మేఘన–తస్నీమ్‌ జంటకు ‘ఆసియా’ డబుల్స్‌ టైటిల్‌  | Meghana-Thasnem pair wins Asia doubles title | Sakshi
Sakshi News home page

మేఘన–తస్నీమ్‌ జంటకు ‘ఆసియా’ డబుల్స్‌ టైటిల్‌ 

Oct 8 2018 1:44 AM | Updated on Oct 8 2018 1:44 AM

Meghana-Thasnem pair wins Asia doubles title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. మయన్మార్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో అండర్‌–15 బాలికల డబుల్స్‌ విభాగంలో మారెడ్డి మేఘన రెడ్డి–తస్నీమ్‌ మీర్‌ జోడీ విజేతగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన మేఘన, గుజరాత్‌ అమ్మాయి తస్నీమ్‌ ఫైనల్లో 23–21, 21–18తో గాంగ్‌ యో జిన్‌–జియోంగ్‌ డా యోన్‌ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ పోరులో రెండు జోడీలు ప్రతీ పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. అయితే కీలకదశలో మేఘన–తస్నీమ్‌ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. 

ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు స్వర్ణం సహా నాలుగు కాంస్య పతకాలు లభించాయి. అండర్‌–15 బాలుర సింగిల్స్‌లో శంకర్‌ ముత్తుస్వామి సుబ్రమణియన్‌... అండర్‌–17 బాలికల సింగిల్స్‌లో అదితి భట్‌... అండర్‌–17 బాలుర సింగిల్స్‌లో మెరబా లువాంగ్‌... అండర్‌–15 బాలుర డబుల్స్‌లో పుల్లెల సాయివిష్ణు–గంధం ప్రణవ్‌ రావు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు దక్కించుకున్నారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement