ఓయూ మహిళల జట్టుకు టైటిల్‌

Osmania women team won national Sepak Takraw champions - Sakshi

ఆలిండియా సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల జట్టు సత్తా చాటింది. ఎల్బీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో మహిళల రెగూ, డబుల్స్‌ ఈవెంట్‌లలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన టైటిల్‌పోరులో ఉస్మానియా యూనివర్సిటీ 21–17, 21–13తో పంజాబ్‌ యూనివర్సిటీపై విజయం సాధించింది. మూడోస్థానం కోసం జరిగిన పోరులో మణిపూర్‌ యూనివర్సిటీ 21–14, 21–4తో ఎంజేపీ రోహిల్‌ఖండ్‌ యూనివర్సిటీపై గెలిచింది.

మరోవైపు మహిళల డబుల్స్‌ ఫైనల్లో ఉస్మానియా జట్టు 17–21, 21–14, 21–18తో మణిపూర్‌ యూనివర్సిటీపై గెలుపొందింది. పాటియాలా పంజాబీ యూనివర్సిటీ 21–17, 21–17తో కుమాయున్‌ యూనివర్సిటీపై నెగ్గి కాంస్యాన్ని గెలుచుకుంది. పురుషుల విభాగంలో ఉస్మానియా జట్టు త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. కాంస్య పతక పోరులో ఓయూ 22–20, 17–21, 3–21తో ఎంజేపీ రోహిల్‌ఖండ్‌ జట్టు చేతిలో పరాజయం పాలైంది. ఈ విభాగంలో అన్నా యూనివర్సిటీ విజేతగా నిలవగా, పాటియాలా పంజాబీ యూనివర్సిటీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పురుషుల రెగూ ఈవెంట్‌ తుదిపోరులో పంజాబీ యూనివర్సిటీ 21–12, 21–13తో అన్నా యూనివర్సిటీపై గెలుపొందింది. కాలికట్‌ యూనివర్సిటీ 21–13, 21–6తో ఎంజేపీ రోహిల్‌ఖండ్‌ యూనివర్సిటీపై గెలిచి మూడో స్థానాన్ని దక్కించుకుంది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఓయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. రామచంద్రం ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top