తమ పార్టీలు గెలవలేదని.. | Tamil Nadu polls: DMK party Activist Suicide | Sakshi
Sakshi News home page

తమ పార్టీలు గెలవలేదని..

May 21 2016 2:33 AM | Updated on Apr 3 2019 8:52 PM

అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ గెలవలేదని విరక్తి చెందిన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఈరోడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

టీనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ గెలవలేదని విరక్తి చెందిన కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఈరోడ్ జిల్లాలో  చోటుచేసుకుంది. దీంతో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పార్టీ కార్యకర్తలు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఒక ప్రకటనలో కోరారు. ఈరోడ్ నార్త్ జిల్లా, నంబియూరు యూనియన్‌కు చెందిన సుండకాంపాళయం పంచాయతీలో షణ్ముగం అనే వ్యక్తి యువజన విభాగం నిర్వాహకుడిగా పనిచేస్తుండేవాడు. ఈయన గురువారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను టీవీలో చూస్తూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.

దీంతో అతను ఒక లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సోదరుని మృతితో తీవ్ర ఆవేదనకు గురయ్యానని, అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని పేర్కొంటూ ఒక లేఖ విడుదల చేశారు. కార్యకర్తలు ఇకపై మనో నిబ్బరంతో ఉండాలని, ఆత్మహత్యలకు పాల్పడరాదని ప్రకటనలో కోరారు.
 
డీఎండీకే కార్యకర్త ఆత్మహత్యాయత్నం:
డీఎండీకే ఒక్క నియోజకవర్గంలోనూ గెలవకపోవడాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీకి చెందిన ఒక కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తూత్తుకుడి లోని తాళముత్తునగర్ దుబ్బాస్‌పట్టికి చెందిన పళనివేలు (40) విజయకాంత్ అభిమాని. ఇతను అదే డివిజన్ ఏరియా కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడు.

ఇతను అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే-మక్కల్ నలకూట్టని ఘన విజయం సాధిస్తుందని పలువురితో చెబుతూ వచ్చాడు. అయితే గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో మక్కల్ నలకూట్టని పార్టీలు మాత్రమే కాకుండా డీఎండీకే ఒక్క నియోజకవర్గంలో కూడా గెలుపొందలేదు. దీంతో విరక్తి చెందిన పళనివేలు మద్యంలో విషం కలుపుకుని సేవించారు. దీన్ని గమనించిన చుట్టుపక్కల వారు బాధితుణ్ణి తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement