అక్కను కడతేర్చిన తమ్ముడు | brother murdered sister | Sakshi
Sakshi News home page

అక్కను కడతేర్చిన తమ్ముడు

Apr 10 2016 2:19 AM | Updated on Sep 3 2017 9:33 PM

అక్కను కడతేర్చిన తమ్ముడు

అక్కను కడతేర్చిన తమ్ముడు

ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను ఇంటిలోకి అనుమతించిన అక్కపై ఆగ్రహంతో ఆమెను హత్య

కేకే.నగర్: ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను ఇంటిలోకి అనుమతించిన అక్కపై ఆగ్రహంతో ఆమెను హత్య చేసి పారిపోయిన తమ్ముడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రామనాథపురం జిల్లా సాయల్‌కుడి సమీపంలో నోమ్ బహుళం గ్రామానికి చెందిన ముత్తు రామలింగం రైతు. ఇతని భార్య పూంగొడి (45). ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.
 
 రెండో కుమార్తె నాగవళ్లి (24). సాయల్‌కుడి సమీపంలో కడుగు సంత సత్రం ప్రాంతంలో వేరే కులానికి చెందిన కన్నన్ (29)ను ప్రేమించి గత ఏడాది వివాహం చేసుకుంది. ఈ వివాహానికి నాగవల్లి తల్లిదండ్రులు వ్యతిరేకత తెలిపారు. కన్నన్ ఇంటిలో వీళ్ల ప్రేమను ఒప్పుకున్నారు. పెళ్లి తరువాత కన్నన్ నాగవల్లి కడుగు సత్రంలో నివసించేవారు.
 
  నాగవల్లికి కొంత కాలం కిందట ఆడపిల్ల పుట్టింది. మనువరాలు పుట్టిన సంగతి తెలిసి పూంగొడి ఆనందపడింది. కూతురిపైన కోపం మరచిపోయి నాగవళ్లిని, బిడ్డను ఇంటికి పిలుచుకుని వచ్చింది. భార్య, బిడ్డను చూడడానికి కన్నన్ తరచూ అత్తగారింటికి వచ్చి వెళ్లేవాడు. ఇదిలా ఉండగా నాగవల్లిని చూడడానికి మదురైలో నివసిస్తున్న పూంగొడి తమ్ముడు మణి శుక్రవారం అక్క ఇంటికి వచ్చాడు. లేచిపోయిన కూతురిని మళ్లీ ఎందుకు ఇంటికి తీసుకొచ్చావ్ అంటూ అక్క పూంగొడితో ఘర్షణకు దిగాడు. చుట్టు పక్కల వారు అతడిని సమాధానపరచి పంపారు.
 
 ఈ సంఘటన వలన ఆగ్రహం చెందిన మణి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఇంటిలో నిద్రిస్తున్న పూంగొడిని కత్తితో పొడిచి చంపాడు. కేకలు విని అడ్డుకున్న నాగవళ్లిని కత్తితో పొడిచాడు. రక్తం మడుగులో పడి గిలగిల లాడుతూ పూంగొడి మృతి చెందింది. తీవ్ర గాయాలపాలైన నాగవళ్లిని రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. సాయలేకుడి పోలీసులు పూంగొడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని రామనాథపురం ప్రభుత్వాసుపత్రికి పంపారు. పరారీ ఉన్న మణి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement