సేన, కాంగ్రెస్ డిష్యూం డిష్యూం | Shiv Sena and Congress activists altercation | Sakshi
Sakshi News home page

సేన, కాంగ్రెస్ డిష్యూం డిష్యూం

Feb 8 2015 10:38 PM | Updated on Apr 3 2019 4:53 PM

ఓ భూమి పూజ కార్యక్రమంలో శివసేన, కాంగ్రెస్ కార్యకర్తలు తన్నుకున్నారు...

* ఉద్ధవ్‌ఠాక్రే సమక్షంలోనే జరిగిన వివాదం
* ఓ శంకుస్థాపన కార్యక్రమంలో ఇరుపక్షాల వాగ్వాదం

సాక్షి, ముంబై: ఓ భూమి పూజ కార్యక్రమంలో శివసేన, కాంగ్రెస్ కార్యకర్తలు తన్నుకున్నారు. దాదర్‌లోని నాయ్‌గావ్‌లో ఆదివారం జరిగిన భూమి పూజ కార్యక్రమంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళిదాస్ కోలంబ్కర్ సమక్షంలో ఇరుపార్టీల కార్యకర్తలు గొడవకు దిగారు. వివరాల్లోకె ళితే.. బాంబే డయింగ్‌కు చెందిన 8.15 ఎకరాల స్థలంలో భారీ థీం పార్క్ ఏర్పాటు చేయాలని మహానగ ర పాలక సంస్థ(బీఎంసీ) నిర్ణయించింది. అందులో సంయుక్త మహారాష్ట్ర కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం, మ్యూజియం నిర్మించాలని ఏర్పాట్లు చేస్తోంది.

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా జరిగిన పార్క్ శంకు స్థాపన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళిదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళిదాస్ మాట్లాడుతూ..బాంబే డయింగ్ స్ప్రింగ్ మిల్లు కార్మికుల ఇళ్ల కోసం గత 22 సంవత్సరాలుగా పోరాడుతున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఆగ్రహించిన శివసైనికులు కోలంబ్కర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అంతరాయం క లిగించారు. దీంతో ఆయన మద్దతుదారులు ఉద్ధవ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. నినాదాలు కాస్తా గొడవకు దారితీసాయి. పోలీసులు రంగంలోకి దిగినా పరిస్థితి సద్దుమనగలేదు. ఉద్ధవ్, కోలంబ్కర్‌లు కలగజేసుకుని ఇరుపక్షాల వారిని శాంతపరిచారు.  కొద్ది రోజుల కింద కూడా మాటుంగాలోని ఫైవ్ గార్డెన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శివసేన, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఇలాగే వాగ్వాదం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement