‘నా కెరీర్‌లోనే అత్యంత చెత్త ఐపీఎల్‌’

Gautam Gambhir Says That Why Delhi Never Give Next Chance - Sakshi

ఆ వదంతులే నా కొంపముంచాయి!

సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్‌లో విజయవంతమైన ఆటగాడిగా, కెప్టెన్‌గా రాణించాడు టీమిండియా క్రికెటర్‌ గౌతం గంభీర్‌. అయితే ఐపీఎల్‌-11 (ప్రస్తుత) సీజన్‌ తన కెరీర్‌లోనే చెత్త ఐపీఎల్‌ సీజన్‌ అని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మాజీ కెప్టెన్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ ఇంటిముఖం పట్టాక.. కుటుంబంతో కలిసి చండీగఢ్‌లో ఉంటున్న గంభీర్‌ పేర్కొన్న అంశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

‘ఈ సీజన్‌లో ఢిల్లీ కేవలం 10 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే కొన్ని మ్యాచ్‌ల తర్వాత కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నా.. యాజమాన్యం నాకు మామూలు ఆటగాడిగానూ అవకాశం ఇవ్వలేదు. మీరెందుకు ఆ తర్వాత ఢిల్లీ జట్టులో ఆడలేదని కొందరు ఇప్పటికీ అడుగుతున్నారు. వాస్తవం వేరేలా ఉంది. ప్రధాన ఆటగాళ్లయిన రబడ, క్రిస్‌ మోరిస్‌లకు గాయాలు కావడంతో పాటు కొందరు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేశారు. దీంతో జట్టు వరుస వైఫల్యాలు చవిచూడాల్సి వచ్చింది. కీలక ఆటగాళ్లు సరైన సందర్భాల్లో రాణించకపోవడంతో ఈ సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన నాలో ఒత్తిడిని పెంచడంతో విఫలమయ్యాను. 

శ్రేయస్‌ అయ్యర్‌కి కెప్టెన్సీ ఇచ్చారు. చివరికి ఏమైంది. ఢిల్లీ జట్టు అత్యంత పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచింది. కెప్టెన్సీ నుంచి తప్పించాక నన్ను జట్టులోకి తీసుకోకపోగా.. గంభీర్‌ త్వరలో రిటైర్మెంట్‌ ప్రకటించి, ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తాడని వదంతులు ప్రచారం చేశారు. ఇందులో ఇసుమంతైనా నిజం లేదు. రిటైర్మెంట్‌ పై నేను ఎప్పుడూ ఆలోచించలేదు. జట్టు వైఫల్యాలతో పాటు నాపై వచ్చిన వదంతులు ఢిల్లీ జట్టులో మళ్లీ అవకాశం రాకుండా చేశాయంటూ’ గంభీర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top