దక్షిణాఫ్రికా ‘ఎ’ 246/8  | South Africa 'A' team 246/8 | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా ‘ఎ’ 246/8 

Aug 5 2018 1:04 AM | Updated on Aug 5 2018 1:04 AM

South Africa 'A'  team 246/8 - Sakshi

బెంగళూరు: బౌలర్లు సమష్టిగా రాణించడంతో దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతోన్న తొలి అనధికారిక టెస్టులో భారత్‌ ‘ఎ’ ప్రత్యర్థి జట్టును కట్టడి చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా ‘ఎ’ 88 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. రూడీ సెకండ్‌ (94; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీని కోల్పోయాడు. హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ (3/56) ఆకట్టుకున్నాడు. శనివారం ఇక్కడ ప్రారంభమైన ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకోగా... సిరాజ్‌ చెలరేగడంతో ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు. పీటర్‌ మలాన్‌ (7), జుబేర్‌ హమ్జా (0)లను పెవిలియన్‌ చేర్చడంతో ఆ జట్టు 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో సరెల్‌ ఇర్వీ (47; 7 ఫోర్లు) నిలబడ్డాడు. కెప్టెన్‌ ఖాయా జోండో (24), సెనురాన్‌ ముత్తుస్వామి (23)లతో కలిసి కొన్ని పరుగులు జతచేశాడు. అనంతరం రూడీ సెకండ్‌ ఒంటరి పోరాటం చేస్తూ జట్టును ఓ మోస్తరు స్కోరుకు చేర్చాడు.  భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు పేసర్లు నవ్‌దీప్‌ సైనీ (2/47), రజనీశ్‌ గుర్బానీ (2/47) రాణించారు. ఈ మ్యాచ్‌లో ఆంధ్ర రంజీ క్రికెటర్లు కోన శ్రీకర్‌ భరత్, హనుమ విహారి భారత తుది జట్టులో ఉన్నారు. వికెట్‌ కీపర్‌ భరత్‌ నాలుగు క్యాచ్‌లు, విహారి ఒక క్యాచ్‌ తీసుకోవడం విశేషం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement