మూడు రోజుల్లో రూ.12 కోట్లు | tax payments in Warangal region municipal corporations | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో రూ.12 కోట్లు

Nov 13 2016 8:25 PM | Updated on Sep 4 2017 8:01 PM

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ప్రజలు పెద్ద ఎత్తున చెల్లింపులు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

- వరంగల్ రీజియన్‌లోని కార్పొరేషన్లలో భారీగా వసూళ్లు 
 
గోదావరిఖని: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లతో ఆస్తి పన్ను, నల్లా బిల్లులు చెల్లించేందుకు అవకాశం కల్పించడంతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ప్రజలు పెద్ద ఎత్తున చెల్లింపులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. వరంగల్ రీజినల్ పరిధిలోని 31 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో బకాయిలు, తాజా పన్నులకు సంబంధించి రూ.170.66 కోట్ల వార్షిక డిమాండ్ ఉండగా గత ఏడు నెలల్లో (మార్చి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు) రూ.47.64 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 
 
కానీ ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్లను కూడా తీసుకోవడానికి మొదట 11వ తేదీ అర్ధరాత్రి వరకు, తర్వాత 14వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం గడువు ఇచ్చింది. దీంతో 11 నుంచి 13వ తేదీ వరకు వరంగల్ రీజియన్‌లో 15 జిల్లాల పరిధిలోని 31 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో రూ.12.32 కోట్లు వసూలయ్యాయి. చివరి రోజు సోమవారం కూడా పెద్ద మొత్తంలోనే పన్నులు వసూలయ్యే అవకాశం ఉంది.
 
మూడు రోజుల్లో వసూళ్ల తీరిది
గత మూడు రోజుల్లో ఖమ్మం కార్పొరేషన్‌లో రూ.1.69 కోట్లు, వరంగల్ కార్పొరేషన్‌లో రూ.4.58 కోట్లు, కరీంనగర్ కార్పొరేషన్‌లో రూ.1.25 కోట్లు, రామగుండం కార్పొరేషన్‌లో రూ.26.38 లక్షలు వసూలయ్యాయి. మధిర నగర పంచాయతీలో రూ.5.55 లక్షలు, సత్తుపల్లి నగర పంచాయతీలో రూ.13.43 లక్షలు, కొత్తగూడెం మున్సిపాలిటీలో రూ.19.18 లక్షలు, మణుగూరు మున్సిపాలిటీలో రూ.4.08 లక్షలు, పాల్వంచ మున్సిపాలిటీలో రూ.14.03 లక్షలు, ఎల్లందు మున్సిపాలిటీలో రూ.5.92 లక్షలు, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రూ.31.81 లక్షలు, భైంసా మున్సిపాలిటీలో రూ.4.80 లక్షలు, నిర్మల్ మున్సిపాలిటీలో రూ.20 లక్షలు, పెద్దపల్లి నగర పంచాయతీలో రూ.15.99 లక్షలు, బెల్లంపల్లి మున్సిపాలిటీలో రూ.6.54 లక్షలు, మంచిర్యాల మున్సిపాలిటీలో రూ.89.47 లక్షలు, మందమర్రి మున్సిపాలిటీలో రూ.2.05 లక్షలు వసూలయ్యాయి. 
 
మహబూబాబాద్ మున్సిపాలిటీలో రూ.11 లక్షలు, హుజురాబాద్ నగర పంచాయతీలో రూ.7.80 లక్షలు, జమ్మికుంట నగర పంచాయతీలో రూ.16.87 లక్షలు, భూపాలపల్లి నగర పంచాయితీలో 11.93 లక్షలు, సిరిసిల్ల మున్సిపాలిటీలో రూ.17.35 లక్షలు, వేములవాడ నగర పంచాయతీలో రూ.13.69 లక్షలు, జగిత్యాల మున్సిపాలిటీలో రూ.43.12 లక్షలు, కోరుట్ల మున్సిపాలిటీలో రూ.17.31 లక్షలు, మెట్‌పల్లి మున్సిపాలిటీలో రూ.12.73 లక్షలు, జనగామ మున్సిపాలిటీలో రూ.16.67 లక్షలు వసూలయ్యాయి. అలాగే కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో రూ.5.52 లక్షలు, నర్సంపేట నగర పంచాయతీలో రూ.22.78 లక్షలు, పరకాల నగర పంచాయతీలో రూ.17.46 లక్షలు, హుస్నాబాద్‌లో రూ.6.64 లక్షలు వసూలయ్యాయి. చివరి రోజు సోమవారం మరింత ఎక్కువగా వసూలు కానున్నాయని రీజినల్ డెరైక్టర్ డి.జాన్‌శ్యాంసన్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement