పంకజ్‌ ఖాతాలో 23వ ప్రపంచ టైటిల్‌

Pankaj Advani And Aditya Mehta Wins World Team Snooker Title - Sakshi

ఆదిత్యతో కలిసి ఐబీఎస్‌ఎఫ్‌ టీమ్‌ టైటిల్‌ కైవసం

మండలే (మయన్మార్‌): భారత క్యూ స్పోర్ట్స్‌ దిగ్గజం పంకజ్‌ అద్వానీ మరో ప్రపంచ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఆదిత్య మెహ్రాతో జతకట్టిన అద్వానీ తాజాగా ప్రపంచ టీమ్‌ స్నూకర్‌ చాంపియన్‌íÙప్‌లో విజేతగా నిలిచాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్‌ స్నూకర్‌ సమాఖ్య (ఐబీఎస్‌ఎఫ్‌) మెగా ఈవెంట్‌లో బుధవారం జరిగిన ఫైనల్లో అద్వానీ–మెహ్రా జోడీ 5–2 ఫ్రేమ్‌ల తేడాతో పొంగ్సకార్న్‌–పొరమిన్‌ (థాయ్‌లాండ్‌) జంటపై విజయం సాధించింది.

బెస్టాఫ్‌ 9 ఫ్రేమ్‌ల తుదిపోరులో భారత అగ్రశ్రేణి జోడీ 65–31, 9–69, 55–8, 21–64, 55–44, 52–23, 83–9తో థాయ్‌ జంటను కంగుతినిపించింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత ద్వయం 4–1 ఫ్రేమ్‌ల తేడాతో థాయ్‌లాండ్‌కే చెందిన తనవత్‌ తిరపొంగ్‌పైబూన్‌–క్రిత్సనుత్‌ లెర్ట్‌సటయతోర్న్‌ జంటపై ఘనవిజయం సాధించింది. ఇటీవలే వ్యక్తిగత ప్రపంచ బిలియర్డ్స్‌ టైటిల్‌ నెగ్గిన అద్వానీ ఇప్పుడు 23వ ప్రపంచ చాంపియన్‌íÙప్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదిత్య మెహ్రాకు మాత్రం ఇదే తొలి టైటిల్‌.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top