వయసు మీరిన అథ్లెట్లను ఆసియా యూత్ గేమ్స్కు పంపిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)పై భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) ఆగ్రహంగా ఉంది. వారు చైనాకు వెళ్లడానికి తాము ఇచ్చిన ఖర్చులను ఏఎఫ్ఐ నుంచే వసూలు చేయాలని నిర్ణయించింది. చైనాలోని నాన్జింగ్లో జరుగుతున్న ఈ గేమ్స్కు 17 ఏళ్ల వయస్సు కలిగిన అథ్లెట్స్ అర్హులు. అయితే ఏఎఫ్ఐ 1996లో జన్మించిన 18 మంది ఆటగాళ్లను ఈ పోటీలకు పంపింది.
న్యూఢిల్లీ: వయసు మీరిన అథ్లెట్లను ఆసియా యూత్ గేమ్స్కు పంపిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)పై భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) ఆగ్రహంగా ఉంది. వారు చైనాకు వెళ్లడానికి తాము ఇచ్చిన ఖర్చులను ఏఎఫ్ఐ నుంచే వసూలు చేయాలని నిర్ణయించింది. చైనాలోని నాన్జింగ్లో జరుగుతున్న ఈ గేమ్స్కు 17 ఏళ్ల వయస్సు కలిగిన అథ్లెట్స్ అర్హులు. అయితే ఏఎఫ్ఐ 1996లో జన్మించిన 18 మంది ఆటగాళ్లను ఈ పోటీలకు పంపింది. ఏడాది వయస్సు ఎక్కువైందనే కారణంతో వీరిని నిర్వాహకులు వెనక్కి పంపారు.
‘నిజంగా ఇది దేశానికి అవమానకరం. ఈ వ్యవహారంపై ఏఎఫ్ఐను వివరణ కోరతాం. అలాగే అథ్లెట్ల విమాన ప్రయాణం కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన దాదాపు రూ.10 లక్షలను సమాఖ్య నుంచే వసూలు చేస్తాం’ అని సాయ్ డెరైక్టర్ జనరల్ జిజి థామ్సన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర క్రీడాశాఖ విచారణకు ఆదేశించింది. మరోవైపు ఐఏఏఎఫ్ నిబంధనల ప్రకారం 1996లో జన్మించిన అథ్లెట్లను పంపామని... అయితే ఈ గేమ్స్ ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయనే విషయం మర్చిపోయినట్టు ఏఎఫ్ఐ తెలిపింది.