హుసాముద్దీన్‌కు రజతం | Sakshi
Sakshi News home page

హుసాముద్దీన్‌కు రజతం

Published Mon, Mar 11 2019 1:21 AM

Hussamuddin settles for silver in Finland - Sakshi

హెల్సింకి (ఫిన్లాండ్‌): ఈ సీజన్‌లోని మూడో అంతర్జాతీయ టోర్నమెంట్‌లోనూ భారత బాక్సర్లు తమ సత్తా చాటుకున్నారు. ఆదివారం ముగిసిన గీబీ బాక్సింగ్‌ టోర్నీలో భారత బాక్సర్లు ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలను సొంతం చేసుకున్నారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ (56 కేజీలు) రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. ఫైనల్లో భారత్‌కే చెందిన కవీందర్‌ బిష్త్‌ 5–0తో హుసాముద్దీన్‌ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.

శివ థాపా (60 కేజీలు), గోవింద్‌ సాహ్ని (49 కేజీలు), దినేశ్‌ డాగర్‌ (69 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. సెమీఫైనల్లో ఓడిన నవీన్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు), సుమీత్‌ సాంగ్వాన్‌ (91 కేజీలు)లకు కాంస్యాలు లభించాయి.  ఫైనల్స్‌లో శివ థాపా 1–4తో అర్‌స్లాన్‌ ఖతేవ్‌ (ఫిన్లాండ్‌) చేతిలో, గోవింద్‌ 2–3తో థిట్సియాన్‌ పన్మోద్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, ప్యాట్‌ మెకార్మక్‌ (ఇంగ్లండ్‌) చేతిలో దినేశ్‌ పరాజయం పాలయ్యారు. ఈ టోర్నీ కంటే  ముందు బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా స్మారక టోర్నీలో భారత బాక్సర్లు ఏడు పతకాలు... ఇరాన్‌లో జరిగిన మక్రాన్‌ కప్‌లో భారత బాక్సర్లు ఆరు పతకాలు సాధించారు.    

Advertisement

తప్పక చదవండి

Advertisement