బోపన్న జంట శుభారంభం

bopanna

న్యూఢిల్లీ: చైనా ఓపెన్‌ ఏటీపీ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–పాబ్లో క్యువాస్‌ (ఉరుగ్వే) జంట క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. బీజింగ్‌లో జరిగిన తొలి రౌండ్‌లో బోపన్న–క్యువాస్‌ ద్వయం 6–0, 6–4తో మావో జిన్‌ గాంగ్‌–జె జాంగ్‌ (చైనా) జోడీపై గెలిచింది. 53 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట నాలుగు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది.  

యూకీ ఓటమి

మరోవైపు చైనీస్‌ తైపీలో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్‌ టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో యూకీ బాంబ్రీ 3–6, 3–6తో జాన్‌ మిల్‌మన్‌ (ఆస్ట్రేలియా) చేతిలో... సుమీత్‌ నాగల్‌ 4–6, 2–6తో మరియస్‌ కోపిల్‌ (రొమేనియా) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో దివిజ్‌ శరణ్‌ (భారత్‌)–స్కాట్‌ లిప్‌స్కీ (అమెరికా) ద్వయం 6–1, 6–4తో జియు చెన్‌ హంగ్‌–చెంగ్‌ యు యు (చైనీస్‌ తైపీ) జోడీపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరింది. మరో మ్యాచ్‌లో విష్ణువర్ధన్‌–జీవన్‌ నెదున్‌చెజియాన్‌ (భారత్‌) జంట 2–6, 4–6తో జేమ్స్‌ సెరెటాని (అమెరికా)–మార్క్‌ పాల్మన్స్‌ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top