చాలామంది కెరీర్‌ను నాశనం చేశాడు: బ్రేవో

Dwayne Bravo Bravo Takes A Dig At  Dave Cameron - Sakshi

ఆంటిగ్వా:  వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్‌ కామెరూన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రేవో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. తన కెరీర్‌ అర్థాంతరంగా ముగిసిపోవడానికి, అలాగే చాలామంది క్రికెట్‌ నుంచి వైదొలగడానికి కారణం కామెరూన్‌ ప్రతీకార చర్యలే కారణమంటూ విమర్శించాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన బ్రేవో.. కొన్ని నెలల క్రితం బోర్డుకు వచ్చిన కొత్త అధ్యక్షుడు రికీ స్కిరిట్‌తోనైనా తమ క్రికెట్‌ మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే డేవ్‌ కామెరూన్‌ పదవీ కాల ముగిసిపోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు బ్రేవో.  కామెరూన్‌ పదవీ కాలం ముగియడంతో తమ క్రికెట్‌ బోర్డుక మంచి రోజులు వచ్చాయన్నాడు. సుదీర్ఘకాలం పని చేసిన కామెరూన్‌ నియంత పోకడలతో క్రికెట్‌ బోర్డును నాశనం చేశాడన్నాడు. అతని వైఖరి వల్ల పలువురు  క్రికెటర్లు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పారన్నాడు.

2017లో వెస్టిండీస్‌ తరఫున బ్రేవో చివరి మ్యాచ్‌ ఆడాడు. కాగా, గతేడాది విండీస్‌ బోర్డు నిర్ణయాలతో విసుగు చెంది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. అయితే ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌ రిజర్వ్‌ ఆటగాళ్లలో బ్రేవోకు స్థానం కల్పించడం గమనార్హం. టెస్టుల్లో 2,200 పరగులతో పాటు 86 వికెట్లు సాధించిన బ్రేవో.. వన్డేల్లో 2,968 పరుగులు సాధించడంతో పాటు 199 వికెట్లు తీశాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో 1,142 పరుగులు చేయగా 52 వికెట్లను సాధించాడు. 2014లో భారత పర్యటనలో భాగంగా విండీస్‌ కెప్టెన్‌గా బ్రేవో వ్యవహరించిన సమయంలోనే బోర్డుపై తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. జీతభత్యాల విషయంలో  బోర్డు అలసత్వం ప్రదర్శించడంతో ఉన్నపళంగా పర్యటనను రద్దు చేసుకుని విండీస్‌కు వెళ్లిపోయాడు.  దాంతో ఆ పర్యటనలో భారత్‌-విండీస్‌ జట్ల మధ్య జరగాల్సిన ఐదో వన్డే రద్దయ్యింది. అంతకుముందు భారత్‌తో ఆ సిరీస్‌లో ఆడిన నాల్గో వన్డేనే  బ్రేవోకు విండీస్‌ తరఫున చివరి వన్డే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top