ఊహించని రికార్డు | Sakshi
Sakshi News home page

ఊహించని రికార్డు సాధించిన పుజారా!

Published Wed, Jan 17 2018 2:44 PM

Cheteshwar Pujara first Indian to be run out in both innings of a Test - Sakshi

సెంచూరియన్‌: టెస్టుల్లో మంచి రికార్డు ఉన్న టీమిండియా బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో నిరాశపరిచాడు. ముఖ్యంగా రెండో టెస్టులో అతడు అవుటైన విధానం అభిమానులకు మింగుడుపడటం లేదు. నిలకడకు చిరునామాగా పేరుగాంచిన పుజారా రెండు ఇన్నింగ్స్‌లోనూ అనూహ్యంగా రనౌటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే అనవసర పరుగుకోసం యత్నించి గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసి రనౌటయ్యాడు. దీంతో ఊహించని రికార్డు అతని పేరిట నమోదైంది. టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లోనూ రనౌటైన మొదటి భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు 25 మంది ఈవిధంగా అవుటయ్యారు. 

ఎంతో సంయమనంతో ఆచితూచి ఆడే పుజారా రెండుసార్లు కీలక సమయంలో అవుట్‌ కావడంతో ఆ ప్రభావం జట్టుపై పడింది. అడ్డుగోడగా నిలబడే ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌
తొందరగా పెవిలియన్‌ చేరడంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్టులోనూ పుజారా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ కలిపి 30 పరుగులు మాత్రమే చేశాడు. చివరి టెస్టులోనైనా అతడు రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చతేశ్వర పుజారా గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరిన సంగతి తెలిసిందే. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అనవసర పరుగుకోసం యత్నించిన పుజారా రనౌట్‌గా నిష్ర్కమించాడు. భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా మోర్నీమోర్కెల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ నాల్గో బంతిని ఎదుర్కొన్న పుజారా మిడాన్‌ మీదుగా ఆడాడు. అయితే అదే క్రమంలో రాని పరుగు కోసం ప్రయత్నించాడు.

Advertisement
Advertisement