పసికూనలపై పంజా.. టీ20 సిరీస్‌ భారత్‌దే

Team India Sweeps Ireland In T20 Series - Sakshi

డబ్లిన్‌ : పసికూన ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ సునాయాసంగా గెలుచుకుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు సన్నాహకంగా భావించిన ఐర్లాండ్‌ సిరీస్‌లో కోహ్లి సేన తన స్థాయికి తగ్గట్లు ప్రదర్శన ఇచ్చింది. శుక్రవారం డబ్లిన్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. భారత్‌ విసిరిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేధించే క్రమంలో ఐర్లాండ్‌ ఏ దశలోనూ గట్టిగా నిలబడలేదు. 12.3 ఓవర్లలో 70 పరుగులకే ఆతిథ్యజట్టు చాపచుట్టేసింది. స్పిన్‌ ద్వయం చాహల్‌-కుల్దీప్‌లు అద్భుతమైన ప్రదర్శనతో ఐర్లాండ్‌ భరతంపట్టారు. ఇద్దరూ చెరో 3 వికెట్లు నేలకూల్చగా, ఉమేశ్‌ యాదవ్‌కు 2, కౌల్‌, హార్దిక్‌ పాండ్యాలకు చెరో వికెట్‌ దక్కింది.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేఎల్‌ రాహుల్‌ 70(36 బంతుల్లో 6సిక్సర్లు, 3 ఫోర్లు), సురేశ్‌ రైనా 69(45 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్లు) పరుగులతో చెలరేగారు. చివర్లో హార్దిక్‌ పాండ్యా 9 బంతుల్లోనే 32 పరుగులు రాబట్టాడు.  ఐర్లాండ్‌ బౌలర్లలో ఒబ్రెయిన్‌ 3, చేజ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top