'క్రికెటర్లు కామెడీ చేయడానికి రాలేదు' | Shoaib Akhtar criticise Ian Chappell on inviting Pakistan | Sakshi
Sakshi News home page

'క్రికెటర్లు కామెడీ చేయడానికి రాలేదు'

Jan 12 2017 11:08 AM | Updated on Sep 5 2017 1:06 AM

'క్రికెటర్లు కామెడీ చేయడానికి రాలేదు'

'క్రికెటర్లు కామెడీ చేయడానికి రాలేదు'

ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ విరుచుకుపడ్డాడు.

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ విరుచుకుపడ్డాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో వైట్వాష్ అయిన పాకిస్తాన్ జట్టుపై ఇయాన్ చాపెల్ చేసిన విమర్శలపై స్పీడ్ స్టర్ అక్తర్ తీవ్రంగా స్పందించాడు. పాక్ జట్టు కామెడీ చేయడానికి మీ దేశానికి రాలేదని, కాంపిటీటివ్ గేమ్ ఆడేందుకు ఆసీస్ వచ్చారని తెలుసుకోవాలని చాపెల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఆ ఆటగాళ్ల ప్రదర్శన మెరుగ్గా లేదన్నది వాస్తవమే. ఆ విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపాడు. అయితే క్రికెట్ గేమ్ రూపొందించిన ఇంగ్లండ్ ఎప్పుడైనా వన్డే ప్రపంచ కప్ నెగ్గిందా, అలాగని వాళ్లు ఇంట్లో కూర్చుంటున్నారా అని అక్తర్ ప్రశ్నించాడు.

తమ జట్టు ఆటతీరును మెరుగు పరుచుకునే వరకూ మీరు వేచిచూడండి. అప్పటివరకూ ఓపికపట్టకుండా పాక్ జట్టును సిరీస్ అంటూ ఎందుకు ఆహ్వానించారంటూ వ్యంగ్యస్త్రాలను సంధించాడు. ఇదే పాక్ కొన్ని నెలల కిందట ఇంగ్లండ్ పై 2-2తో సిరీస్ డ్రా చేసుకున్న విషయం మీకు తెలియదా అని ఇయాన్ చాపెల్‌ను ప్రశ్నించాడు. ఫీల్డింగ్ లోపం వల్లే తమ జట్టు వైఫల్యాలు కొనసాగుతున్నాయని అభిప్రాయపడ్డాడు. పాకిస్తాన్ జట్టు ఆసీస్ గడ్డపై వరుసగా 12 టెస్టుల్లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో పాక్ జట్టులో సరైన నాయకుడు లేడని, మిస్బా ఉల్ హక్ నుంచి జట్టు ఏవిధంగానూ స్ఫూర్తిపొందలేదని.. వాళ్లు ఇంట్లో కూర్చోవడమే మంచిదంటూ చాపెల్ వ్యాఖ్యానించాడు.

Advertisement
 
Advertisement
Advertisement