నిఖత్ శుభారంభం | nikhat grand opening in world youth boxing | Sakshi
Sakshi News home page

నిఖత్ శుభారంభం

Apr 16 2014 1:08 AM | Updated on Sep 2 2017 6:04 AM

నిఖత్ శుభారంభం

నిఖత్ శుభారంభం

ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు శుభారంభం చేశారు. మహిళల 51 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిఖత్ జరీన్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. పురుషుల విభాగంలో శ్యామ్ కకారా (49 కేజీలు), సతీశ్ కుమార్ (56 కేజీలు) కూడా ముందంజ వేశారు.

ప్రపంచ యూత్ బాక్సింగ్
 సోఫియా (బల్గేరియా): ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు శుభారంభం చేశారు. మహిళల 51 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిఖత్ జరీన్ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. పురుషుల విభాగంలో శ్యామ్ కకారా (49 కేజీలు), సతీశ్ కుమార్ (56 కేజీలు) కూడా ముందంజ వేశారు. గత చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన నిఖత్ తొలి రౌండ్ బౌట్‌లో 3-0తో ఇస్తిక్ నెరిమాన్ (టర్కీ)పై గెలిచింది. బుధవారం జరిగే రెండో రౌండ్‌లో లీ సుక్‌యోంగ్ (కొరియా)తో నిఖత్ తలపడుతుంది.
 
 పురుషుల విభాగంలో శ్యామ్ తన ప్రత్యర్థి అబ్దుల్లా అల్‌ముల్లా (యూఏఈ)ని ‘టెక్నికల్ నాకౌట్’ చేయగా... సతీశ్ 3-0తో నాందోర్ సోస్కా (హంగేరి)పై గెలిచారు. శ్యామ్ పంచ్‌ల ధాటికి అబ్దుల్లా రెండు రౌండ్‌ల తర్వాత బౌట్‌ను కొనసాగించలేని పరిస్థితిలోకి వెళ్లాడు. దాంతో రిఫరీ ‘టెక్నికల్ నాకౌట్’ పద్ధతిలో శ్యామ్‌ను విజేతగా ప్రకటించారు. గౌరవ్ సోలంకి (52 కేజీలు), నీల్ కమల్ సింగ్ (75 కేజీలు), మన్‌జీత్ (69 కేజీలు)... మహిళల విభాగంలో మంజూ బొంబారియా (75 కేజీలు) లకు తొలి రౌండ్ ‘బై’ లభించింది. భారత బాక్సింగ్ సమాఖ్యపై నిషేధం కొనసాగుతున్న కారణంగా ఈ మెగా ఈవెంట్‌లో భారత బాక్సర్లు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) పతాకం కింద పోటీపడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement