రెండింతలైన ఉల్లిసాగు | Sakshi
Sakshi News home page

రెండింతలైన ఉల్లిసాగు

Published Sun, Nov 3 2013 11:18 PM

double  onion cultivation

 నాసిక్: సామాన్యులకే కాదు అధికారంలో ఉన్న పెద్దలకు దడపుట్టిస్తున్న ఉల్లి ధర మరికొద్ది రోజుల్లో చుక్కల్లోంచి నేలకు దిగిరావచ్చంటున్నారు రాష్ట్ర వ్యవసాయ అధికారులు. ఉల్లిపంటకు పుట్టిల్ల్లయిన నాసిక్ ప్రాంతంలో ఈ సంవత్సరం ఖరీఫ్, లేట్ ఖరీఫ్‌లో పంట విస్తీరణం రెట్టింపయింది. గత ఖరీఫ్ కాలంలో 6,626 హెక్టార్లలో పంటసాగుకాగా, ఈ సంవత్సరం అది 17,473 హెక్టార్లకు చేరింది. ‘‘పంట విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా దిగుబడులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం 3,49,460 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది’’ అని  జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌ఆర్ బొంబే తెలిపారు. ‘‘ఖరీఫ్ తర్వాత ఆలస్యంగా సాగు చేసేవారివల్ల కూడా పంటసాగు బాగా పెరిగింది. ఈ సంవత్సరం 31,197 హెక్టార్ల విస్తీర్ణంలో సాగయింది. లేట్ ఖరీఫ్‌కు సంబంధించిన పంట దిగుబడులు కూడా 5,92,743 టన్నులకు పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్-జనవరి మాసాల్లో రాష్ట్ర ఉల్లి మార్కెట్లను ముంచెత్తనుందని అధికారులంటున్నారు. దిగుబడులు బాగా పెరగడంతో ధరలు పడిపోయే అవకాశం ఉంది. ఇది రైతులకు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది’’ అని వ్యవసాయ అధికారి వివరించారు.
 ఈ సంవత్సరం వర్షాలు కూడా చాలనన్ని ఉండి వాతావరణం ఉల్లిసాగుకు అనుకూలంగానే ఉంది. అయితే నాసిక్ ప్రాంతంలో ఖరీఫ్‌లో ఆలస్యంగా సాగుకు వినియోగించే ఉల్లి రకాల నిల్వ కాలం చాలా తక్కువ. దీంతో రైతులు తప్పనిసరిగా వ్యాపారుల కోరిన ధరలకే ఇవ్వాల్సి రావొచ్చు. నవంబర్ నుంచి ధరలు కొంత నిలకడగా మారినా డిసెంబర్ నాటికి పరిస్థితి రైతులకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులంటున్నారు. వ్యాపారులు కూడా కొనుగోలు చేసిన సరుకును రబీ సరుకులా నిల్వచేసుకొనే అవకాశం లేనందున మార్కెట్ ధరలపై బాగానే ప్రభావం చూపుతుంది. వ్యాపారులు సరుకును ఇబ్బడిముబ్బడిగా నిల్వ చేసుకొనే అవకాశం లేదు. రబీ పంట నిల్వ ఎక్కువ కాలం ఉంటుంది. ఉల్లికి మద్ధతు ధర కోరుతూ మహారాష్ట్ర షేత్కారీ సంఘటన్ మార్చిలో భారీ ఆందోళన నిర్వహించింది. ఈ సంవత్సరం 90 శాతం సగటు దిగుబడులు సాధించే అవకాశ ఉందని అధికారులంటున్నారు.

Advertisement
Advertisement