వేడుకగా తమిళ సంవత్సరాది | tamil new year grand celebrations in chennai | Sakshi
Sakshi News home page

వేడుకగా తమిళ సంవత్సరాది

Apr 14 2017 8:09 PM | Updated on Sep 5 2017 8:46 AM

మేల్‌మరువత్తూరు ఆదిపరాశక్తి సిద్ధర్‌ పీఠంలో హేవళంబి తమిళ సంవత్సరాది వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.

టీనగర్‌: మేల్‌మరువత్తూరు ఆదిపరాశక్తి సిద్ధర్‌ పీఠంలో హేవళంబి తమిళ సంవత్సరాది వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కలశ పూజలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సంక్షేమ సహాయకాల పంపిణీ జరిగింది. ఇందులో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు, వేలాదిమంది భక్తులు బంగారు అడిగళార్‌ ఆశీస్సులు అందుకున్నారు. గురువారం సాయంత్రం ఆదిపరాశక్తి గర్భగుడి ముందు కలశ, దీప పూజలను మేల్‌మరువత్తూరు ఆదిపరాశక్తి ఆధ్యాత్మిక సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ బంగారు అడిగళార్‌ ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, ఆరాధనలు జరిగాయి.

ఉదయం ఆధ్యాత్మిక సంఘం ఉపాధ్యక్షుడు కేపీ సెంథిల్‌కుమార్‌ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. సిద్ధర్‌ పీఠానికి విచ్చేసిన బంగారు అడిగళార్‌కు కాంచీపురం జిల్లా తరఫున భక్తులు పాదపూజ చేసి ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 12.15 గంటలకు వేదికపై ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. కాంచీపురం జిల్లా అదనపు న్యాయమూర్తి జి.కరుణానిధి, రైల్వే ఉన్నతాధికారి ఎస్‌.సెంథమిళ్‌ సెల్వన్, ఏకే వెంకటసామి, సాయిప్రసాద్‌ పాల్గొన్నారు. ఇందులో రూ.15 లక్షల విలువైన సంక్షేమ సహాయకాలను 446 మంది లబ్ధిదారులకు అందజేశారు. 15 ఉచిత వివాహాలు, ఆరుగురు దంపతులకు షష్టిపూర్తి ఉత్సవాలను బంగారు అడిగళార్‌ నిర్వహించారు. ఐదుగురు దివ్యాంగులకు త్రిచక్రవాహనాలు, ఆరుగురికి హియరింగ్‌ ఎయిడ్స్‌ మరికొందరికి ఇతర సహాయకాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement