భారీ స్కోరు దిశగా టీమిండియా | Pujara Hundred Drives India past 300 | Sakshi
Sakshi News home page

భారీ స్కోరు దిశగా టీమిండియా

Jan 3 2019 12:37 PM | Updated on Jan 3 2019 1:10 PM

Pujara Hundred Drives India past 300 - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు నమోదు చేసింది. చతేశ్వర్‌ పుజారా(130 బ్యాటింగ్‌; 250 బంతుల్లో 16 ఫోర్లు), హనుమ విహారి(39 బ్యాటింగ్‌; 58 బంతుల్లో 5 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. గురువారం ఆరంభమైన చివరిదైన నాల్గో టెస్టులో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో  ఇన్నింగ్స్‌ను మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌లు ప్రారంభించారు. అయితే ఆదిలోనే టీమిండియాకు షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి రాహుల్‌(9) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో చతేశ్వర్‌ పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు మయాంక్‌. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మయాంక్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

అనంతరం పుజారాతో కలిసి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ క్రమం‍లోనే పుజారా హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే టీబ్రేక్‌ తర్వాత విరాట్‌ కోహ్లి(23)  ఔట్‌ కావడంతో భారత్‌ 180 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆపై పుజారాతో కలిసి 48 పరుగుల్ని జత చేసిన రహానే(18; 55 బంతుల్లో 1 ఫోర్‌) నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత హనుమ విహారితో కలిసి ఇన్నింగ్స్‌ను పుజారా చక్కదిద్దాడు. ఆ క్రమంలోనే పుజారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పుజారాకు టెస్టుల్లో 18వ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో మూడోది. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌వుడ్‌ రెండు వికెట్లు సాధించగా, స్టార్క్‌, లయన్‌లకు తలో వికెట్‌ దక్కింది.   

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

పుజారా మళ్లీ కొట్టేశాడు..

కోహ్లి సరసన పుజారా..!

మయాంక్‌ మరో రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement