టాప్-5 ర్యాంక్‌పై కశ్యప్ దృష్టి | Top-5 is a real possibility in near future, feels Kashyap | Sakshi
Sakshi News home page

టాప్-5 ర్యాంక్‌పై కశ్యప్ దృష్టి

Sep 22 2013 11:57 PM | Updated on Sep 1 2017 10:57 PM

భారత స్టార్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ టాప్-5 ర్యాంకుపై కన్నేశాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నప్పటికీ దీన్ని సాధించే సత్తా తనలో ఉందని అన్నాడు.

న్యూఢిల్లీ: భారత స్టార్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ టాప్-5 ర్యాంకుపై కన్నేశాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నప్పటికీ దీన్ని సాధించే సత్తా తనలో ఉందని అన్నాడు. ‘నేను టాప్-5లో స్థానం దక్కించుకోగలను. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడో ర్యాంకు ఆటగాడిని ఓడించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎంతకష్టమైనా సరే మేటి ఐదు ర్యాంకుల్లో నిలుస్తా’ అని ప్రపంచ 12వ ర్యాంకర్ కశ్యప్ అన్నాడు.
 
  పీఎస్‌పీబీ టోర్నమెంట్ కోసం ఇక్కడికొచ్చిన అతను ఇందులో ఆడేది అనుమానంగానే ఉంది. 27 ఏళ్ల ఈ ఏపీ స్టార్ ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంపైనే దృష్టి సారించినట్లు చెప్పాడు. అనంతరం డెన్మార్క్, ఫ్రాన్స్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీల్లో పాల్గొంటాడు. మూడు వారాల వ్యవధిలో ఈ టోర్నీలు జరుగుతాయని ఇందుకు సన్నద్ధమవుతానని చెప్పాడు. వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లాంటి మెగా టోర్నీలు జరగనున్నాయని దీంతో ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంపైనే దృష్టిపెడతానన్నాడు.
 
 సింధు, కశ్యప్‌లకు టాప్ సీడింగ్
 నేటి నుంచి పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) ఇంటర్ యూనిట్ టోర్నమెంట్ జరగనుంది. ఇందులో ఏపీ రైజింగ్ స్టార్ పి.వి.సింధు టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతోంది. పురుషుల ఈవెంట్‌లో కశ్యప్‌కు టాప్ సీడింగ్ దక్కింది. ఇక్కడి సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగే ఈ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి గుత్తా జ్వాల, శ్రీకాంత్, గురుసాయిదత్‌లతో పాటు అశ్విని పొన్నప్ప, వి. దిజు, అజయ్ జయరామ్ తదితరులు పాల్గొంటారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement