నీట్‌గా రాయాల్సిందే! | The Supreme Court has no right to exempt Tamil students from Neet | Sakshi
Sakshi News home page

నీట్‌గా రాయాల్సిందే!

Aug 12 2017 5:22 AM | Updated on Sep 2 2018 5:43 PM

నీట్‌గా రాయాల్సిందే! - Sakshi

నీట్‌గా రాయాల్సిందే!

ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర వైద్య కోర్సులను అభ్యసించేందుకు ‘నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) పేరుతో కేంద్రం దేశవ్యాప్తంగా ఉమ్మడి పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టింది.

వైద్య విద్యలో 85 శాతం రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు నో
చివరి ప్రయత్నం విఫలం
తమిళ విద్యార్థులకు నీట్‌ తప్పదు


నీట్‌ ప్రవేశపరీక్ష వల్ల తమిళ విద్యార్థులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన చిట్టచివరి ప్రయత్నం కూడా విఫలమైంది. తమిళ సిలబస్‌ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 85 శాతం రిజర్వేషన్‌కు సుప్రీంనో చెప్పింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌ను కొట్టివేసింది. నీట్‌ ప్రవేశపరీక్షను రాయక తప్పని పరిస్థితి నెలకొంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎంబీబీఎస్, బీడీఎస్‌ తదితర వైద్య కోర్సులను అభ్యసించేందుకు ‘నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) పేరుతో కేంద్రం దేశవ్యాప్తంగా ఉమ్మడి పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే నీట్‌ ప్రవేశపరీక్షపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నీట్‌ నుంచి తమిళనాడును మినహాయించాలని ప్రజలు, ప్రతిపక్షాల నుంచి డిమాండ్లు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు నివేధించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా నీట్‌ నుంచి  మినహాయింపు కోరింది.

అయితే నీట్‌ మినహాయింపు విజ్ఞప్తులు పరిశీలనకు కూడా నోచుకోకపోగా షెడ్యూలు ప్రకారం దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష జరిగింది. నీట్‌పై మినహాయింపు లభిస్తుందన్న ఆశతో తమిళనాడు విద్యార్థులు పెద్దగా శ్రద్ధ చూపలేదు. ఈ కారణంగా నీట్‌ ఫలితాల్లో తమిళనాడు విద్యార్థులు దారుణంగా వెనుకబడిపోయారు. నీట్‌పై నిరసన తెలుపుతూ తమిళనాడు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలో కొట్టివేసింది. విద్యార్థుల ప్రయత్నం విఫలం కావడంతో నీట్‌ నుంచి తమిళనాడును మినహాయింపుపై అసెంబ్లీలో బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఈ బిల్లు రాష్ట్రపతి కార్యాలయంలో ఇంకా పెండింగ్‌ దశలో ఉంది.

85 శాతం రిజర్వేషన్‌:
రాష్ట్రపతి ఆమోదానికి ఆలస్యం కావడంతో తమిళనాడు సిలబస్‌లో ఉత్తీర్ణులైన వారికి వైద్యవిద్యలో 85శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ రిజర్వేషన్‌ను సీబీఎస్‌ఈ సిలబస్‌ విద్యార్థులు వ్యతిరేకిస్తూ, ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. విద్యార్థుల వాదనతో ఏకీవభించిన మద్రాసు హైకోర్టు 85శాతం రిజర్వేషన్‌ చట్టాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం అప్పీలు పిటిషన్‌ దాఖలు చేసింది.

అప్పీలు పిటిషన్‌పై ఇరువర్గాల వాదన పూర్తికాగా సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. మద్రాసు హైకోర్టు జారీచేసిన 85శాతం రిజర్వేషన్‌ రద్దు ఆదేశాలపై స్టే విధించేందుకు వీల్లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులందరినీ సమభావనతో చూడాలనే ఉద్దేశంతోనే నీట్‌ విధానాన్ని ప్రవేశపెట్టారని, అయితే తమిళనాడులో స్టేట్, సెంట్రల్‌ సిలబస్‌ పేరిట విద్యార్థులను విభజించి పక్షపాత ధోరణిని చూపడం సమంజసం కాదని వారు హితవుపలికారు.

85శాతం రిజర్వేషన్‌ చట్టాన్ని రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అప్పీలు పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని న్యాయమూర్తులు తీర్పుచెప్పారు. ఈ ఏడాది నిర్వహించిన నీట్‌ పరీక్ష చెల్లదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. 85శాతం రిజర్వేషన్‌ చట్టాన్ని శుక్రవారం రద్దు చేసింది. ఇక తమిళనాడు విద్యార్థులకు నీట్‌ ప్రవేశపరీక్ష తప్పదని భావించాల్సి ఉంటుంది. అయితే నీట్‌ మినహాయింపు కోరుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండడం తమిళనాడులో ఆశలు రేకెత్తిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement