గ్రేట్ ఇండియన్ క్రికెట్ సిరీస్

Review Of 2019: Indian Cricket Team Bash Serieses - Sakshi

భారత క్రికెట్‌కు 2019 ‘గుడ్‌’గా సాగి ‘బైబై’ చెప్పింది. ఆటలో మేటి జట్టుగా టీమిండియా దూసుకెళ్లగా... వ్యక్తిగతంగానూ క్రికెటర్లు ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. కొన్ని సిరీస్‌లలో అయితే ఒకరిని మించి ఒకరు దంచేశారు. గాయాల మరకలు, కీలక ఆటగాళ్ల లోటు ఏ సిరీస్‌లోనూ కనబడలేదంటే అతిశయోక్తి కాదు. బ్యాటింగ్‌ ఇండియాలో బౌలింగ్‌ గ్రేట్‌ అయ్యింది ఈ ఏడాదే. కోహ్లి ‘టన్‌’లకొద్దీ పరుగులు, రోహిత్‌ ప్రపంచకప్‌ శతకాలు, కొన్ని మచ్చుతునకలైతే... టెస్టుల్లో మయాంక్, వన్డేల్లో రాహుల్‌ రెగ్యులర్‌ ఓపెనర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎదిగారు.  

2019లో కోహ్లి సేన జోరు

టెస్టుల్లో అయితే భారత్‌కు ఓటమన్నదే లేదు. రెగ్యులర్‌ ఓపెనర్‌ ధావన్‌ లేని భారత్‌కు మయాంక్‌ అగర్వాల్‌ రూపంలో మరో నిలకడైన బ్యాట్స్‌మన్‌ జతయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెటర్‌ రోహిత్‌కు ఐదురోజుల ఆట కలిసొచ్చింది కూడా ఈ ఏడాదే. ఆ్రస్టేలియా పర్యటనలోని ఆఖరి టెస్టును డ్రా చేసుకున్న భారత్‌... ఆ తర్వాత ఆడితే గెలుపు తప్ప మరో ఫలితం ఎరుగదు. విండీస్‌ దీవుల్లో ఆడిన రెండు టెస్టుల్ని భారీతేడాతో గెలిచింది. అక్టోబర్‌లో ఇక్కడికొచ్చిన దక్షిణాఫ్రికాను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. సఫారీ జట్టుపై రెండు టెస్టులైతే ఇన్నింగ్స్‌తేడాతో గెలుపొందడం విశేషం. ఓపెనర్లుగా మయాంక్, రోహిత్‌ సెంచరీలు, డబుల్‌ సెంచరీలతో మెరిశారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ (2–0)లో భారత్‌కు రెండో ఇన్నింగ్స్‌ ఆడే అవకాశమే రాలేదు. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ దెబ్బకు బంగ్లా కునారిల్లింది. వరల్డ్‌ చాంపియన్‌íÙప్‌లో భాగంగా ఆడిన మూడు సిరీస్‌లూ గెలిచి అందుబాటులో ఉన్న 360 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది.

ఇంటా గెలిచి... రచ్చా గెలిచి...

ఏడాది ప్రత్యేకించి వన్డేల్లో  టీమిండియా గర్జించింది. ఎక్కడికెళ్లినా ఎదురేలేని జట్టుగా తిరిగొచి్చంది. ఇంటా బయటా కలిపి ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లాడిన భారత్‌ నాలుగింటిని వశం చేసుకుంది. ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో ఒకటి రద్దయితే ఏడు గెలిచింది. ఓవరాల్‌గా ఏ జట్టుకూ సాధ్యం కానీ 70 శాతం విజయాలు నమోదు చేసింది. మొదట ఆ్రస్టేలియా గడ్డపై కంగారూ పెట్టించి మరీ వన్డే క్రికెట్లో భారత్‌ విజయ శాసనానికి శ్రీకారం చుట్టింది. అక్కడ మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకొని కొత్త ఏడాదికి గెలుపు రుచిని చూపించింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ధోని ఆట అదరహో! తొలుత ఓడిన మ్యాచ్‌ సహా... వరుస వన్డేల్లో మిస్టర్‌కూల్‌ (51, 55 నాటౌట్, 87 నాటౌట్‌) అర్ధసెంచరీలతో అదరగొట్టాడు. ఆ వెంటే న్యూజిలాండ్‌కెళ్లి చితగ్గొట్టింది. ఐదు వన్డేల్లో ఒకే ఒక్క మ్యాన్‌ మినహా ప్రతి పోరులో పరాక్రమం చూపింది. 4–1తో కివీరెక్కలు విరిచింది. ఈ సిరీస్‌లో తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు చూపించిన తెగువ క్రికెట్‌ విశ్లేషకుల్ని ఆకర్షించింది.

ముఖ్యంగా ఆఖరి వన్డేలో రోహిత్, ధావన్, ధోనిలాంటి హేమాహేమీలు సైతం విలవిలలాడిన చోట మన రాయుడు (113 బంతుల్లో 90; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. 18 పరుగులకే 4 వికెట్లను కోల్పోయిన భారత్‌కు పెద్దదిక్కయ్యాడు. మొత్తానికి విజయగర్వంతో ఉన్న కోహ్లి సేనకు సొంతగడ్డపై ఆసీస్‌ చేతిలో అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ యేడు భారత్‌ కోల్పోయిన సిరీస్‌ (2–3తో) ఇదొక్కటే! అనంతరం వరల్డ్‌కప్‌ ముగిశాక కరీబియన్‌ దీవులకెళ్లి మళ్లీ జయకేతనం ఎగరేసింది. అక్కడ 3వన్డేల సిరీస్‌లో తొలి వన్డే రద్దవగా తర్వాత రెండు వన్డేల్ని సునాయాసంగా గెలుచుకుంది. మళ్లీ ఇటీవల ఇక్కడికొచ్చాక కూడా వెస్టిండీస్‌ను విడిచిపెట్టలేదు. భారీస్కోర్లు చేసిమరీ 2–1తో నెగ్గింది. అయితే విండీస్‌ ఓడినా ఆకట్టుకుంది. ఈ క్యాలెండర్‌ను కోహ్లి రోహిత్‌లు అసాధారణ ఫామ్‌తో ముగించారు. రోహిత్‌ 28 మ్యాచ్‌ల్లో 57.30 సగటుతో 1490 పరుగులు చేశాడు. 7 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు బాదాడు. 26 వన్డేలాడిన కెపె్టన్‌ 59.86 సగటుతో 1377 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 7 ఫిఫ్టీలు కొట్టాడు.

మెరుపుల్లో వెనుకబడింది

పొట్టి ఫార్మాట్‌లో మాత్రం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్‌ పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో 2–1తో ఓడిన టీమిండియా... స్వదేశంలో ఆసీస్‌ చేతిలో 2–0తో కంగుతింది. గట్టి జట్లపై మన మెరుపులు మెరవలేదు. అయితే విండీస్‌ పర్యటనలో భాగంగా అమెరికాలో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం కోహ్లి సేన చెలరేగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. సొంతగడ్డపై సఫారీతో జరిగిన మూడు మ్యాచ్‌ల పొట్టి ఆటను 1–1తో సమం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ రద్దయింది. తర్వాత బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో సిరీస్‌లను 2–1తో గెలిచినప్పటికీ ఒక్కో మ్యాచ్‌లో ఎదురుదెబ్బలు తిన్నది.

సెమీస్‌లో చెదిరిన ‘ప్రపంచ’కల

కోహ్లిసేన ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ జట్టుగా బరిలోకి దిగింది. విదేశీ దిగ్గజాలు, వ్యాఖ్యాతలు సైతం కప్‌ భారత్‌దే అని జోస్యం చెప్పారు. అయితే భారత్‌ కూడా ఫేవరెట్‌ హోదాకు సెమీస్‌ దాకా న్యాయం చేసింది. 9 లీగ్‌ మ్యాచ్‌లకు గాను ఒక్క ఆతిథ్య జట్టు చేతిలోనే ఓడింది. ఒక వన్డే రద్దయింది. ఆసీస్, దక్షిణాఫ్రికాలాంటి మేటి జట్లను అవలీలగా మట్టికరిపించి... లీగ్‌ టాపర్‌గా నాకౌట్‌ బరిలో దిగిన టీమిండియాకు ఊహించని విధంగా న్యూజిలాండ్‌ చేతిలో చుక్కెదురైంది. ఈ టోరీ్నలో భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఐదు శతకాలతో రికార్డులకెక్కాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top