రెచ్చిపోయిన యువీ: ట్వంటీ 20లో భారత్ ‘ఎ’ గెలుపు | yuvi set win for indai-a against west indies-a | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన యువీ: ట్వంటీ 20లో భారత్ ‘ఎ’ గెలుపు

Sep 21 2013 10:22 PM | Updated on Sep 1 2017 10:55 PM

వెస్టిండీస్ ‘ఎ’ తో జరిగిన ఏకైక టి20లో భారత్ ‘ఎ’ జట్టు 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

బెంగళూరు: డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (35 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారానికి తోడు రాహుల్ శర్మ (5/23) స్పిన్ మ్యాజిక్ పని చేయడంతో వెస్టిండీస్ ‘ఎ’తో జరిగిన ఏకైక టి20లో భారత్ ‘ఎ’ జట్టు 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు సాధించింది.
 
 

ఓపెనర్లు ఉతప్ప (21 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు), ఉన్ముక్త్ చాంద్ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అపరాజిత్ (3) విఫలమైనా... యువరాజ్, కేదార్ జాదవ్ (21 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 19వ ఓవర్‌లో రస్సెల్ తొలి నాలుగు బంతులకు జాదవ్, యువరాజ్, నమన్ ఓజా (0), యూసుఫ్ పఠాన్ (0)లను వరుస బంతుల్లో అవుట్ చేసి కట్టడి చేశాడు. చివర్లో నర్వాల్ (7 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) చెలరేగడంతో భారత్‌కు భారీ స్కోరు ఖాయమైంది. రస్సెల్ 4, నర్స్ 2 వికెట్లు తీశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement