేడాలు వచ్చాయి. అందుకే ఈ విషయాలన్నీ బయటపడుతున్నాయని రామచందర్రావు వ్యాఖ్యానించారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. కాళేశ్వరంలో అవినీతిపై కవిత మాటలను ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇదే విషయం బీజేపీ చెబితే రాజకీయం అంటారు’’ అని రామచందర్రావు పేర్కొన్నారు.అవినీతి డైవర్షన్.. కవిత సస్పెన్షన్: డీకే అరుణకవిత సస్పెన్షన్ను కల్వకుంట్ల కుటుంబంలో అధికార పంచాయితీగా ఎంపీ డీకే అరుణ అభివర్ణించారు. ఆ కుటుంబంలో అందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కవిత ఏకంగా జైలుకే వెళ్లి వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి డైవర్షన్లో భాగంగానే కవిత సస్పెన్షన్. బీఆర్స్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి’’ అంటూ డీకే అరుణ వ్యాఖ్యానించారు.కుటుంబ విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదు: హరీష్బాబుబీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు మాట్లాడుతూ.. కవితపై వేటు పూర్తిగా కుటుంబ వ్యవహారమన్నారు. ‘‘కేసీఆర్ కుటుంబంలో లుకలుకలు బయటపడుతున్నాయి. కుటుంబ విషయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదు. కాళేశ్వరం అవినీతిలో ఇద్దరి పాత్ర ఉందని కవిత చెప్పారు. సీబీఐకి కవిత పూర్తి వివరాలు అందించాలి’’ అని హరీష్బాబు పేర్కొన్నారు. -
అక్కకు అడ్డొస్తే.. కవిత అనుచరుల వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ‘‘వాడెవ్వడు వీడెవ్వడు కవిత అక్కకు అడ్డు ఎవడు’’ అంటూ జాగృతి కార్యాలయంలో కవిత అనుచరులు నినాదాలు చేశారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై జాగృతి అంటూ నినాదాలు చేశారు. ఖబర్దార్ హరీష్రావు అంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత అక్కకు అడ్డొస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చిన ఆమె అనుచరులు.. సస్పెండ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.‘‘కవిత సస్పెన్షన్తో జరిగేది ఏమీలేదు. కేసీఆర్పై సీబీఐ విచారణను కవిత తట్టుకోలేకపోయారు. చాలా రోజులుగా కవితను దూరంపెట్టే యోచన జరుగుతోంది’’ అంటూ బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడంపై తెలంగాణ జాగృతి ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్ ప్రతిష్ట దిగజార్చే చర్యలను సహించబోమన్న జాగృతి కార్యకర్తలు.. కవిత వ్యాఖ్యలపై కనీసం వివరణ కోరలేదని మండిపడ్డారు. కొందరి కళ్లల్లో ఆనందం కోసమే సస్పెన్షన్ నిర్ణయం’’ అంటూ జాగృతి కార్యకర్తలు మండిపడ్డారు. -
షాకులిచ్చిన కవితకే బిగ్ షాక్!
గీత దాటితే బహిష్కరణలే తప్ప మరొకటి ఉండని పార్టీ.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న సంచలన అభియోగం మీద గులాబీ అధినేత కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే.. గతంలో పార్టీ తీసుకున్న చర్యల దృష్ట్యా కవిత బహిష్కరణ తప్పదంటూ ఈ ఉదయం నుంచి జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అలాంటప్పుడు సస్పెన్షన్ వేటుతోనే ఎందుకు సరిపెట్టాల్సి వచ్చింది?.. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా సరే క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వచ్చింది. విచారణలు, నోటీసులు, షోకాజ్ల్లాంటివేం లేకుండా నేరుగా కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ నుంచి సాగనంపుతూ వచ్చింది. గతంలో.. గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఆలె నరేంద్ర, ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపైనా బహిష్కరణ వేటే వేసింది. 2021లో ఈటల రాజేందర్పైనా నేరుగా బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. అలాంటిది గత 12 ఏళ్లుగా పార్టీలో మూలనపడిన క్రమశిక్షణ కమిటీని తెర మీదకు తెచ్చి మరీ.. కవితను సస్పెండ్ చేయడం ఆశ్యర్యానికి కలిగిస్తోంది. కిందటి ఏడాది ఆగస్టులో.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైలుకు వెళ్లొచ్చాక కవిత కొంతకాలం పాటు వ్యక్తిగత జీవితం మీదే ఫోకస్ చేశారు. అయితే.. ఈ ఏడాదిలో క్రియాశీలకంగా మారిన ఆమె 2.0 రాజకీయంతో సొంత పార్టీకే వరుస షాకులు ఇస్తూ వచ్చారు.షాక్ నెంబర్ 1..పార్టీ ఆవిర్భావ వేడుకలపై విమర్శలతో బహిరంగ లేఖ రాయడం మే నెలలో కలకలం రేపింది. రజతోత్సవ సభ(బీఆర్ఎస్ సస్లివర జూబ్లీ వేడుకలో)లో సాగిన అధినేత ప్రసంగంపై కేడర్ అసంతృప్తిగా ఉందంటూ.. కేసీఆర్కు బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో కేసీఆర్ దేవుడేకానీ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తన తండ్రికి రాసిన లేఖను కొందరు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టారంటూ మండిపడ్డారామె.షాక్ నెంబర్ 2.. పార్టీ అంతర్గత విషయాలు బయట చర్చించడం మంచిదికాదన్న సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలి... కేవలం ట్వీట్లకే పరిమితం అయితే ఎలా? అని మే 29వ తేదీన జరిగిన మీడియా చిట్చాట్లో వ్యాఖ్యానించారు. ఆపై రెండు రోజులుగా కొత్తగా తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని బంజారాహిల్స్లో ప్రారంభించారు. అంతేకాదు.. ఈ ఏడాది కేటీఆర్ చేతికి కవిత రాఖీ కూడా కట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది.షాక్ నెంబర్ 3..కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు విచారణ నోటీసులు ఇవ్వడంపై నిరసనగా.. జూన్ 10వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారామె. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పూర్తిగా దూరంగా ఉంది. షాక్ నెంబర్ 4..జూన్ 16వ తేదీన.. ఫార్ములా ఈకార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ ముందు విచారణకు హాజరైతే.. అదేరోజు అదేంపట్టనట్లు జగిత్యాలలో ఆమె పర్యటించారు. షాక్ నెంబర్ 5..జులైలో.. జహీరాబాద్లో జరిగిన బీసీ రిజర్వేషన్ల సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ఆమె వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు మండలి చైర్మన్కు ఆమె మల్లన్నపై చర్యలు తీసుకోవాలంటూ లేఖ కూడా రాశారు. అయితే ఇంత జరిగినా.. బీఆర్ఎస్ ఈ వ్యవహారానికి దూరంగా ఉంది. షాక్ నెంబర్ 6..బీఆర్ఎస్ కేడర్ను అయోమయానికి గురిచేసిన పరిణామం ఇది. జులై 26వ తేదీన ఉప్పల్లో కేటీఆర్ బీఆర్ఎస్వీ సభ, కొంపల్లిలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలను కవిత నిర్వహించారు. షాక్ నెంబర్ 7..పార్టీతో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల సాధనాదీక్ష చేపట్టారు. జై బీసీ.. జై జాగృతి నినాదాలు చేశారుషాక్ నెంబర్ 7..ఆగష్టు 5వ తేదీన మాజీ మంత్రి జగదీష్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ను నాశనం చేసిన లిల్లీపుట్ నేత వ్యాఖ్యానించడం తీవ్ర కలకలం రేపింది. షాక్ నెంబర్ 8.. కాళేశ్వరంపై బాంబ్ పేల్చారామె. హరీష్రావు, సంతోష్ రావుల వల్లే కేసీఆర్కు అవినీతి మరక అంటిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రిపై సీబీఐ ఎంక్వైరీనా?అంటూ రగిలిపోయిన ఆమె.. ఇంతదాకా వచ్చినా పట్టనట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారామె. ఈ వరుస షాకులిస్తున్నా.. తనపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆమె విమర్శలకు మరింత పదును పెట్టారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను అధినేత కేసీఆర్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కవితపై కఠిన చర్యలే ఉండాలని సీనియర్లు పలువురు కేసీఆర్ వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే జాగృతి సుదీర్ఘంగా బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా కొనసాగుతుండడం.. కవిత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. కవితపై తీసుకోబోయే చర్యలు రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుందనే దానిపై తీవ్రంగా చర్చించారు. చివరాఖరికి సస్పెండ్ వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు.. కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తంగా.. బీఆర్ఎస్లో 2025 ఏడాది కల్వకుంట్ల కవిత కల్లోలనామ సంవత్సరంగా మిగిలిపోనుంది. -
కవిత సస్పెన్షన్పై టీపీసీసీ చీఫ్ రియాక్షన్
సాక్షి,హైదరాబాద్:ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి కవితను స్పస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ క్రమంలో కవిత సస్పెన్షన్పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కవిత సస్పెన్షన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం.అందులో మేం తలదూర్చం.ఇది అంతా ఆస్తి పంపకాల్లో గొడవలా కనిపిస్తోంది. కాంగ్రెస్కు కవిత అవసరం లేదు. ఎవరినీ మాపార్టీలో చేర్చుకోవాల్సి అవసరం లేదు’అని వ్యాఖ్యానించారు. -
కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర: పల్లా
సాక్షి, హైదరాబాద్: పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపై అయినా చర్యలు తప్పవంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పల్లా చెప్పుకొచ్చారు. కవిత వ్యాఖ్యలు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందన్న పల్లా.. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. ‘‘ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు.. కేసీఆర్ ఆదేశాలే మాకు శిరోధార్యం’’ అంటూ పల్లా రాజేశ్వర్రెడ్డి తేల్చి చెప్పారు.కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కేపీ వివేకానందకేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ‘‘గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను కవిత అయోమయానికి గురిచేస్తున్నారు. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న సైన్యం. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించమని గతంలోనే కేసీఆర్ చెప్పారు...కన్నకూతురు కంటే కూడా కష్టంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్త్ ముఖ్యమని తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. పార్టీ కంటే ఎవరు పెద్ద వారు కాదనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు. ఈ రోజు పార్టీ కోసం కన్న బిడ్డను కూడా వదులుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్’’ అని వివేకానంద పేర్కొన్నారు.కాగా, హరీష్రావు, సంతోష్రావులు అవినీతి అనకొండలన్న కవితపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల కవిత దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్ల్లొ కవిత ఫ్లెక్సీలను తొలగించారు. -
వేటుపై కవిత రియాక్షన్.. సర్వత్రా ఉత్కంఠ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సస్పెన్షన్ విధించడంతో ఎమ్మెల్సీ కవితపై భవిష్యత్ కార్యచరణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ రేపు (బుధవారం) మధ్యాహ్నం 12గంటలకు కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కవిత తన రాజకీయ భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి కవితను స్పస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని హైలెట్ చేస్తూ బీఆర్ఎస్ నోట్ను విడుదల చేసింది. ఆ నోట్లో కవితపై వేటు గల కారణాల్ని ప్రస్తావించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. తనని సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కవిత ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఇదే అంశంపై కవిత స్వయంగా మీడియా ఎదుట వెల్లడించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కేసీఆర్ ఆదేశాలతో కవిత సస్పెన్షన్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా పార్టీ లైన్ దాటి ఆమె వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలుగుతోందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.కవిత ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నష్టం కలిగించే రీతిలోఉన్నందున బీఆర్ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించిందని, తక్షణమే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రధాన కార్యదర్శి టీ రవీందర్రావు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ మెంబర్ సోమ భరత్కుమార్ పేరిట లేఖ విడుదలైంది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల నుంచి కవితకు పార్టీకి మధ్య గ్యాప్ మొదలైంది. కేసీఆర్ ప్రసంగంపై ఆమె బహిరంగ లేఖ విడుదల చేయడం కలకలం రేపింది. అటుపై సోదరుడు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా ఆమె అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. ఇక.. లిల్లీపుట్ అంటూ మాజీమంత్రి జగదీష్రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా.. హరీష్రావు, సంతోష్రావులను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలే చేశారామె. పార్టీ MLC శ్రీమతి కె. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది.పార్టీ అధ్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె.… pic.twitter.com/iTSWON3irq— BRS Party (@BRSparty) September 2, 2025 -
షోకాజ్ నోటీసు ఇస్తారా? వేటు వేస్తారా?
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మంగళవారం ఎర్రవెల్లిలోని తన ఫామ్హౌజ్లో కీలక భేటీ నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న చర్చల దృష్ట్యా కవితపై చర్చలు తప్పవనే సంకేతాలు అందుతున్నాయి.కాళేశ్వరంలో కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి హరీష్రావు, సంతోష్రావులే కారణమంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల తర్వాత నిన్న సాయంత్రం నుంచి కీలక నేతలతో సమావేశం జరుపుతున్నారు. మాజీ మంత్రి హరీష్రావు యూకే పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో తాజా పరిణామాలపై అందుబాటులో ఉన్న కీలక నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.నిన్న అర్ధరాత్రి ఫామ్హౌజ్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్ ఈ ఉదయం మళ్లీ అక్కడకు చేరుకున్నారు. కేటీఆర్తో పాటు జగదీష్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారని సమాచారం. కవిత వ్యాఖ్యలపై పలువురు సీనియర్లతో పాటు కేడర్ కూడా గుర్రుగా ఉంది. మొన్నీమధ్యే బహిరంగ లేఖ పేరిట కేటీఆర్ పైనా ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలో కవితపై కేసీఆర్ చర్యలకు సిద్ధమవుతున్నారని పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే వ్యాఖ్యలకుగానూ షోకాజ్ నోటీసులు ఇస్తారా? లేదంటే పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారా?.. చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ.. వేటు వేస్తే తలెత్తే పరిణామాలపైనా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి బీఆర్ఎస్కు అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. ఒకవేళ కవితపై వేటు పడితే.. జాగృతిలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎటు వైపు ఉంటారు? అనే కోణంలోనూ చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాళేశ్వరం నివేదిక.. సీబీఐ విచారణకు ఆదేశం దరిమిలా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో హరీష్రావుపై వ్యాఖ్యలకు నిరసనగా కవిత దిష్టిబొమ్మను దగ్దం చేయడం గమనార్హం. -
ఆ ఇద్దరి వల్లే కేసీఆర్కు మరక: కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధినేత పక్కన ఉంటూ ఆయన పేరు చెప్పుకుని అనేక రకాలుగా లబ్ధి పొందిన వారు చేసిన చెత్త పనుల వల్లే కేసీఆర్కు అవినీతి మరక అంటిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్కు అవినీతి మరక అంటడంలో మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్రావుతో పాటు కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డి పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మేజర్ పాత్ర ఉన్నందునే ఐదేళ్ల పాటు నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్రావును రెండోసారి ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ దూరంగా పెట్టారన్నారు. అమెరికా పర్యటన నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. సాయంత్రం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇలాగైతే పార్టీ ఎలా ముందుకు పోతుంది? ‘కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి, ఆయనపై ఆరోపణలు రావడానికి కారకులెవరో బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. కేసీఆర్ ప్రజల కోసం ఆలోచిస్తే.. వీళ్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సొంత వనరులు, ఆస్తుల కోసం ఆలోచించారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోని వ్యక్తి కేసీఆర్ వైపు వేలెత్తి చూపి సీబీఐ విచారణ జరుపుతా అనేందుకు కారకులు ఎవరు? హరీశ్రావు, సంతోష్రావు నా మీద వ్యక్తిగతంగా అనేక కుట్రలు చేసినా ఇన్నాళ్లూ పేరు పెట్టి విమర్శించలేదు. కానీ ఇలాంటి వారిని మోస్తూ పోతే పార్టీ ఎలా ముందుకు పోతుంది? బీఆర్ఎస్ నాయకులకు కోపం వచ్చినా చేదు నిజాన్ని జీర్ణించుకోక తప్పదు..’అని కవిత అన్నారు. నన్ను విమర్శిస్తే ఖబడ్దార్! ‘హరీశ్, సంతోష్ వెనుక సీఎం రేవంత్ ఉంటూ వాళ్లను అన్ని విషయాల్లో కాపాడుతూ కేసీఆర్ను బదనాం చేస్తున్నారు. బీఆర్ఎస్ను ఇబ్బంది పెడుతున్న అవినీతి అనకొండలను ఏమీ అనడం లేదు. అంతర్గతంగా వారి నడుమ ఉన్న అవగాహన బయటకు రావాలి. నన్ను.. బీజేపీ, కాంగ్రెస్, రేవంత్, బండి సంజయ్ నడిపిస్తున్నారని రేపటి నుంచి సోషల్ మీడియాలో విమర్శిస్తే ఖబడ్దార్. నేను ఎవరో చెప్తే ఆడే తోలు»ొమ్మను కాను. నాది కేసీఆర్ రక్తం. స్వతంత్రంగా నేను అనుకున్న విషయాలను చెప్తా. రాజకీయంగా నాకు జరిగే కష్టం, నష్టాన్ని భరించేందుకు సిద్ధం. మా నాన్నకు లేఖ రాసిన నాటి నుంచి నాకు నరకం చూపిస్తూ సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్లు రాయిస్తున్నారు. కేసీఆర్పై సీబీఐ విచారణ అంటే కడుపు రగులుతోంది. అభివృద్ధి విషయంలో కేసీఆర్ నిజాం బాటలోనే నడుస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్ల పాటు గుర్తు పెట్టుకుంటారు. అలాంటి ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్పై అభాండాలు వేస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మా నాన్న పరువు పోతే నాకు బాధ. కానీ మీకు మాత్రం డబ్బులు కావాలి. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టాలి. బీఆర్ఎస్ నాయకులు తిట్టుకున్నా, స్థానిక ఎన్నికల్లో నష్టం జరుగుతుందని అనుకున్నా సరే. మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? ఇష్టారీతిన మాట్లాడితే తోలు తీస్తాం ఎన్నికల్లో ఒకసారి ఓడిపోతారు.. మరోసారి గెలుస్తారు. ఇలాంటి దుర్మార్గుల వల్లే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. డబ్బులు, టీవీలు, సోషల్ మీడియా ఉన్నాయని ఇష్టారీతిన మాట్లాడితే తోలు తీస్తాం. కేసీఆర్పై పీసీ ఘోష్ కమిషన్లు, సీబీఐ విచారణలు వేస్తే తెలంగాణ బంద్కు పార్టీ పిలుపునివ్వాలి కదా? కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే సీబీఐ విచారణకు ఆదేశించారు. నేను చెప్పిన పేర్లు ఉన్న వారితో రేవంత్కు అవగాహన లేకపోతే వారిపై విచారణ జరపాలి. కేసీఆర్ పేరు చెప్పుకోనిదే రేవంత్కు పూట గడవడం లేదు. వాస్తవానికి కేసీఆర్కు తెలంగాణ తప్ప.. తిండి, డబ్బు ధ్యాస ఉండదు. విచారణ నుంచి కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.’అని కవిత పేర్కొన్నారు.