అదృశ్యమయ్యాడనుకుంటే.. ఇంట్లోనే శవమై కనిపించాడు | Man Suspectedly Died In Yanam | Sakshi
Sakshi News home page

అదృశ్యమయ్యాడనుకుంటే.. ఇంట్లోనే శవమై కనిపించాడు

Oct 27 2019 11:34 AM | Updated on Oct 27 2019 11:34 AM

Man Suspectedly Died In Yanam - Sakshi

సాక్షి, యానాం: అదృశ్యమయ్యాడనుకున్న వ్యక్తి రెండు నెలల తరువాత తన నివాసంలోనే శవమై కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యానాం పట్టణంలోని టైడల్‌లాకు సమీపంలోని ఓల్డ్‌ రాజీవ్‌నగర్‌ రెండో వీధిలో నివసిస్తున్న నల్లి చిట్టిబాబు (50) రెండు నెలల క్రితం కనబడకుండా పోయారని ఆయన బంధువులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఆయన కోసం వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో మిస్సింగ్‌ కేసును నమోదు చేశారు. ఇదిలా ఉండగా శనివారం చిట్టిబాబు నివాసం నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సురేష్‌ ఆధ్వర్యంలో పోలీసు బృందం వచ్చి ఇంటిని పరిశీలించగా తలుపులకు గడియ వేసి ఉంది.

దాంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా శిథిలస్ధితిలో అస్థి పంజరంగా గుర్తుపట్టలేని రీతిలో ఒక మూలన మృతదేహం కనిపించింది. ఆ మృతదేహాన్ని పరిశీలించిన స్థానికులు, అతని బంధువులు అది చిట్టిబాబే అని గుర్తించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని స్థానిక జీజీహెచ్‌కు తరలించారు. మృతుడు అవివాహితుడని, ఆయన ఇంట్లో ఒక్కరే ఉంటుంటారని, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో సైతం స్థానికులు తెలియదని ఎస్సై సురేష్‌ అన్నారు. చిట్టిబాబు తలుపు గడియపెట్టుకోవడంతో పాటు ఆ గదిలోనే ఉండిపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నాడో గుర్తించలేకపోయారన్నారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement