చెస్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరుకు నేడు (శనివారం) తెర లేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో విశ్వనాథన్ ఆనంద్, నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే)తో ప్రపంచ చెస్ చాంపియన్షిప్ టైటిల్ కోసం తలపడనున్నాడు.
చెన్నై: చెస్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరుకు నేడు (శనివారం) తెర లేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో విశ్వనాథన్ ఆనంద్, నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్సెన్ (నార్వే)తో ప్రపంచ చెస్ చాంపియన్షిప్ టైటిల్ కోసం తలపడనున్నాడు. ఈనెల 28 వరకు స్థానిక హయత్ రీజెన్సీ హోటళ్లో ఈ ఈవెంట్ జరగనుంది.
అనుభవానికి, యువ జోరుకు మధ్య జరుగుతున్న సమరంగా ఇప్పటికే క్రేజ్ తెచ్చుకున్న ఈ మ్యాచ్లో విజేత ఎవరో విశ్లేషకులు కూడా అంత తేలిగ్గా చెప్పలేకపోతున్నారు. ఐదు సార్లు ఈ టైటిల్ నెగ్గిన 44 ఏళ్ల ఆనంద్.. ఇప్పటికే విశ్వవ్యాప్తంగా చెస్ మేధావిగా పిలిపించుకుంటున్న యువ సంచలనం కార్ల్సెన్ మధ్య జరిగే ఈ గేమ్ను 1972లో బాబీ ఫిషర్, బోరిస్ స్పాస్కీ మధ్య జరిగిన ఆటతో పోల్చుతున్నారు. తొలి గేమ్ను కార్ల్సెన్ తెల్ల పావులతో ఆడనుండడం సానుకూలంగా కనిపించినా అది సత్ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు.
ఎందుకంటే ప్రతీ ఆటగాడు ఈ 12 గేమ్ల్లో ఆరేసి సార్లు తెల్ల పావులు, నల్ల పావులతో ఆడాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఆనంద్కు అనుభవమే అయినా తొలిసారి ఈ మెగాపోరులో అడుగుపెట్టిన కార్ల్సెన్కు మాత్రం కొత్తే అని చెప్పుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లాడి చేష్టలు పోని ఈ కుర్రాడు అపార అనుభవజ్ఞుడిని ఎలా ఎదుర్కొంటాడనేది చెస్ అభిమానులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.