సాయిప్రణీత్‌ నిష్క్రమణ | Sai Praneeth Loses in Straight Games | Sakshi
Sakshi News home page

సాయిప్రణీత్‌ నిష్క్రమణ

Aug 3 2019 10:02 AM | Updated on Aug 3 2019 10:02 AM

Sai Praneeth Loses in Straight Games - Sakshi

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ – 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత టైటిల్‌ ఆశలను మోస్తున్న భమిడిపాటి సాయిప్రణీత్‌ కూడా ఓటమి పాలయ్యాడు. క్రితం వారం జరిగిన జపాన్‌ ఓపెన్‌లో సెమీస్‌ మెట్టు వరకు చేరిన ప్రణీత్‌ ఈ సారి మాత్రం క్వార్టర్స్‌ నుంచే ఇంటి దారి పట్టాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ప్రణీత్‌ 18–21, 12–21తో కంట సునెయామ (జపాన్‌) చేతిలో వరుస గేమ్‌లలో చిత్తయ్యాడు. పోటాపోటీగా సాగిన మొదటి గేమ్‌ చివర్లో తడబడిన అతను 18–17 ఆధిక్యం నుంచి 18–21తో గేమ్‌ను కోల్పోయాడు. అనంతరం మరింత చేలరేగిన సునెయామ రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

డబుల్స్‌లో మిశ్రమ ఫలితాలు

శుక్రవారం జరిగిన డబుల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌శెట్టి జంట 21–17, 17–21, 21–19తో చోయ్‌ సోల్గ్యు – సియో సెంగ్‌ జే (కొరియా) ద్వయంపై పోరాడి గెలవగా... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ – అశ్విని పొన్నప్ప జోడి 13–21, 15–21తో యుట వటనాబె – అరిస హిగాషినో (జపాన్‌) జోడి చేతిలో ఓడింది. నేటి సెమీస్‌ మ్యాచ్‌లో కొ సంగ్‌ హ్యూన్‌ – షిన్‌ బేక్‌ చియోల్‌ (కొరియా) ద్వయంతో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌శెట్టి ద్వయం తలపడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement