బస్సులో రూ.50 లక్షల స్వాధీనం | Election Commission in Tamil Nadu seizes another Rs 50 lakh in cash. Madurai district | Sakshi
Sakshi News home page

బస్సులో రూ.50 లక్షల స్వాధీనం

Apr 28 2016 8:55 AM | Updated on Oct 8 2018 4:05 PM

చెన్నై నుంచి మదురైకు బస్సులో తరలిస్తున్న రూ.50 లక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.

మదురై : చెన్నై నుంచి మదురైకు బస్సులో తరలిస్తున్న రూ.50 లక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు మే 16వ తేదీ జరగనున్న నేపథ్యంలో  ఎన్నికలలో నగదు బట్వాడాను అడ్డుకునే దిశగా ఎన్నికల కమిషన్ పలు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం రాత్రి మదురై జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫోన్‌కాల్ వచ్చింది. చెన్నై నుంచి మదురైకు వస్తున్న బస్సులో రూ. 50 లక్షల నగదు అక్రమంగా తరలిస్తున్నట్లు చెప్పి ఆగంతకుడు ఫోన్ చేశారు.

ఆ వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు జిల్లాలోని ఫ్లయింగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. మేలూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి పీర్ మహ్మద్, సబ్ ఇన్‌స్పెక్టర్ కలెసైల్వి, హెడ్‌కానిస్టేబుల్వ్రి సహా పోలీసు బృందం చిట్టంపట్టిలోగల టోల్‌గేట్‌ వద్ద కాపు కాసి.. సదరు బస్సును నిలిపి అధికారులు తనిఖీలు జరిపారు.

బస్సులో ఒక ప్రయాణికుడి వద్ద గల ట్రాలీ బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో వెయ్యి, 500ల రూపాయల కట్టలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.... అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్ కి తరలించి... విచారణ చేపట్టారు. 

చెన్నై సెంబాక్కంకు చెందిన తన పేరు రాధా (56) అని... స్థానిక హోటల్‌లో పని చేస్తున్నానని అతడు పోలీసుల విచారణలో తెలిపాడు.  అతని యజమాని ఈ సొమ్మును మదురైకు తీసుకెళ్లి అక్కడ ఒక వ్యక్తికి ఇవ్వమన్నాడని చెప్పాడు. సొమ్ముకు తగిన ఆధారాలు లేకపోవడంతో రూ.50 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకుని మదురై జిల్లా ట్రెజరీలో అప్పగించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు స్వాధీనం చేసుకున్న సొమ్మును పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement