కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి విమర్శించారు.
ఆర్టీసీని టీడీపీ నిర్వీర్యం చేస్తోంది
Apr 10 2017 4:29 PM | Updated on Aug 10 2018 8:23 PM
విజయవాడ: కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి విమర్శించారు. లాభాలు లేవనే ఉద్దేశంతో ఆర్టీసీని మూసివేయాలని చూస్తున్నారని, కేశినేని నాని బస్సులను ఇందులో హైర్ బస్సులుగా ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆరోపించారు. ఆర్టీసీలోని ఏఎన్ఎల్ పార్శిల్ సర్వీసు భారీ లాభాలలో ఉంటే అది ప్రభుత్వానికి రూ.9 కోట్లే చెల్లిస్తున్నదన్నారు. ఈ పార్శిల్ సర్వీస్ కాంట్రాక్టు ఈ ఏడాదితో ముగుస్తున్నా దాన్ని కొనసాగించేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారన్నారు.
కార్మికుల ఆసుపత్రి కోసం ప్రతి కార్మికుని నుంచి నెలనెలా రూ.100 లు వసూలు చేస్తున్నారని, అంటే ఏడాదికి వసూలయ్యే రూ.7 కోట్లు డబ్బు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పని గంటలను సడలిస్తూ స్ల్పిట్ డ్యూటీల పేరుతో ఎవరితోనూ చర్చలు జరపకుండా విజయవాడ విద్యాధరపురం డిపోనుంచి ప్రారంభిస్తున్నారని, దీంతో కార్మికులు సమ్మెలు చేస్తారని సాకుగా చూపి ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వ పెద్దలు ప్రైవేటు వారికి కట్టబెడుతున్నారని గౌంతరెడ్డి అన్నారు.
Advertisement


