ధోనీపై విమర్శలు.. సచిన్‌ తాజా రెస్పాన్స్‌!

MS Dhoni did what was right for the team, says Sachin Tendulkar - Sakshi

టీమిండియా సీనియర్‌ ఆటగాడు, మాజీ సారథి ఎంఎస్‌ ధోనికి.. ఈసారి వరల్డ్‌ కప్‌ అస్సలు కలిసిరావడం లేదు. ఆడినా.. ఆడకపోయినా.. ఆఖరికీ కీపింగ్‌లోనూ ధోనీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లోనూ ధోనీ బ్యాటింగ్‌ శైలిపై సోషల్‌ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. నిజానికి ఈ మ్యాచ్‌లో భారత్‌ 350కి పైగా స్కోర్‌ సాధించే అవకాశం ఉండిందని, కానీ, ధోనీ స్లోగా ఆడటం వల్లే ఎక్కువ స్కోరు చేయలేకపోయామని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో తమ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొన్న ధోనీ 35 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌, ఆఫ్గనిస్థాన్‌ మ్యాచ్‌ల్లోనూ ధోనీ జిడ్డులాగా బ్యాటింగ్‌ చేయడం, స్ట్రైక్‌ రేటు చాలా తక్కువగా ఉండటంతో టీమిండియా మాజీ క్రికెటర్లు అతనిపై అసహనం వ్యక్తం చేశారు. కామెంటేటర్లుగా ఉన్న సౌరవ్‌ గంగూలీ, నాసర్‌ హుస్సేన్‌ మాత్రం ధోనీ బ్యాటింగ్‌ స్టైల్‌పై ఒకింత విస్మయం వ్యక్తం చేశారు. 

ఇలా ధోనీని విమర్శులు చుట్టుముట్టిన నేపథ్యంలో తాజాగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ మళ్లీ స్పందించాడు. ఇటీవల ఆఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో ధోనీ జిడ్డు బ్యాటింగ్‌ చేయడంతో తాను తీవ్ర నిరాశ చెందానని సచిన్‌ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం లిటిల్‌ మాస్టర్‌ ‘మిస్టర్‌ కూల్‌’కు అండగా నిలిచాడు. బంగ్లాతో మ్యాచ్‌లో ధోనీ చేసిన 35 పరుగులు టీమిండియాకు ఉపయోగపడ్డాయని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ బంగ్లాదేశ్‌పై 28 పరుగులతో విజయం సాధించి.. సెమీస్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 

ధోనీ ఎప్పుడు వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గురించే ఎక్కువగా ఆలోచిస్తాడని సచిన్‌ పేర్కొన్నాడు. ‘ధోనీ ఇన్నింగ్స్‌ ముఖ్యమైనది. జట్టుకు అవసరమైనదే ధోనీ చేశాడు. 50 ఓవర్లకు అతను ఆడివుంటే.. చివరివరకు అతను తన సహచరులకు అండగా ఉండేవాడు. అతడు మైదానంలో ఉన్నంతవరకు జట్టు కోసమే ఆడాడు. అతను జట్టుకే మొదటి ప్రాధాన్యమిస్తాడు. జట్టు అవసరాలకు ఏదైతే కావాలో దానిని ధోని పర్ఫెక్ట్‌గా చేశాడు’ అని సచిన్‌ కొనియాడారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top