సర్ఫరాజ్‌కు డిమోషన్‌..!

Sarfaraz Ahmed Set To Be Demoted In PCB's Contracts List - Sakshi

పీసీబీ కొత్త కాంట్రాక్ట్‌ జాబితా సిద్ధం

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ క్రమేపీ తన ఉనికిని కోల్పోతున్నాడు. గతేడాది నవంబర్‌లో అటు కెప్టెన్‌గా, ఇటు  ఆటగాడిగా మూడు ఫార్మాట్ల నుంచి తొలగించబడ్డ సర్ఫరాజ్‌.. తాజాగా మరింత కిందకి పడిపోయినట్లు తెలుస్తోంది. 2020-21 సీజన్‌కు సంబంధించి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)కి విడుదల చేయడానికి సిద్ధంగా ఉ‍్నన కొత్త కాంట్రాక్ట్‌ జాబితాలో సర్ఫరాజ్‌కు సి కేటగిరీ కేటాయించినట్లు తెలుస్తోంది.. గతంలో కెప్టెన్‌గా చేసిన సమయంలో ‘ ఏ’ కేటగిరీలో ఉన్న సర్ఫరాజ్‌కు ‘సి’తో సరిపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. గతేడాది ఆగస్టులో 19 క్రికెటర్లకు మాత్రమే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించిన  సంగతి తెలిసిందే. అప్పటివరకూ 32  మందికి చోటు కల్పిస్తూ వచ్చిన పీసీబీ వారిని 19కి కుదించింది. తాజాగా వారికే తిరిగా చోటు కల్పించడానికి సిద్ధమైన పీసీబీ..  2017 చాంపియన్స్‌ ట్రోఫీ కెప్టెన్‌ అయిన సర్ఫరాజ్‌కు ‘సి’తో సరిపెడితే చాలని భావిస్తోంది. ('పాంటింగ్‌ గెలుపు కోసం చూస్తాడు.. ధోని మాత్రం')

గతంలో సర్పరాజ్‌ అహ్మద్‌ కెప్టెన్‌గా ఉన్న సమయంలో ‘ఎ’ కేటగిరీని దక్కించుకున్నాడు. బాబర్‌ అజామ్‌, యాసిర్‌ షాలతో కలిసి సర్ఫరాజ్‌ కొంతకాలం ‘ఎ’ కాంట్రాక్ట్‌ విభాగంలో కొనసాగాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులో సభ్యుడిగా లేని సర్ఫరాజ్‌ను తిరిగి మళ్లీ జట్టులోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే అతనికి ‘సి’ కేటాగిరీ కేటాయించినట్లు పీసీబీ వర్గాల సమాచారం. అదే సమయంలో ఆటగాళ్ల  మ్యాచ్‌ ఫీజులో కోత విధించడానికి కూడా పీసీబీ సిద్ధమైంది. ప్రస్తుత పీసీబీ నిబంధనల ప్రకారం ’ఏ’  కేటగిరీలో ఉన్న ఆటగాడికి టెస్టు మ్యాచ్‌ ఫీజు రూ. 7, 62,300 ఉండగా,  బి కేటగిరీలో ఉన్న ఆటగాడికి రూ. 6,65,280 గా ఉంది. ఇక సి కేటగిరీలో క్రికెటర్లకు రూ. 5, 68, 260 గా ఉంది. గతేడాది చివర్లో శ్రీలంకతో జరిగిన స్వదేశీ సిరీస్‌ తర్వాత సర్ఫరాజ్‌ మళ్లీ పాకిస్తాన్‌ తరఫున ఆడలేదు. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన గత వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ నాకౌట్‌ స్టేజ్‌కు వెళ్లకుండానే నిష్క్రమించింది. దానిలో భాగంగా ప్రక్షాళన చేపట్టిన పీసీబీ.. ముందుగా కెప్టెన్‌ సర్ఫరాజ్‌ను కోచ్‌ మికీ ఆర్థర్‌లకు ఉద్వాసన పలికింది. సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తొలగించినా ఆటగాడిగా మాత్రం ఉంచింది. అయితే కెప్టెన్సీ భారం తగ్గినా సర్ఫరాజ్‌ ఆటలో మార్పు రాకపోవడంతో అతన్ని ఆటగాడిగా తప్పించింది. మళ్లీ సర్ఫరాజ్‌కు చోటు కల్పించాలనే ఉద్దేశంతో ఉన్న పీసీబీ.. కనీసం సి కేటగిరిలో ఉంచినట్లు సమాచారం.(ధావన్‌ ఒక ఇడియట్‌.. స్ట్రైక్‌ తీసుకోనన్నాడు..!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top