అప్పుడు దాని విలువ తెలియలేదు: నెహ్రా | Didn't understand value of playing for India when I was young, says Ashish Nehra | Sakshi
Sakshi News home page

అప్పుడు దాని విలువ తెలియలేదు: నెహ్రా

Oct 6 2017 3:47 PM | Updated on Oct 6 2017 5:23 PM

Didn't understand value of playing for India when I was young, says Ashish Nehra

న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాతో జరిగే మూడు ట్వంటీ 20 సిరీస్ లో భారత వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రాకు జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలకు అవకాశం ఇవ్వని సెలక్టర్టు.. ఆశిష్ నెహ్రాపై మాత్రం నమ్మకం ఉంచి అతన్ని ఎంపిక చేశారు. గత ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెహ్రా చివరిసారి  కనిపించాడు. కాగా, చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో ఆశిష్ నెహ్రాకు తొలుత చోటు కల్పించినా, మోకాలి గాయం కారణంగా దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం నెహ్రా పూర్తి ఫిట్ నెస్ ను నిరూపించుకోవడంతో అతని జట్టులోకి రావడానికి మార్గం సుగుమం అయ్యింది.

తన పునరాగమనంపై స్పందించిన నెహ్రా.. మరికొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఒకవేళ తన శరీరం ఆటకు అనుకూలించిన పక్షంలో ఆడితే మాత్రం అప్పుడు సంతోషంగ ఉండేవాడిని కాదన్నాడు. తాను అన్నివిధాలుగా ఫిట్  గా ఉండటంతో ఆడటానికి ఎటువంటి అభ్యంతరం లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఈ క్రమంలోనే తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నిస్తూనే ఉన్నానని నెహ్రా స్పష్టం చేశాడు. '38-39 ఏళ్ల వయసులో ఫాస్ట్ బౌలర్ గా రాణించడం చాలా కష్టం.. కాకపోతే నా ఫిట్ నెస్ పరంగా నాకు ఇబ్బందులు లేవు. నాకు నా శరీరం అన్ని విధాలుగా సహకరిస్తుంది. దాంతో మరికొన్ని సంవత్సరాలు ఆడతానని ఆశిస్తున్నా. మనం యుక్త వయసులో ఉన్నప్పుడు దేన్నీ పెద్దగా అర్ధం చేసుకోం. అప్పుడు భారత జట్టుకు ఆడే విలువ తెలియదు. గత 7-8ఏళ్లలో నేను చాలా క్రికెట్ మిస్సయ్యాను. కానీ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకునే యత్నం చేయలేదు. ఫలితాల్ని సాధించడం కోసం కృషి చేస్తూనే  ఉన్నా. దాంతోనే మళ్లీ జట్టులోకి వచ్చా'అని నెహ్రా తెలిపాడు.

ప్రస్తుతం తాను ఉన్న స్టేజ్ లో ఎటువంటి ప్రణాళికలు లేవని పేర్కొన్న నెహ్రా.. ప్రతీ సిరీస్ ను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతానన్నాడు. వచ్చే ఐపీఎల్లో తాను ఆడటంపై హామీ ఇవ్వలేనన్నాడు. అలాగే తన కెరీర్ ఎప్పుడు వరకూ సాగుతుందో కచ్చితంగా చెప్పలేనన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement