సైనాకు తొలిరౌండ్లోనే షాక్‌  | Saina Nehwal Knocked Out After Losing To Pornpawee Chochuwong In First Round | Sakshi
Sakshi News home page

సైనాకు తొలిరౌండ్లోనే షాక్‌ 

Apr 4 2019 2:28 AM | Updated on Apr 4 2019 2:28 AM

Saina Nehwal Knocked Out After Losing To Pornpawee Chochuwong In First Round - Sakshi

కౌలాలంపూర్‌: భారత వెటరన్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు మలేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. గత వారం ఇండియా ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ ఈ టోర్నీలో తొలిరౌండ్‌ దాటలేకపోయాడు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్లో ఎనిమిదో సీడ్‌ సైనా 22–20, 15–21, 10–21తో పొర్న్‌పవీ చొచువోంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో కంగుతింది. ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ థాయ్‌ ప్రత్యర్థిపై గెలిచిన ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ సైనా తొలిసారి తనకన్నా తక్కువ ర్యాంకులో ఉన్న పొర్న్‌పవీ (21 ర్యాంకు) చేతిలో ఓడిపోయింది.

మరో మ్యాచ్‌లో ఐదో సీడ్‌ సింధు 22–20, 21–12తో జపాన్‌కు చెందిన అయ ఒహొరిపై గెలుపొందింది. ఆమెపై సింధుకిది ఆరో విజయం కావడం విశేషం. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ 21–18, 21–16తో ఇసాన్‌ మౌలాన ముస్తఫా (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 21–12, 16–21, 14–21తో సితికొమ్‌ తమసిన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం చవిచూశాడు. పురుషుల, మహిళల సింగిల్స్‌లో భారత్‌ తరఫున సింధు, శ్రీకాంత్‌లే మిగిలారు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్‌ రెడ్డి ద్వయం 16–21, 6–21తో ఏడో సీడ్‌ హన్‌ చెంగ్‌కై–జౌ హొడాంగ్‌ (చైనా) జంట చేతిలో చిత్తుగా ఓడింది. నేడు జరిగే మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా జోడీ మలేసియాకు చెందిన తన్‌ కిన్‌ మెంగ్‌–లై పి జింగ్‌ జంటతో తలపడుతుంది. సింగిల్స్‌లో సింధు కొరియాకు చెందిన సుంగ్‌ జీ హ్యూన్‌తో, శ్రీకాంత్‌ థాయ్‌లాండ్‌ ఆటగాడు కొసిట్‌ ఫెట్‌ప్రదబ్‌తో పోటీ పడతారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement