ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు

Indonesia Open PV Sindhu Beat Chen Yufei And Enter Final - Sakshi

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన సెమీస్‌లో చైనా షట్లర్ చెన్ యుఫీని 46 నిమిషాల్లోనే చిత్తుచిత్తుగా ఓడించింది. శనివారం జరిగిన ఈ సెమీస్‌లో 21-19, 21-10 తేడాతో యుఫీని సింధూ మట్టికరిపించి తొలిసారి ఇండోనేషియా ఓపెన్‌ ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. మ్యాచ్‌ను చైనా షట్లర్‌ ధాటిగా ఆరంభించింది. సింధూపై మొదటి గేమ్‌లో 4-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే తేరుకున్న సింధు వెంట వెంటనే పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. 

తర్వాత దూకుడును పెంచిన సింధు అటాకింగ్‌ గేమ్‌తో మొదటి సెట్‌ను 21-19తో కైవసం చేసుకుంది. అనంతరం రెండో గేమ్‌లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వని సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో 21-10తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఇక ఫైనల్లో భాగంగా ఆదివారం జపాన్‌ స్టార్‌ క్రీడాకారిణి యమగూచితో సింధూ తలపడనుంది. ఇక సింధూ ఫైనల్‌కు చేరడంపై భారత బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బాయ్‌) ట్విటర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. ఐదో సీడ్‌ సింధు గోల్డ్‌ మెడల్‌ సాధించాలని బాయ్‌ ఆకాంక్షించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top