విజయం దిశగా ఆంధ్ర | andhra towards andhra | Sakshi
Sakshi News home page

విజయం దిశగా ఆంధ్ర

Jan 8 2015 1:12 AM | Updated on Jun 2 2018 5:38 PM

రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు సొంతగడ్డపై రెండో విజయానికి సిద్ధమైంది. గ్రూప్-సిలో జార్ఖండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆంధ్ర విజయానికి కేవలం 37 పరుగుల దూరంలో ఉంది.

సాక్షి, విజయనగరం: రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు సొంతగడ్డపై రెండో విజయానికి సిద్ధమైంది. గ్రూప్-సిలో జార్ఖండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆంధ్ర విజయానికి కేవలం 37 పరుగుల దూరంలో ఉంది. మూడో రోజు బుధవారం 179/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 99.5 ఓవర్లలో 304 పరుగుల వద్ద ఆలౌటైంది. శివకుమార్ (64), ప్రదీప్ (53) అర్ధసెంచరీలు చేశారు.

ఆంధ్రకు 58 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. ప్రకాశ్ ముండ (29), దేవోబ్రత్ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆంధ్ర బౌలర్లలో స్టీఫెన్ (6/32) చెలరేగగా, హరీశ్ 2 వికెట్లు తీశాడు. తర్వాత 47 పరుగుల సునాయాస లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 10 పరుగులు చేసింది.

 రసవత్తరంగా హైదరాబాద్ మ్యాచ్
 అగర్తలా: ఇదే గ్రూపులో హైదరాబాద్, త్రిపుర జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా మారింది. మొదట రవితేజ (128 బంతుల్లో 100 నాటౌట్, 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేసిన వెంటనే ఓవర్‌నైట్ స్కోరుకు 4 పరుగులు జోడించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌ను 127.4 ఓవర్లలో 491/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో హైదరాబాద్‌కు 307 పరుగుల ఆధిక్యం లభించింది.

తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన త్రిపుర ఆట ముగిసే సమయానికి 81 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. రాకేశ్ సోలంకి (71 నాటౌట్), ఉదియన్ బోస్ (63) రాణించారు. చివరి రోజు గురువారం మిగతా 6 వికెట్లను త్వరగా తీసి లక్ష్యాన్ని ఛేదిస్తే రవితేజ సేన ఈ సీజన్‌లో బోణీ చేస్తుంది. బౌలర్లు విఫలమైతే డ్రా ఫలితం ఎదురయ్యే అవకాశముంది. సీజన్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లను హైదరాబాద్ డ్రా చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement