చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికుల వస్తువులను చోరీ చేసిన ఉద్యోగులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
టీ.నగర్: చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికుల వస్తువులను చోరీ చేసిన ఉద్యోగులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు విలువైన వస్తువులు చోరీకి గురవుతూ వచ్చాయి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ సూట్కేసుల్లో విలువైన వస్తువులు తీసుకురావడం పరిపాటి. ఇళ్లకు వెళ్లి చూడగా వస్తువులు కనిపించడం లేదు. ఇవి ఎలా చోరీకి గురవుతున్నాయో తెలియక పలువురు ఫిర్యాదు చేయడం లేదు. కొందరు మాత్రం ఫిర్యాదు చేస్తున్నారు.
చోరీలకు బద్షా అనే ప్రైవేటు సంస్థ ఉద్యోగులు పాల్పడుతున్నట్లు తెలిసింది. విమానాశ్రయంలో ప్రయాణికుల లగేజీని కన్వేయర్ బెల్ట్లో వేసే పనుల్లో ఈ ఉద్యోగులు నిమగ్నమవుతుంటారు. ఆ సమయంలో ఉద్యోగులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. దీంతో కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం పోలీసులు దీనిపై నిఘా ఉంచారు. బుధవారం రాత్రి వచ్చిన ప్రయాణికుల లగేజీ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులను బద్షా సంస్థ ఉద్యోగులు చోరీ చేసినట్లు కెమెరాల్లో నమోదైంది. పోలీసులు నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసి వారి వద్ద విచారణ జరుపుతున్నారు.