బ్రిటన్‌ను నిలువరిస్తుందా? | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ను నిలువరిస్తుందా?

Published Sun, Jul 5 2015 12:11 AM

బ్రిటన్‌ను నిలువరిస్తుందా?

 కాంస్య పతక పోరు కోసం భారత్ సిద్ధం   
 వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ

 
 యాంట్‌వార్ప్: చిన్నచిన్న లోపాలను అధిగమించడంలో విఫలమవుతున్న భారత జట్టు... హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ టోర్నీలో కాంస్య పతక పోరు కోసం సిద్ధమైంది. నేడు జరగనున్న ప్లే ఆఫ్ మ్యాచ్‌లో తమకంటే మెరుగైన ప్రత్యర్థి, ప్రపంచ ఐదో ర్యాంకర్ గ్రేట్ బ్రిటన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్, క్వార్టర్‌ఫైనల్లో స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో చెలరేగిన ఇరుజట్లు సెమీస్‌కు వచ్చేసరికి బలహీనతలను అధిగమించలేకపోయాయి. బెల్జియం స్ట్రయికర్ల దాడులకు భారత డిఫెన్స్ కకావికలమైతే... ప్రపంచ చాంపియన్ ఆసీస్ దూకుడు ముందు బ్రిటన్ తలవంచింది. అయితే ఇప్పుడు ఈ రెండు జట్లలో మెరుగైన టీమ్ ఏదో ప్లే ఆఫ్ మ్యాచ్‌తో తేలిపోతుంది. కీలక సమయంలో ఫార్వర్డ్స్, డిఫెండర్ల మధ్య సమన్వయం కొరవడుతుండటం భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. మరోవైపు భారత్‌తో పోలిస్తే బ్రిటన్ మెరుగ్గా ఆడుతోంది.
 
  సెమీస్‌లో ఆసీస్‌ను తక్కువ స్కోరుకు నిలువరించడమే ఇందుకు చక్కని ఉదాహరణ.
 ఫైనల్లో ఆసీస్: శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా 3-1తో బ్రిటన్‌పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. గోవర్స్ బ్లేక్ (28వ ని.లో), బాలె డేనియల్ (38వ ని.లో), వెటన్ జాకబ్ (51వ ని.లో)లు ఆసీస్‌కు గోల్స్ అందించారు. బ్రిటన్ తరఫున కాట్లిన్ నిక్ (36వ ని.లో) ఏకైక గోల్ చేశాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement