ఎన్నికల ప్రక్రియలోని ప్రతి అంకంలోనూ దూకుడుగా వ్యవహరించే బీజేపీ నాయకులు పార్టీ మేనిఫెస్టో విడుదలలో జాప్యం చేస్తున్నారు.
ఆలస్యం అమృతమయ్యేనా?
Nov 21 2013 11:51 PM | Updated on Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియలోని ప్రతి అంకంలోనూ దూకుడుగా వ్యవహరించే బీజేపీ నాయకులు పార్టీ మేనిఫెస్టో విడుదలలో జాప్యం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న ఈ ఆలస్యం.. పార్టీకి కలిసి వస్తుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న. గత ఎన్నికలను పరిశీలిస్తే ప్రతిసారీ అన్ని ప్రక్రియల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఒకడుగు మందుగానే బీజేపీ ఉండేది. ఎంసీడీ ఎన్నికల్లోనూ అదే తరహాలో ముందుకు వెళ్లింది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య ఉన్న విభేధాల కారణంగా ప్రచారంతో అన్నింట్లోనూ ఆలస్యం కనిపిస్తోంది. అయితే దీన్ని వ్యూహాత్మంగానే చూడాలంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదలలో తొందరపాటుతో చెలరేగిన అసంతృప్తులను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకుందని, అలా మరోమారు జరగకుండా తమ వ్యూహాలను బహిర్గతం చేయకుండా ప్రత్యర్థి పార్టీలైన ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలు వచ్చిన తర్వాతే తమపార్టీ మేనిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే తయారు చేసుకున్న జాబితాలో కాంగ్రెస్, ఆప్ల హామీలను కలగలుపుకుని మరింత ఆకర్షణీయంగా మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు సమాచారం.
ప్రధాన సమస్యలపైనే దృష్టి:
ఢిల్లీవాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపేలా మేనిఫెస్టో తయారు చేయాలని ఇప్పటికే బీజేపీ నాయకులు నిర్ణయించుకున్నారు. ప్రధానంగా ఆమ్ఆద్మీపార్టీ మేనిఫెస్టోకి ధీటుగా ఉండేలా కసరత్తు చేస్తున్నారు. బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో దీన్ని రూపొందిస్తున్నారు. బీజేపీ ప్రధాన హామీ అయిన 30 శాతం విద్యుత్ చార్జీల తగ్గింపుతోపాటు నీటి సరఫరా, మహిళా భద్రతకు పెద్దపీట వేయనున్నారు. సంక్షేమ పథకాలు, అనధికారిక కాలనీలు, జుగ్గీజోపిడీల అభివృద్ధి, క్రమబద్ధీకరణ అంశాలను ప్రధానగా ప్రస్తావించనున్నట్టు సమాచారం.
నేడు బీజేపీ మేనిఫెస్టో:
ఢిల్లీ విధానసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో శుక్రవారం విడుదల చేయనున్నట్టు సమాచారం. పండిత్పంత్మార్గ్లోని బీజేపీ నగరశాఖ కార్యాలయంలో బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్, బీజేపీ ఢిల్లీశాఖ అధ్యక్షుడు విజయ్గోయల్ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.
Advertisement


