కోహ్లీసేనపై మాజీ సెలెక్టర్‌ మండిపాటు! | Kohli Team Did Not Use Time Properly Says Former Selector Sandeep Patil | Sakshi
Sakshi News home page

Aug 14 2018 8:21 PM | Updated on Aug 14 2018 9:24 PM

Kohli Team Did Not Use Time Properly Says Former Selector Sandeep Patil - Sakshi

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ సందీప్‌ పాటిల్‌ విమర్శలు గుప్పించారు. వరుస టెస్టు మ్యాచుల్లో విఫలమైన టీమిండియా ఆటగాళ్లపై ఆయన మండిపడ్డారు. ఆటగాళ్లెవరూ సమయాన్ని సరిగా వినియోగించుకోవడంలేదని,  వార్మప్‌ మ్యాచ్‌కు ముందు లభించిన అయిదు రోజుల సమయాన్ని కోహ్లి బృందం వృథా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటన ప్రారంభానికి ముందు  సిరీస్‌కు చాలా సమయం ఉన్నందున ఇంగ్లండ్‌లో కాఫీ తాగుతూ ఎంజాయ్‌ చేస్తామని టీమిండియా సారథి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.  

దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం వెనువెంటనే ఇంగ్లండ్‌ పర్యటన ఖరారు చేశారని కోచ్‌ రవిశాస్త్రి విచారం వ్యక్తం చేయడంతో షెడ్యూల్‌లో మార్పులు చేశారని పాటిల్‌ తెలిపారు. వన్డే, టీ20 సిరీస్‌ల అనంతరం టెస్టు సిరీస్‌ను ఖరారు చేశారని గుర్తు చేశారు. నామమాత్రపు వార్మప్‌ మ్యాచ్‌ కూడా వేడి కారణంగా మూడు రోజుల్లోనే ముగిసిందని అలా మరో రోజు కలిసి వచ్చిందని అన్నారు. కానీ, దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని టెస్ట్‌ సిరీస్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధమవడంలో కోహ్లీసేన నిర్లక్ష్యం వహించిందని పాటిల్‌ అభిప్రాయపడ్డారు.

కాగా, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మొదటి టెస్టులో కోహ్లీ మినహా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో మ్యాచ్‌ చేజారింది. గెలుపు ముంగిట బోల్తాపడి 31 పరుగుల తేడాతో భారత్‌ పరాజయం పాలైంది. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ దెబ్బకు మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, చతేశ్వర్‌ పుజారా సహా అందరూ చేతులెత్తేయడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ 159 పరుగులతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయిదు టెస్టుల సిరీస్‌లో రెండు టెస్టులు ఓడిన టీమిండియా.. 0-2తో వెనకబడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement