ఇకనైనా కలిసి కట్టుగా పోరాడుదాం: రియాజ్‌

Wahab Riaz Urges Pakistan Teammates To Stick Together - Sakshi

లండన్‌: తమ జట్టులోని ఆటగాళ్ల మధ్య విభేదాలు ఏమైనా ఉంటే వాటిని పక్కనుపెట్టి కలిసి కట్టుగా పోరాడటానికి సిద్ధం కావాలని పాకిస్తాన్‌ పేసర్‌ వహాబ్‌ రియాజ్‌ సూచించాడు. వన్డే వరల్డ్‌కప్‌లో పాక్‌ జట్టు వరుస పరాజయాలకు ఆటగాళ్ల మధ్య నెలకొన్న విభేదాలే కారణమని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ మధ్య అంతర్గతంగా ఎటువంటి సమస్యలు లేవని చెప్పాలంటే ఆటగాళ్లంతా ఒక్కటిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నాడు రియాజ్‌.

‘భారత్‌ చేతిలో ఎదురైన ఓటమిని మరచిపోదాం. అది గతం. ఇప్పుడు వరల్డ్‌కప్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే సఫారీలతో జరుగనున్న మ్యాచ్‌లో విజయం చాలా అవసరం. మనకు మనమే పుంజుకోవాలి. మనకు మనమే బలం. మనమంతా మంచి స్నేహితులం. మనం ఒకే కుటుంబానికి చెందిన వారం కాకపోయినా ఒక మంచి వాతావరణంతో జట్టుగా గాడిలో పడదాం’ అని సహచరులకు రియాజ్‌ మొరపెట్టుకున్నాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో బలపడటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగనున్న మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపై దృష్టి నిలిపామన్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో పాకిస్తాన్‌ తలపడనుంది.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top