చాంపియన్‌ సామియా

Samia Wins Junior Badminton Title - Sakshi

ఆలిండియా ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారిణి సామియా ఇమాద్‌ ఫారూఖి సత్తా చాటింది. తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఈ టోర్నీలో అండర్‌–19 బాలికల సింగిల్స్‌ విభాగంలో సామియా విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఐదో సీడ్‌ సామియా 21–17, 21–12తో పదహారో సీడ్‌ ఆషి రావత్‌ (ఢిల్లీ)పై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో సామియా 21–16, 21–13తో అక్షయ అర్ముగం (తమిళనాడు)పై విజయం సాధించింది. బాలుర సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ మైస్నమ్‌ మీరాబా (మణిపూర్‌) టైటిల్‌ను అందుకున్నాడు.

ఫైనల్లో మైస్నమ్‌ 21–19, 12–7తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి ఆకాశ్‌ యాదవ్‌ (ఢిల్లీ) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో మైస్నమ్‌ విజేతగా నిలిచాడు. బాలుర డబుల్స్‌ విభాగంలో పి. విష్ణువర్ధన్‌ (తెలంగాణ) జంట టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. తుదిపోరులో రెండో సీడ్‌ ఇషాన్‌ భట్నాగర్‌ (ఛత్తీస్‌గఢ్‌)–పి. విష్ణువర్ధన్‌ గౌడ్‌ (తెలంగాణ) ద్వయం 21–18, 21–13తో టాప్‌ సీడ్‌ మంజిత్‌ సింగ్‌–డింకూ సింగ్‌ (మణిపూర్‌) జంటపై నెగ్గిం ది. సెమీఫైనల్లో విష్ణువర్ధన్‌ జోడీ 21–16, 21–23, 21–14తో ఐదో సీడ్‌ యశ్‌ రైక్వార్‌ (మధ్యప్రదేశ్‌)–ఇమాన్‌ సోనోవాల్‌ (అస్సాం) జంటపై నెగ్గింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top