150 బంతుల్లో 248 పరుగులు 30 ఫోర్లు, 7 సిక్సర్లు
ఉప్పెనొచ్చినా... శిఖర్ ధావన్కు మూడొచ్చినా పెద్ద తేడా ఉండదేమో. ఆ ధాటికి ఎవరైనా అల్లాడిపోవాల్సిందే. దక్షిణాఫ్రికా ‘ఎ’ బౌలర్లు అలాంటి ఉప్పెన బారిన పడ్డారు. వన్డేలో టి20ని మించిన వేగంతో ధావన్ బాదుతుంటే... ఫీల్డర్లు ప్రేక్షకులయ్యారు. విధ్వంసకర ఇన్నింగ్స్తో బౌలర్లను చితక్కొట్టి వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత క్రికెటర్గా అవతరించాడు.
ప్రిటోరియా: శిఖర్ ధావన్ మళ్లీ శివమెత్తాడు...అది అంతర్జాతీయ మ్యాచ్ అయినా, ఐపీఎల్ అయినా, మరొకటి అయినా తన శైలి దూకుడేనని నిరూపించాడు. 50 ఓవర్ల మ్యాచ్లో సెంచరీ చేయడమే ఘనతగా భావించే చోట...భారీ డబుల్ సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అతను కొద్ది తేడాతో ప్రపంచ రికార్డును కోల్పోయాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’తో సోమవారం ఇక్కడ జరిగిన వన్డే మ్యాచ్లో ధావన్ 150 బంతుల్లోనే 248 పరుగులు చేశాడు. ఇందులో 30 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ధావన్ చేసిన మొత్తం పరుగుల్లో 162 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అంతర్జాతీయ మ్యాచ్లను మినహాయిస్తే...లిస్ట్ ఎ క్రికెట్(అంతర్జాతీయ మ్యాచ్ కానిది ‘లిస్ట్ ఎ’)లో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ‘ఎ’ స్థాయి క్రికెట్లో ఇప్పటి వరకు ఎవరూ డబుల్ సెంచరీ చేయలేదు. సాధారణ పిచ్లతో పోలిస్తే ఇక్కడి డివిలియర్స్ ఓవల్ వికెట్ మరీ ఫ్లాట్గా ఉండటం, బౌండరీలు బాగా చిన్నవిగా ఉండటం కూడా ధావన్కు కలిసొచ్చింది.
జోరుగా ఆరంభం...: విల్జోన్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే లాంగ్ ఆఫ్ దిశగా ఫోర్ కొట్టి విధ్వంసానికి ధావన్ బోణీ చేశాడు. విల్జోన్ తర్వాతి ఓవర్లోనే వరుసగా మూడు ఫోర్లు కొట్టి వేగం పెంచిన భారత బ్యాట్స్మన్, వాండర్మెర్వ్ ఓవర్లో మళ్లీ మూడు బౌండరీలు బాదాడు. డీప్ మిడ్ వికెట్, డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా పుల్ షాట్తో రన్స్...కవర్, మిడాఫ్ మీదుగా చక్కటి డ్రైవ్లు...ఆఫ్ స్టంప్ బయట పడిన బంతిని స్క్వేర్ కట్తో బౌండరీకి...ఇలా విభిన్న షాట్లతో ధావన్ పరుగులు రాబట్టాడు. 31 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. అనంతరం అతను కాస్త నెమ్మదించాడు. ఫలితంగా సెంచరీ మార్క్ను చేరుకోవడానికి ధావన్కు మరో 55 బంతులు అవసరమయ్యాయి. సెంచరీ వరకు ధావన్ ఇన్నింగ్స్లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం విశేషం.
46 బంతుల్లోనే...: సెంచరీ తర్వాత ధావన్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. థెరాన్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి గేర్ మార్చిన అతను...హెండ్రిక్స్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఇన్నింగ్స్ 40 ఓవర్ రెండో బంతికి ఎక్స్ట్రా కవర్ దిశగా సింగిల్ తీసి 132 బంతుల్లో ధావన్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే జార్స్ వెల్డ్ ఓవర్లో మళ్లీ మూడు ఫోర్లు...హెండ్రిక్స్ ఓవర్లో రెండు సిక్స్లు...ఇలా ఏ దశలోనూ భారత ఆటగాడు తగ్గలేదు. వరల్డ్ రికార్డుకు మరో 20 పరుగుల దూరం...ఇంకా ఇన్నింగ్స్లో ఐదు ఓవర్లు మిగిలి ఉన్నాయి...జోరు చూస్తే రికార్డు ఖాయమనిపించిన దశలో ధావన్ అవుటయ్యాడు.
బౌలర్లకు హెచ్చరిక
ఇకపై అంతర్జాతీయ క్రికెట్లో బౌలర్లు ఎవరైనా... భారత్తో మ్యాచ్ అంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. శిఖర్ ధావన్ను కట్టడి చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందే. విధ్వంసానికి మారుపేరులా ఆడే ఈ స్టార్ ఓపెనర్... తాజాగా డబుల్ సెంచరీతో పెను సంచలనం సృష్టించాడు. తాను టాప్ గేర్లో ఆడితే ఎలా ఉంటుందో దక్షిణాఫ్రికా యువ బౌలర్లకు చూపించాడు. పేరుకు ఇది ‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్ అయినా... రెండు జట్లలోనూ దాదాపుగా అందరూ అంతర్జాతీయ ఆటగాళ్లే ఉన్నారు. థెరాన్, ఆంటాంగ్, వాండర్మెర్వ్ పేరున్న బౌలర్లు. వీళ్లని ఎదుర్కొని ఈ ఇన్నింగ్స్ ఆడటం అద్భుతమే. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి ఏడాది కూడా గడవక ముందే శిఖర్ ధావన్ సంచలనం సృష్టించాడు. ఆడిన తొలి టెస్టులోనే ఆస్ట్రేలియాపై ఆకట్టుకున్న ఈ స్టార్ ఓపెనర్... చాంపియన్స్ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలవడం ద్వారా విదేశాల్లోనూ ఆడే సత్తా తనలో ఉందని నిరూపించాడు.
అయితే దక్షిణాఫ్రికాలోనే అసలైన పరీక్ష... అంటూ విశ్లేషకులు ధావన్ను హెచ్చరించాడు. ఈ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత జట్టులో స్థానం కచ్చితంగా ఉండాలంటే ప్రస్తుత ‘ఎ’ పర్యటనలో రాణించాలనే ఒత్తిడి యువ క్రికెటర్లందరిపై ఉంది. ముక్కోణపు టోర్నీలో ఫైనల్కు చేరాలంటే దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో భారత్ గెలిచి తీరాలి. ఈ నేపథ్యంలో విపరీతమైన ఒత్తిడి. సిరీస్లో ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్ల్లో (15, 85) ఓ మాదిరిగా ఆడినా... అసలైన మ్యాచ్లో చెలరేగిపోయాడు. నిజానికి ఈ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా ‘ఎ’ తో మ్యాచ్లో ధావన్కు విశ్రాంతి ఇచ్చారు. కానీ కీలకమైన మ్యాచ్ కావడంతో మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇన్నాళ్లూ ధావన్ మంచి ఇన్నింగ్స్ ఆడినా.. ఈ వన్డే డబుల్ సెంచరీ తన ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుతుంది. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాలో రాణించేందుకు స్ఫూర్తినిస్తుంది.
‘ధావన్ ఆడుతుంటే ఏదో హైలైట్స్ చూస్తున్నట్లు అనిపించింది. కొన్ని సిక్స్లు బయట నిర్మాణం జరుగుతున్న బిల్డింగ్లో పడ్డాయి. నేను చూసిన అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ధావన్ మమ్మల్ని చితక్కొట్టాడు.’
-అంటాంగ్, దక్షిణాఫ్రికా ‘ఎ’ కెప్టెన్
50 ఓవర్ల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా ధావన్ రికార్డు నెలకొల్పాడు. సెహ్వాగ్ (219), సచిన్ (200 నాటౌట్) గతంలో భారత్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు.
లిస్ట్ ఎ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు సర్రే బ్యాట్స్మన్ అలిస్టర్ బ్రౌన్ పేరిట ఉంది. 2002లో కౌంటీ క్రికెట్లో గ్లామోర్గాన్తో జరిగిన మ్యాచ్లో బ్రౌన్ 160 బంతుల్లో 30 ఫోర్లు, 12 సిక్సర్లతో 268 పరుగులు చేశాడు.
- సాక్షి క్రీడావిభాగం