పోస్టల్ చెక్కుల ఫోర్జరీ కేసులో
నలుగురు ఉద్యోగులు అరెస్టు
కందుకూరు: పోస్టాఫీసులో ఇటీవల జరిగిన రూ.19 లక్షల కుంభకోణంలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పోస్టల్శాఖలోని బషీర్, అబ్దుల్ హఫీజ్, గేరా శ్యామ్కుమార్, రత్నాకర్బాబు అనే నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. పట్టణ ఎస్సై వైవి రమణయ్య తెలిపిన వివరాల ప్రకారం...సింగరాయకొండకు చెందిన వడ్లమూడి శ్రీనివాసులు అనే వ్యక్తి త్రిబుల్ ఎక్స్, ఎస్వి సొల్యూషన్స్ అనే ప్రైవేట్ సంస్థలను స్థాపించాడు.
వీటి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని పత్రికా ప్రకటనలిచ్చాడు. ఇది నమ్మిన నిరుద్యోగులు శ్రీనివాస్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో ఉద్యోగం కావలంటే కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని నిరుద్యోగులను నమ్మించాడు. ఈ విధంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని నిరుద్యోగుల నుంచి వచ్చే నగదును పోస్టల్ ఆర్డర్ ద్వారా పంపాలని సూచించారు. ఆ విధంగానే నిరుద్యోగులు పంపించారు. వాటిని సింగరాయకొండలోని పోస్టాఫీస్లో శ్రీనివాస్ జమచేసేవాడు. సింగరాయకొండ బ్రాంచ్ పోస్టుమాస్టర్గా పనిచేస్తున్న బషీర్ వీటిన్నింటినీ హెడ్పోస్టాఫీస్ అయిన కందుకూరు హెడ్ పోస్టాఫీస్కి పంపించేవారు.
వీటిని పరిశీలించినహెడ్పోస్టాఫీస్ బి.పి.ఎం. అబ్దుల్హఫీజ్, హెడ్పోస్టుమాస్టర్ గేరా శ్యామ్కుమార్లు చెక్కుల రూపంలో నగదును శ్రీనివాస్కి బదిలీ చేశారు. ఈ విధంగా చెక్కుల రూపంలో వాస్తవానికి శ్రీనివాస్కి చెల్లించాల్సింది కేవలం రూ.2.21 లక్షలు మాత్రమే. అయితే శ్రీనివాస్కి అదనంగా రూ.19 లక్షలు చెక్కుల రూపంలో చెల్లించినట్లు తేలింది. దీనికిగాను వీరు చెక్కుల జారీ చేసే సమయంలో ఆర్బిఐ నిబంధనలు పాటించకపోవడం శ్రీనివాస్ చెక్కులను పోర్జరీ చేశాడు. ఉదాహరణకు ఒక చెక్కుపై బాక్స్లో రూ.15,000లు అని రాసి ఇచ్చేవారు. ఈ విధంగా చెక్ ఇచ్చే సమయంలో బాక్స్లో ఎడమవైపు కొంచెం ఖాళీ వదిలేవారు.
ఆ తరువాత శ్రీనివాస్ ఖాళీ ప్రదేశంలో రూ.15,000 పక్కన మరో ఒకటి అంకెని జత చేసుకునేవాడు. అంటే చెక్ రూ.1,15,000లుగా మారిపోయింది. ఆ చెక్కులను కందుకూరులోని ఎస్బిఐలో మార్చుకునేవాడు. ఇలా పోస్టల్ అకౌంట్ నుంచి 8 చెక్కులను ఫోర్జరీ రూపంలో రూ.19 లక్షలు అదనంగా డ్రా చేశాడు. ఈ అవకతవకలపై గతేడాది మేలోనే స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో శ్రీనివాస్ తాను అదనంగా డ్రా చేసిన మొత్తాన్ని తిరిగి పోస్టాఫీస్లో చెల్లించినట్లు రశీదు చూపించాడు. వాస్తవానికి రూ.19 లక్షలకుగాను శ్రీనివాస్ కేవలం రూ.6 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించాడు. మిగిలిన రూ.13 లక్షలను కూడా చెల్లించినట్లు రశీదులు చూపించి కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు.
ఈ వ్యవహారంపై పోస్టల్ అసిస్టెంట్ సూపరెంటెడెంట్ రాజగోపాల్ని విచారణ అధికారిగా నియమించింది. విచారణ జరిపిన ఆయన రూ.13 లక్షలు తేడాను గుర్తించి మరోసారి పోలీసులకు ఆశ్రయించారు. దీంతో ఇటీవల స్థానిక ఎస్బిఐ ఉద్యోగులను పోలీసులు ప్రశ్నించి మరింత లోతుగా విచారణ చేపట్టిన ఒంగోలు సీతారామపురం సబ్పోస్టుమాస్టర్గా పనిచేస్తున్న పాలపర్తి జాన్సన్ రత్నాకర్బాబు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. రత్నాకర్ పాస్వర్డుతోనే నగదు శ్రీనివాస్ తిరిగి నగదు చెల్లించినట్లు రశీదులు పుట్టించాడు. రత్నాకర్ ప్రమేయం లేకుండా పాస్వర్డ్ ఎలా ఓపెనయ్యాయి? శ్రీనివాస్కి రశీదులు వెళ్లాయనే అనుమానంతో రత్నాకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 108 చెక్కులు బదిలీ చేస్తే వాటిలో కేవలం 8 చెక్కులు మాత్రమే ఫోర్జరీ జరిగినట్లు గుర్తించామన్నారు.
ఈ చెక్కుకు సంబంధించి ట్రెజరీ క్యాష్ బుక్ (టిసిబి) కూడా లేదన్నారు. దీనిపై బషీర్ని ప్రశ్నిస్తే అగ్నిప్రమాదంలో టి.సి.బి. కాలిపోయినట్లు సమాధానం చెబుతున్నారని, అయితే వాస్తవానికి అగ్నిప్రమాదంలో కాలిపోయిన వస్తువుల జాబితాలో టి.సి.బి. బుక్ లేదని తమ విచారణలో తేలింద ని ఎస్సై తెలిపారు. ఈ కేసులో స్థానిక ఎస్బిఐ బ్యాంక్ ఉద్యోగుల ప్రమేయం ఏమైనా ఉందా అనే దానిపై కూడా విచారణ చేస్తామన్నారు. ఈ కేసుపై పూర్తి విచారణ చేపడతామని, ఈ కేసులో సంబంధం ఉన్న ఎవ్వరినీ వదిలేది లేదని ఎస్సై స్పష్టం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు నిందితులను గురువారం ఎస్సై స్థానిక కోర్టులో హాజరుపరిచారు. అయితే నిందితులు కేసులో బెయిల్పై విడుదలైనట్లు ఎస్సై తెలిపారు.