జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్థానిక పలు రాజకీయ పార్టీలు, సంస్థలు బుధవారం ఘననివాళులర్పించాయి.
షోలాపూర్, న్యూస్లైన్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్థానిక పలు రాజకీయ పార్టీలు, సంస్థలు బుధవారం ఘననివాళులర్పించాయి. షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) భవన ప్రాంగణంలో మేయర్ అల్కా రాథోడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ కమిషనర్ చంద్రకాంత్ గూడెంవార్తో పాటు ఎస్ఎంసీ పదాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా కౌన్సిల్హాలు లో మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు మేయర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిప్యూటీ మేయర్ హరుణ్ సయ్యద్, దత్తు బంధుపట్టె తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేప్రణతి షిండే గాంధీ మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని విభాగాల నాయకులు కాంగ్రెస్ భవన్ నుంచి గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో ఎస్ఎంసీ ఫ్లోర్ లీడర్ మహేశ్ కోటే, మాజీ ఎమ్మెల్యేలు ప్రకాశ్ మల్గుల్వార్, విశ్వనాథ్ చాకోతే, కార్పొరేటర్లు, పదాధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు ఎన్సీపీ పట్టణ శాఖ అధ్యక్షుడు మహేశ్ గాదేకర్, స్టాయీసమితి అధ్యక్షుడు ఇబ్రహీం ఖురేషి తదితరులు పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.