మరింత పుంజుకున్నాం : ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే | Congress has consolidated itself in Maharashtra: MPCC chief | Sakshi
Sakshi News home page

మరింత పుంజుకున్నాం : ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే

Aug 6 2013 11:04 PM | Updated on Sep 1 2017 9:41 PM

తమ పార్టీ కొంతమేర పుంజుకుందని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు.

నాగపూర్: తమ పార్టీ కొంతమేర పుంజుకుందని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సాంగ్లి మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్సీపీ అధికారంలో ఉందని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. భోర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సైతం తమ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని, తమ భాగస్వామ్యపక్షమైన ఎన్సీపీని ఓడించామన్నారు. ఇక పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా ఎన్సీపీని నాలుగో స్థానంలో నెట్టేశామన్నారు. ఈ నెలాఖరులో జల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయని, ప్రస్తుతం దానిపై తమ పార్టీ దృష్టి పెట్టిందన్నారు. జల్గావ్‌లో బాగానే పనిచేస్తున్నప్పటికీ అక్కడి కార్పొరేషన్‌లో తమ పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేదన్నారు.
 
 బలాబలాల ఆధారంగానే...
 వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీతో కలసి బరిలోకి దిగుతారా అని మీడియా ప్రశ్నించగా ఆయా ప్రాంతాల్లో బలాబలాలను ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతామన్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ విషయంలో పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంకా అప్పటి రాజకీయ పరిస్థితులు, ఆయా అభ్యర్థుల బలాబలాలు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అయితే ఎన్నికల గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందన్నారు.
 
 విదర్భపై మౌనం
 ప్రత్యేక విదర్భ రాష్ట్ర అంశంపై మీడియా ప్రశ్నించగా ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే ఏమాత్రం స్పందించలేదు. మౌనం వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement